Thursday 23 July 2020

మహిళలందరికీ సవినయమైన విజ్ఞప్తి.



గత వంద సంవత్సరాల క్రితం ప్రపంచమంతా మనందరం ఇప్పుడు అనుభవిస్తున్న విపత్తు ఏర్పడింది.
ఈ 2020 సంవత్సరంలో ఒక్క మన దేశంలోనే వేలాది మంది ఈ కరోనా కారణంగా తమ ప్రాణాలను కోల్పోయారు. ఇంకా కోల్పోతున్నారు.
ప్రభుత్వాలు ఎన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నా , ఎవరి జాగ్రత్త లో వారు ఉండటమనేది ప్రతి పౌరుని కనీస బాధ్యత.
" Prevention is better than Cure " అనే సామెత ప్రకారం ప్రతి పౌరుడు తమ జాగ్రత్తలో తాము ఉండటం అనేది వారికి మంచిది మరియు ఈ దేశానికి కూడా మంచిది.
" Stay Home Stay Safe " అనే సూత్రాన్ని ప్రతి పౌరుడు పాటించడమనేది ప్రాధమిక బాధ్యత.
ఎంతో తప్పనిసరైతే తప్ప ఎవ్వరూ ఇల్లు విడిచి బయటకు వెళ్ళ కూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్ళవలసిన పరిస్థితులలో ముఖానికి మాస్క్ లు ధరించడం తప్పనిసరి.
ముఖ్యాతి ముఖ్యంగా 65 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులు కొంతకాలం పాటు అసలు బయటకు వెళ్ళకుండా ఉండటం అనేది అత్యుత్తమం.
ఈ విషయంలో ఎంతోమంది ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం ఎంతో శోచనీయం.
ఒక వ్యక్తి రోడ్డు మీద అతి వేగంగా నిర్లక్ష్యంగా తన వాహనాన్ని నడుపుతూ వెళ్ళడం వలన , అది ఆ ఒక్క ఆ వ్యక్తికి మాత్రం ప్రమాదం కాదు. అదే రోడ్డు మీద నడచి వెడుతున్న ఎందరో అమాయకులకు కూడా ప్రమాదమే.
అదే విధముగా " నేను మాస్క్ ధరించక పోవడం వలన నా కేం కాదు " అనే నిర్లక్ష్య ధోరణిలో ఒక వ్యక్తి వ్యవహరిస్తే , అది మీకే కాదు మీ లాంటి ఎందరో అమాయకులకు కూడా ప్రమాదమనే విషయాన్ని ప్రతి పౌరుడు గ్రహించాలి.
సముద్రంలో కెరటాలు ఉథృతంగా వస్తున్న తరుణంలో ప్రక్కకు తప్పుకోవాలి. కానీ ఎదురెళ్ళ కూడదు. ప్రస్తుతం మనం ఇదే పరిస్థితులలో ఉన్నాం. నా కేం కాదు అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎవ్వరికీ క్షేమదాయకం కాదు.
ముఖ్యంగా మహిళామణులందరికీ విజ్ఞప్తి.
మీరు శ్రావణ మంగళ వారము నోములు మరియు శ్రావణ శుక్రవారము పూజలు వ్రతాలు మానవద్దు.
నిక్షేపంగా మీరు మీ ఇంటికే పరిమితమై చేసుకోండి. ముత్తయిదువులకు తాంబూలం ఇవ్వాలి. పేరంటాలకు వెళ్ళి తాంబూలం తీసుకోవాలి . అనే చాదస్తాలకు పోయి మీరు ఇబ్బంది పడవద్దు. మీ తోటి ముత్తయిదువలను ఇబ్బంది పెట్టవద్దు. మీ చాదస్తం వలన మీరు వారింటికి వెళ్ళడం వలన ఎవరికి ఏమాత్రం ఇబ్బందులు కలిగినా మీరే నిందలు పడే పరిస్థితులలో ఉన్నారు .
సాక్షాత్ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయములో , కాశి విశ్వేశ్వరుని దేవాలయములో , కోట్లాది మంది వచ్చి దర్శించుకునే పూరీ జగన్నాథుని రథయాత్ర దర్శనాలనే ఈ విపత్తు కారణంగా షుమారు మూడు నెలల పైనే నిలిపివేసారు.
ఆ దైవాల కన్నా మనమేమి గొప్ప వారమేమి కాదు.
మహిళలందరూ ప్రస్తుత విపత్కర పరిస్థితులలో మీరు తగిన జాగ్రత్తలో మీరు ఉండి ఈ విపత్తును అధిగమించడానికి మీ వంతు సహకారం అందించాలని రెండు చేతులు జోడించి సవినయంగా ప్రతి ఒక్కరినీ అభ్యర్ధిస్తున్నాను.

మీ ఆకాంక్క్ష ఏడూర్

No comments:

Post a Comment