Thursday 23 July 2020

ధర్మ సందేహాలు - పూజలలో కొబ్బరికాయ విశిష్టత ఏమిటి? మరికొన్ని ప్రశ్నలు...


మన హిందు సాంప్రదాయంలో పూజ అంటే ముందుగా కావలసినది కొబ్బరికాయ. కొబ్బరికాయ కొట్టకుండా చేసే పూజ అసలు సంతృప్తిని ఇచ్చినట్టే ఉండదు. అంతగా పూజకు కొబ్బరికాయకు మనకు ఆత్మీయత కుదిరిపోయింది. అటువంటి కొబ్బరికాయకు సంబంధించిన సందేహాలు ఇక్కడ చర్చించుకుందాము.
1.కొబ్బరికాయకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?
కొబ్బరికాయకు మనకు పోలిక ఉంది. కొబ్బరికాయ పైన ఉన్న దళసరి పెంకు మన అహంకారానికి, లోపలి కొబ్బరి మన మనస్సుకూ ప్రతీకలు. కొబ్బరికాయ కొట్టడమంటే మన అహంకారాన్ని విడనాడి, ఆతెల్లని కొబ్బరి లాంటి మన మనస్సును స్వామి ముందు పరచామనీ ఆ మనస్సును ( కొబ్బరిని ) స్వీకరించి నిర్మలమైన కొబ్బరి నీరు లాంటి జీవితమును ప్రసాదించమనీ అర్థం అందులో ఉంది. అందుకే కొబ్బరికాయ మన పూజలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
2. పీచు తీసిన కొబ్బరికాయను కొట్ట కూడదా?
మన శరీరానికి చర్మం ఎంత అవసరమో, కొబ్బరికాయకు పీచూ అంతే అవసరము. ఈ పీచును కొట్టే ముందు తీయకూడదు. కొట్టినతరువాత తీయాలి. కొబ్బరికాయ మొదలులో ఉన్న 3 కన్నాల దగ్గరా చిప్ప కాస్త మెత్తగా ఉంటుంది. ముందరే పీచుతీయడం వలన ఆ కన్నాల ద్వారా బాక్టీరియా కాయలోనికి త్వరగా ప్రవేశించి కాయ పాడయిపోయే అవకాశం ఉంది. ( మీరు గమనించే ఉంటారు కొబ్బరి కాయ కుళ్లడం అంటూ జరిగితే అది మొదలు నుండే జరుగుతుంది. లేదా కొబ్బరికాయకు పగులు వస్తే ఆ పగులు వద్ద కుళ్లుతుంది. ) కనుక ముందు పీచుతీయకూడదు అంటారు.
3. మరి కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు ఎందుకు తీయాలి?
కొబ్బరికాయను దేమునికి ప్రసాదంగా పెడుతున్నాము. ఆ ప్రసాదంగా పెట్టే కొబ్బరికాయ బాగుందో లేదో చూచుకుని పెట్టాలి కదా!? కానీ వాసన చూడకూడదు, రుచి చూడకూడదు ( దేముని ప్రసాదం కనుక ) . మరి వాసన చూడకుండా, రుచి చూడకుండా కొబ్బరికాయ బాగుందో పాడైపోయిందో ఎలా తెలుసుకోవడం? కొన్ని సార్లు కంటికి బానే ఉన్నట్టు కనబడినా రుచి చూసిన తరువాత పాడయి పోయిందని తెలుస్తుంది. అలా పాడయి పోయిన కాయను తెలుసుకోవడం ఎలా? దానికోసమే కొబ్బరికాయ వెనకాల పీచుతీసి మూడు కన్నాల వద్ద నొక్కి చూడాలి. ఎక్కడైనా మెత్తగా నొక్కు బడితే అది పాడయి పోయిందని అర్థం. అలా నొక్కు బడక మామూలుగా ఉంటే బాగుందని. ఆవిధంగా కంటికి కనబడని కొబ్బరికాయలోని లోపాన్ని కూడా తెలుసుకోవడానికే కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు తీయాలి.
4. కొబ్బరి కాయకు పసుపు కుంకుమ రాయడం సబబేనా?
పసుపు, దాని నుండి తయారైన కుంకుమ మనకు అత్యంత పవిత్రమైనవి. వాటిని కొబ్బరికాయకు అలంకరించడం ఒకవిధంగా సబబే. అందువలన ఆ కాయచుట్టూ ఉన్న వ్యాధికారక క్రిములు నశిస్తాయి. కానీ కొబ్బరికాయను కొట్టిన తరువాత కొబ్బరిపై కుంకుమ పెడతారు. ఇది ఎంత మాత్రమూ సరిఅయినది కాదు. మనం భగవంతుడు వచ్చాడు అని నమ్మి అతనకి పూజ చేస్తాము. ఆ విధంగా మన ఇంటికి వచ్చిన భగవంతునికి షోడశోపచార పూజలో భాగంగా నైవేద్యముగా ఈ కొబ్బరిని సమర్పిస్తున్నాము. అంటే మన ఇంటికి ఒక అథిధిని పిలిచి ఫలహారం పెట్టడం లాంటిది. మనం కొబ్బరి తింటే, లేదా వచ్చిన అథిధికి పెడితే కుంకుమా పసుపుతో ఉన్న కొబ్బరి తినం కదా!? కుంకుమ ఉంటే కడుక్కుని మరీ తింటాము. మరి అలాంటాప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రం కుంకుమా పసుపూ చల్లి పెట్టడం తప్పేకదా!? 🙂 ఇదే కాదు మరే ప్రసాదమైనా సరే మనం ఎంత శుభ్రమైనది, నాణ్యమైనదీ తింటామో అంతే పవిత్రమైనది మాత్రమే స్వామికి నివేదించాలి.

No comments:

Post a Comment