Sunday 26 February 2017

శివ మానస పూజ (ఆది శంకరాచార్య)


ఎందఱో మహనీయులు ఎందరోమహానుభావులు ఎందరు భక్తులు వేరెందరో శ్రేయోభిలాషులు ఇంకెందరో వేద పండితులు శివ మహిమలు శివరాత్రి మహిమలను గూర్చి తెలిపియున్నారు.వానిని ఆచరించ గలిగిన వాళ్ళు ఒకప్రక్క నుండగా చేయలేని నాలాంటి వారు కూడా ఉండటము నిజము.
అటువంటి వారు శివలింగముపై ఒక లోటా నీరు పోసి ఒక బిల్వదళమును పెట్టి ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులచే రచింపబడిన ఈ 5 శ్లోకములను చదువుకొని మనసారా శివునికి నమస్కరించుకొని పరమేస్వరానుగ్రహ ప్రాప్తి పొందుతారని మనసారా ఆకాంక్షించుచున్నాను.
పరమేశ్వరునికి భక్తీ ప్రపత్తులతో కూడిన శోడశోపచారములతో కూడిన ఆత్మనివేదనము ఈ శ్లోకముల సారాంశము.
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||
రత్నమయమైన పీఠము పై విరాజిల్ల జేసి,సాంబశివునికి, హిమజలం అంటే గంగా జలముతో అభిషేకము చేసి దివ్యాంబరములు చుట్టి సువర్ణ మణిభూషలచే అలంకరించి మృగమదము అనగా కస్తూరి కలసిన చందనమునలది ,జాజి ,సంపెంగ,బిల్వ అనగా మారేడు దళములతో అలంకరించి ధూప దీపములను సమర్పించి , దయానిధివైన ఓ సకలచరాచరాధినాథా నేను మానసికముగా అర్పించిన వీనిని స్వీకరించి నన్ననుగ్రహించు స్వామీ అని వేడుకొంటున్నాడు ఈ జీవాత్మ.
సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||
రత్న ఖచితమైన బంగారు పాత్రలలో నెయ్యి, పాయసము, పంచభక్ష్యాలు, పాలు పెరుగు అరటిపళ్ళ పానకము ఇంకనూ అనెకవిధములైన శాకపాకములతో శుభ్రమగు జలముతో యథాశక్తి నైవేద్యము మానసికంగా సమర్పించుచున్నాను ప్రభో దయతో స్వీకరించు.
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహళకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||
ఛత్రము చామరము(చమరీమృగ కెశములతో చేయబడిన వింజామర)నిర్మలమైన దృశ్యములు, కర్ణపేయమైన చిత్త శాంతిని కల్గించు సంగీతముతో నృత్యముతో, పరమాత్మా,నిన్ను రంజింపజేసి స్తుతించి ,ప్రణుతించి ,సాష్టాంగ నమస్కృతులాచరించి మానసికంగా పైవన్నియూ నీకు సమర్పించి పూజించుకోనుచున్నాను మహాప్రభో.
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||
ఆత్మవు నీవు తల్లి పార్వతి మనస్సు సహచరులా ప్రాణములు ఇక శరీరమా అది గృహము పూజ అంటావా నీకే అర్పితమైన నేననుభవించే భోగములే. నిద్రావస్తాయే సమాధి స్థితి . సంచారము నీ ప్రదక్షిణము దుర్గాటములైన గిరులను గూర్చిన తలపులే నీకు నే సమర్పించే స్తోత్ర పాఠములు. నేను పైన తెలిపిన ఏ ఏ కర్మల నాచరించుచున్నానో అవి అన్నియు నీ ఆరాధనముగానే భావించుచున్నాను. నన్ను కటాక్షించు మహాప్రబో !
కరచరణ కృతంవా కర్మ వాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహితమహితంవా సర్వామే తక్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో // 5 //
పరమేశ్వరా నా చేతుల చేతలచే గానీ మనో వాక్కులచే గానీ శ్రవణము చేత గానీ దృష్టి చేతగానీ మనసు చేత గానీ (మనోవాక్కాయకర్మలచే)నీకు తెలిసియో తెలియకనో చేసిన నచ్చునట్టి, నచ్చనట్టి పనుల నన్నిటిని కరుణా సముద్రుడవైన మహాప్రభో క్షమించు.
 నమస్తే నమస్తే నమస్తె నమః
తత్సత్

మాఘపురాణం - 11వ అధ్యాయం


మార్కండేయుని వృత్తాంతము
వశిష్ఠుడుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీవిశ్వనాథుని దర్శనం, విశ్వనాధుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి –
మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును. శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈవిధంగా చెప్పదొడగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. “కుమారా! నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను, గురువులయెడ పెద్దలయెడ బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. గాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును” అని చెప్పిరి.
అటుల పదిహేను సంవత్సరములు గడిచిపొయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెననీ తలచి మహాఋషులందరకు ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిథి సత్కారములు జేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, అతడు మార్కండేయుని వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి “మహానుభావా! మీరట్లు వారించుటకు కారణమేమి?” అని ప్రశ్నించారు.
అంత వశిష్ఠుల వారు “ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఈతనిని “దీర్ఘాయుష్మంతుడవు కమ్ము” అని దీవించితిరి గదా! అదెటుల అగును? ఈతని ఆయుర్దాయము పదహారేండ్లే కదా! ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము యీతడు ఒక్క సంవత్సరమే జీవించును” అని నుడివిరి. అంతవరకూ మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాల విచారించిరి. “చిరంజీవివై వర్ధిల్లు”మణి దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి “దీనికి మార్గాన్తరము లేదా? యని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి “మునిసత్తములారా! వినుడు. మనమందరము యీ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహదేవుని వద్దకు పోవుదము.రండి” అని పలికి తమవెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి.
మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ “చిరంజీవిగా జీవించు నాయనా”యని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి “భయపడకు” అని మార్కండేయుని దగ్గరకు జేరదీసి “పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయును గాక”యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునులవంక జూచి ఓ మునులారా! మీరు పోయిరండు. ఈతనికి ఏ ప్రమాదమూ జరుగనేరదు.అని పలికి, వత్సా! మార్కండేయా! నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుని సేవించుచుండుము. నీకేయాపదకలుగదు. గాన నీవట్లు చేయుము.
మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీవిశ్వనాథుని సేవించి వచ్చెదను. అనుజ్ఞ నిమ్మని కోరగా మృకండుడు అతని భార్యయు కొడుకుయొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి.
కుటుంబ సహితంగా కాశీకిపోయి మృకండుడు కాశీవిశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగముగడనే యుండెను. పదహారవయేడు ప్రవేశించెను. మరణ సమయమాసన్నమైనది. యముడు తన భటులతో “మార్కండేయుని ప్రాణములు గొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివసన్నిధిని ధ్యానము జేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి భటులు ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసరుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధకోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునా కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశము విసరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించు సరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహా రౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంవారించి మార్కండేయుని రక్షించెను.
యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుననేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి గదా! అతనిని ఆయువునిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నారము. గాని ధర్మ పాలన నిమిత్తం యముడు లేకుండుట లోటుకదా! గాన మరల యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి “యమా! నీవు నా భక్తుల దరికి రావలదుసుమా!” అని పలికి అంతర్ధానమయ్యెను.
పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి తానూ చేసిన మాఘ మాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరకు చెప్పుచుండెను.

మాఘపురాణం -10వ అధ్యాయము


మృగశృంగుని వివాహము
దిలీప మహీజునకు వశిష్ఠువారు ఇట్లు చెప్పసాగిరి –
పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు. అది ప్రకృతినైజము. ఆవిధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామ స్మరణయందాసక్తి గలవాడయ్యెను.
అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువ వేసిరి. అచట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్ననల నొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల యానతిపై దేశాటన చేసి యనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస పలము సంపాదించియుండెను.
కుమారుడు దేశాటన పూర్తిచేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తానూ వరించిన సుశీలను మాత్రమె వివాహం చేసుకొనెదనని తన మనో నిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవంగా వివాహం చేసిరి.
సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగుని చూచి “ఆర్యా! మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొనినట్లే మా ఇద్దరినీ కూడా యీ శుభలగ్నమున పరిణయమాడుము” అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం. అది ఎట్లు జరుగును?” అని ప్రశ్నించగా – “మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడుమని ఆడబడుచులు పట్టుబట్టినారు.
మరి పురుషునకు ఒక్క భార్యయేకదా! ఇద్దరు భార్యలా?” అని మృగశృంగుడు ప్రశ్నించగా –
ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహము చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా! దశరధునకు ముగ్గురు భార్యలు, శ్రీకృష్ణునకు ఎనమండుగురు భార్యలు, పరమేశ్వరునకు గంగా, గౌరీ ఇద్దరు గడ! వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు.
వివాహపు వేడుకలను చూడ వచ్చిన అనేకమంది మునీశ్వరులు కూడా మృగశృంగా “అభ్యంతరము తెలుపవలదు. ఆ యిరువురి కన్యల యభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖించిన నీకు జయము కలుగదు. అయిననూ ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగియున్నవి” అని పలికిరి. పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆయిరువురు కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు.
ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా “మహర్షీ! వివాహములు ఎన్ని విధములు? వాటి వివరములు తెలియజేసి నన్ను సంత్రుప్తుని చేయుడు” అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరల ఇట్లు చెప్పసాగిరి. “రాజా! వివాహములెన్ని విధములో వాటి వివరములు చెప్పెదను. సావదానుడై ఆలకింపుము”
1. బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు “బ్రాహ్మము” అని పేరు.
2. దైవము: యజ్ఞము చేయు వానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి “దైవము” అని పేరు.
3. ఆర్షము: పెండ్లికుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయు దానిని “ఆర్షము” అని అందురు.
4. ప్రాజాపత్యము: ధర్మము కోసం దంపతులు కట్టుబడియుండుడని దీవించి చేయు వివాహమునకు ‘ప్రాజాపత్యము’ అని పేరు.
5. అసురము: డబ్బు పుచ్చుకొని కన్యను యిచ్చి వివాహం చేయడానికి ‘అసుర’ అని పేరు.
6. గాధర్వము: ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకొను వివాహమును ‘గాంధర్వ’ వివాహమని పేరు.
7. రాక్షసము: వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని ‘రాక్షస’ వివాహమని పేరు.
8. పైశాచిక: మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకోను దానిని “పైశాచిక’ మని పేరు.
ఈ ఎనిమిది రకములూ వివాహ సంబంధమైన పేర్లు. గాన వాటి ధర్మములు తెలియపర్చెదను ఆలకింపుడు.
గృహస్థాశ్రమ లక్షణములు
మంచి నడవడికతో ఇహమూ, పరమూ సాధించవలయునన్న యీ గృహస్థాశ్రమ మొక్కటియే సరియైన మార్గము.
భార్యయు, భర్తయు అనుకూలంగా నడచుకోనుత, ఉన్నంతలో తృప్తిచెందుట, దైవభక్తితో నడచుకొనుట అతిథి సత్కారములాచారించుట, మొదలగు సద్గుణములతో నడచుకొనే వాడే సరియైన గృహస్తుడనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములుండి కార్తికమాసమందునా, మాఘమాస మందునా నదీస్నానం చేసి, కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములాచరించుట వారికి మంచి తేజస్సు కలుగును.\
ప్రాతః కాలమున నిద్రనుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి, కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలయును. కార్తిక మాసమందు, మాఘ మాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలదీ దానధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును. గాన ప్రతి మనుజుడూ ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును.
పతివ్రతా లక్షణములు
పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తమనేక ఘనకార్యములు చేసిన కాని మంచి ఫలము పొందలేక పోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలయును గాని, అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు. అటులనే పురుషులునూ స్త్రీయొక్క అందమునే చూడక, శీలము, గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆవిధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో కాపురము చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏవిధంగా ప్రేమతో సేవిన్చునో ఆ విధంగానే అత్తమాలల సేవ, అతితిసేవలయందు కూడా తగు భక్తిశ్రద్ధలతో చేసినయెడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును.
భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలె సలహాలివ్వవలయును. పనిపాటల యందు సేవకురాలి వలె నడుచుకొనవలయును. భోజనం వద్దిన్చునప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టులో ఆవిధంగా భర్తకు భోజనం వడ్డించవలెను. శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందం కలుగజేయవలయును. రూపంలో లక్ష్మిని బోలియుండవలెను. ఓర్పు వహించుటలో భూదేవిని బోలియుండవలెను. ఈవిధంగా ఏ స్త్రీ నడచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును.
స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాటలాడ కూడదు. ఎవరినీ ముట్టుకొన రాదు. అ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. నాలుగవ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్ళు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును. ఎటువంటి సమయమునందైననూ భర్త భుజించకుండా తాను భుజించకూడదు.
ఇటువంటి లక్షణములు కలిగివున్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను.
మృకండుని జననము:
ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లియాడితిగదా యని మృగశృంగుడు మిగుల ఆనందించెను. ఆ ముగ్గురు పడతులతోను సంసారము చేయుచుండెను. అటుల కొంతకాలం జరిగినది. సుశీల యను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తన కన్న తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావలయునని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి “మృకండు”డని నామకరణం చేశారు. మృకండుడు దినదిన ప్రవర్థమానుడై తల్లిదండ్రుల యెడ, బంధుజనుల యెడ, పెద్దలయెడ, భయభక్తులు గలిగి పెరుగుచుండెను. ఐదేళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువుయొక్క మన్ననలు పొందుచు, యుక్త వయస్సు వచ్చువరకు చదివి సకల శాస్త్రములయందు ప్రావీణ్యతను సంపాదించెను. మృకండుడు విద్యనూ పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంత కాలమునకు ‘మరుద్వతి’యను కన్యతో వివాహం చేసిరి. ఆనాటినుండీ మృకండుడు గృహస్థాశ్రమము స్వీకరించెను.
మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారలయిన తరువాత వివాహములు చేసెను. తన కుటుంబమంతయును మాఘమాసంలో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్ఠతో జరుపవలసినదిగా ప్రోత్సహించెడివాడు. తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునండు ఏ ఇబ్బందియు లేకుండా వుండుటే గాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత యానందించి తన వంశ వృక్షం శాఖోపశాఖలగుచున్నది గదాయని సంతోషించుచు తనకింక ఏ ఆశలూ లేనందున భగవస్సాన్నిధ్యంనకు బోవలయునని సంకల్పించి, తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నుని చేసికొని, నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమునకేగెను. “విన్నావు కదా భూపాలా! మృగ శృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే గాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ట కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు.
మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటినుండి జ్యేష్టపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి, గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయనకొక విచారం పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలాకాలం గడిచిననూ సంతానం కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు ఈవిధముగా తలపోసెను – “కాశీ మహాపుణ్యక్షేత్రము. సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే గాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేకమంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి యభీష్టములను పొందగలిగిరి. గాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళుదును.” అని మనసున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను.
మార్గమధ్యమున అనేక కౄరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదమునుండి అతికష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీ క్షేత్రము వెళ్ళాడు. కాశీ పట్టణమునానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండుడు పరివార సహితముగా ప్రసిద్ధి చెందినా మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను. ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందం కలిగెను. తన జన్మ తరించెనని తానూ కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను.
ఈవిధంగా కుటుంబ సమేతముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దాని కెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్టించెను. ఆవిధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను. ఒక దినమున మృకండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడచిరి. మృకండుడు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా! అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును తీర్చుకున్నాడు. మృకండునకు ఎంతకాలమునకునూ సంతానం కలుగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా! సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దానధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడిట్లు పలికెను.
“మహామునీ! మీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చినారము. గాన మీ యభీష్టము నెరింగింపుడు” అని పలికెను. అంత మృకండుడు నమస్కరించి “మహాదేవా! తల్లీ అన్నపూర్ణా! ఇదె మా నమస్కృతులు. లోకరక్షకా! మీ దయవలన నాకు సలక్షణవతి, సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. కానే ఎంతకాలమైననూ మాకు సంతానం కలుగనందున క్రుంగి కృశించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు గదా! కావున మాకు పుత్రసంతానం ప్రసాదించ వేడికొనుచున్నాను” అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు.
మృకండుని దీనాపములాలకించి త్రినేత్రుడిట్లు పలికెను. “మునిసత్తమా! నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని ఒక్క నియమమున్నది. బ్రతికి యున్నంతవరకు వైధవ్యముతో వుండు పుత్రిక కావలయునా” లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా”” అని ప్రశ్నించిరి. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి హే శశిధరా! నన్ను పరీక్షింప నెంచితివా? నాకు జ్ఞానోదయ మయినది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు, సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించే పుత్రికకన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు” అని నుడివెను.
“అటులనే యగుగాక” యని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రాహమున ఒక శుభముహూర్త కాలమున పుత్రుని గనెను. మృకండునకు పుత్రసంతానము కలిగెనని అనేకమంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ జేసి, మార్కండేయుడని నామకరణం చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా! పరమ పూజ్యుడును భాగవతోత్తముడును, అగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి సుపుత్రుని బడసెను.


మాఘపురాణం -9వ అధ్యాయము


పుష్కరుని వృత్తాంతము 

ఈవిధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవుతులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటుల నుడివెను. –
“పూజ్యులైన ఓ మహర్షీ! ఈ భూలోకమునకు, యమలోకమునకు దూరమెంత?” చనిపోయిన ణా ముగ్గురు కన్యల ప్రాణములెంత కాలములో వెళ్ళి వచ్చినవి?” అని ప్రశ్నించెను.
వశిష్ఠుళ వారు దీర్ఘముగా నాలోచించి యిటుల బదులు చెప్పిరి. “మాహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి యున్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు.
దీనికొక ఉదాహరణ వివరింతును ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది.
పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు. సకల జీవులయందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండ చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు, భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు.
ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొని రండని తన భటుల కాజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి యా విప్రపుంగవుని ప్రాణములు దీసి యమునివద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనా నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరునివైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను. యమ ధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను.
యముడు భటుల వంక కోపంగా చూచి – “ఓరీ భటులారా! పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే మరియొకడు గలడు. వానిని తీసుకురాకుండా యీ ఉత్తముని ఏల తీసుకు వచ్చితిరి?” అని గర్జించుసరికి గడగడ వణికిపోయిరి.
యమధర్మరాజు పుష్కరుని వైపు జూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు” అని చెప్పెను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచి పోవుదును” అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించెను.
పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పాడుచున్న నరక బాధలను చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షల ననుభవించుచుండుట పుష్కరుడు కనులారాగాంచెను.
అతనికి అమితమగు భయము కలిగెను. తన భయం బోవుటకు హరినామ స్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమతమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. వారి శిక్షలు ఆపు చేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను.
ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగివచ్చిన వారున్నారు. ఇది నిజము.
మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు.
అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్యగరపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను.



Friday 24 February 2017

భగవత్బందువులందరికి "మహ శివరాత్రి" శుభాకాంక్షలు....



ప్రతి మాసానిదీ ఒక విశిష్టత.. ప్రతి మాసంలోనూ ఒక పండుగ..ప్రతి రోజూ ఒక కొత్తదనం. పండుగలంటే మనకెంతో సరదా. ఎంతో ఉత్సాహంగా సరదాగా జరుపుకుంటాం. ఎంత బీదవారైనా గొప్ప వారైనా ఎలాగో అలాగ జరుపుకోవాలనే చూస్తారు. శ్రీరామనవమి నుంచి శివరాత్రిదాకా సంవత్సరం పొడుగునా పండుగలే. బహుశా ఏ మతంలోనూ కూడా మనకున్నన్ని పండుగలు, పూజలు, వ్రతాలు ఉండవేమోననిపిస్తుంది. పండుగలనగానే పిండివంటలు చేసుకోవటం బంధుమిత్రులతో వినోదంగా కాలక్షేపం చేయటమేనని చాలా మంది భావన అయితే మనకి కనిపించే వ్యవహారమిదే. కాని ఆంతర్యంలో చాలా విశేషాలుంటాయి. ప్రతి పండుగా ఏదో ఒక దేవుడిని దేవతను ఆరాధించాలని సంప్రదాయం. దేవుళ్లు అంటే అమర్త్యులు..... మనం మర్త్యులం. -- జన్మ, మృత్యు, జరావ్యాధులతో బాధలను తప్పించుకోవాలంటే అవి లేని వారినారాధించాలి.  అప్పుడు వారిలోని దివ్యగుణాలు కొన్నైనా మనలో చోటు చేసుకుంటాయి. అందుకే పండుగలలో ఆహారం కంటే పూజలకే ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు.గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .




మాస శివరాత్రి :
ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు .అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తే అందులో గొప్పదైన ఈ శివరాత్రి - అంటే -మాఘ మాస శివరాత్రి ' మహా శివరాత్రి (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) అవుతోంది .'మహా' అని ఎక్కడ అనిపించినా కొన్ని అలాంటి వాటికంటే గొప్పదని భావం . శివ పార్వతులిరువురికి కలిపి 'శివులు' అని పేరు ( శివ శ్చ శివా చ సివౌ ).ఆ ఇద్దరికీ సంభందించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం . అందుకే శివరాత్రి నాడు అయ్యకి - అమ్మకి కుడా వుత్సవం సాగుతుంది .శివ - మంగళకరమైన - రాత్రి ఏదో అది శివరాత్రి అనేది మూడో అర్థం .
మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మాహాశివరాత్రి అంటారు. మ అంటే లేనిది, అఘం అంటే పాపం, మాఘం అంటే పాపవిమోచనం అని అర్ధం.
క్షీరసాగర మధనంలో పుట్టిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో నిలుపుకున్న రాత్రియే శివరాత్రి అంటారు.
మరియొక గాధ ప్రకారం బ్రహ్మ విష్ణుమూర్తులలో ఏర్పడిన అహంకారాన్ని పోగొట్టడానికి మాఘమాసం చతుర్ధశి నాడు శివుడు ఇరువురికి మధ్య జ్యోతిర్లింగాకారము దాల్చాడు...రాత్రియే శివరాత్రి అంటారు.

ప్రాణికోటి యావత్తు నిద్రపోతూ ఉండే కాలం.. రాత్రి , నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం. ఆ రాత్రి వేల తానూ మేల్కొని రక్షించే శంకరుడు రాత్రి దేవుడు . తన వివాహం కూడా అర్దరాత్రి దాటాకనే మొదలవుతుంది. చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది. చలి , మంచు భాధకు తాళలేక శరీరంలో పుట్టే చలిని తట్టుకోలేక గొంగల్లని కప్పుకుని వుండగా - పిశాచ , భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చే వాడైన శంకరుడు, నెలవంకను శిరోభూషనముగా ధరించి భస్మ లేపనం వాసనల మద్య కన్నుల పండువగా జరిగే పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవము కోసం ఎన్ని రాత్రులైనా వేచి చూడాల్సిందే.....
ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, "ఓం నమఃశివాయ" అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.
భారత దేశపు హిందూ మతం పండుగలలో శివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.


మహాశివ రాత్రి వృత్తాంతం
మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.
గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణ మహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.
అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.


బ్రహ్మ, విష్ణువుల యుద్ధం
ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.


బ్రహ్మకు శాపము
శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానము లో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు.


మొగలి పువ్వుకు శాపము
ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము
అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

శివరాత్రి పర్వదినం
ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు , దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.
ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

జాగరణము
జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము.


Thursday 23 February 2017

శివపూజా ఫలం


జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు, ఆయుః ప్రమాణం తక్కువగా వున్నవారు శివుని పూజించటంవల్ల మంచి ఫలితముంటుంది.
శివుడు బోళాశంకరుడు గనుక తెలిసి చేసినా, తెలియక చేసినా శివపూజ వల్ల, నామస్మరణం వల్ల సర్వపాపాలు పటాపంచలవుతాయి. గ్రహదోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.
దీర్ఘరోగులు, ఆయుష్షులో గండాలున్నవారు శివరాత్రినాడు మృత్యుంజయ మంత్రంతో లింగాభిషేకం చేస్తే చాలు– ఆయన అనుగ్రహంతో ఆయుష్షు మరికొంతకాలం పాటు పొడిగింపబడుతుంది.ఓంనమః శివాయ అనే మంత్రం అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సంసారమనే సముద్రాన్ని సులభంగా దాటించి మోక్షం ప్రసాదిస్తుంది.
బ్రహ్మహత్యాపాతకాన్ని సైతం పటాపంచలు చేయగలంత సర్వశక్తిమంతమైనది.
సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సంతాన సౌఖ్యం, సౌభాగ్యం శివసాయుజ్యం పొందాలంటే శివరాత్రినాడు రుద్రాభిషేకం శుభదాయకం.మహాశివరాత్రినాడు శివపురాణాన్ని పఠించినా, దానం చేసినా ఎన్నో శుభాలు కలుగుతాయని పురాణోక్తి.

శివరాత్రి మహత్యం!



మాఘ బహుళ చతుర్దశి… మహాశివరాత్రి. ఆత్మలింగోద్భవం జరిగిన రోజు ఇది. ఓసారి బ్రహ్మవిష్ణువులు నేను గొప్పంటే, నేనుగొప్పంటూ గొడవపడ్డారు. ఇద్దరు మూర్తుల అహాన్నీ కరిగించడానికి… పరమేశ్వరుడు తన విరాట్‌ రూపాన్ని చూపిన రోజే శివరాత్రి అని ఓ కథనం. వందే పార్వతీపరమేశ్వరౌ…అతడు సగం, ఆమె సగం. ఆమెతో కూడినప్పుడే శివుడు పరిపూర్ణుడు. అందుకే, పరమశివుడి జన్మదినంగా భావించే శివరాత్రి నాడే పార్వతీపరమేశ్వరుల కల్యాణం జరుపుతారు. పగలంతా ఉపవాసం, రాత్రంతా జాగారం, నోరారా నామస్మరణం…అంతకు మించిన శివానందం ఏం ఉంటుందీ! ఈరోజే శైవులు నిత్యధారణ కోసం విభూతి తయారు చేసుకుంటారని పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర చెబుతోంది. శివరాత్రి మహత్యాన్ని చాటే ఉదంతాలు ప్రాచీన తెలుగు సాహిత్యంలో అనేకం. చోరులూ జారులూ కూడా… తెలిసో తెలియకో ఉపవాసం చేసో, ఏ దురుద్దేశంతోనో శివాలయంలో దీపం వెలిగించో ముక్తిని పొందిన ఉదంతాలు కోకొల్లలు. శివ అనే పదానికి శుభం, మంగళకరం, కల్యాణం, భద్రం, విశ్వశ్రేయస్సు, సర్వ సంరక్షణం, మోక్షప్రదాయకం అనే అర్థాలున్నాయి. అందరూ అమంగళ కరమైనవిగా భావించే శ్మశానం, కపాలం, చితాభస్మం, విషసర్పాలు వంటివి శివుడికి ప్రీతిపాత్రమైనవి. ఆయన శ్మశానంలో నివసిస్తాడు. చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు. విషసర్పాలను ఆభరణాలుగా ధరిస్తాడు. అయినప్పటికీ ఆయన మంగళ ప్రదాత, మంగళస్వరూపుడు. సర్వదేవతా వంద్యుడు.ఆదిమధ్యాంత రహితుడు, అనుగ్రహప్రదాత, బోళాశంకరుడు, పరమేశ్వరుడు. అందుకే పరమేశ్వర శబ్దం దేవ, దానవ, మానవ జాతులందరికీ పూజనీయమైనది. తాను విషాన్ని మింగి, లోకాలకు అమృతాన్ని పంచిన మహా ఉదారుడాయన. అందుకే ఆయనకు మహాదేవుడు అని పేరు. అంటే దేవతలందరిలోకీ ఉన్నతమైనవాడన్నమాట. తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ, తన భక్తులకు సకలైశ్వర్యాలను ప్రసాదించే భక్తసులభుడాయన. ఆర్తితో పిలిస్తే పలికే దైవం ఆయన. ఆయనకు అత్యంత ప్రీతికరమైన రేయి మహాశివరాత్రి.శివరాత్రి అంటే మంగళకరమయిన రాత్రి అని అర్థం. ప్రతినెలా శివరాత్రి వస్తుంది. అయితే అది మాస శివరాత్రి. మాఘకృష్ణ చతుర్దశినాడు వచ్చే శివరాత్రి మహాశివరాత్రి. అంటే లింగోద్భవ సమయమన్నమాట. సకల చరాచరజీవులలో, ప్రాణులలో శివుడు అంతర్యామిగా జ్యోత్లింగ స్వరూపునిగా కొలువై వున్నాడు. ఈ జగత్తులో ప్రతిజీవి తనను పూజించేందుకు పన్నెండు ప్రదేశాలలో జ్యోతిర్లింగరూపాలలో వెలిశాడాయన. లోకకళ్యాణంకోసం పరమ శివుడు మహాశివరాత్రి నాడు శివలింగం నుంచి బయటకు వస్తాడని, సమస్త సృష్టి ప్రారంభం శివరాత్రినాడే జరిగిందని పురాణాలుచెబుతున్నాయి.జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.

ఈశ్వర తత్వానికి మేలైన దారి - శివరాత్రి




కాలగమనంలో శుక్లపక్షం, కృష్ణపక్షం ఎలా ఉన్నాయో, పూర్తి చీకటి– అమావాస్య వైపుకు తిరిగిన కాలంలో ఇంద్రియ నిగ్రహం, ఆత్మ సంయమనం అనే మార్గాల ద్వారా ఈశ్వర తత్వానికి దగ్గరగా వెళ్లగలిగే సోపానాలే, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఇవి మాసానికి ఒకమారు, సంవత్సరానికి ఒకమారు మనకు లభిస్తాయి. ఇది ఈశ్వరుడు మనకోసం ఎంచుకున్న కాలం. మహాశివరాత్రి రోజున జరిగే రుద్రాధ్యాయ పారాయణ నమక చమకంతో జరిపే అభిషేకాలు ఎంతో లాభదాయకాలు. సమస్త పాపక్షయానికి, అనావృష్టి నివారణకు, గోరక్షకు, అకాల మృత్యువు దోష నివారణకు, అభయానికి, నాయకత్వం పొందటానికి, వ్యాధి నివారణకు, సంతాన ప్రాప్తికి, కుటుంబ సంక్షేమం, తదితరాలకు మొదటి అనువాకం, ధనప్రాప్తికి, శత్రుక్షయానికి, విజ్ఞతప్రాప్తికి రెండవ అనువాకం, ఆరోగ్యానికి మూడవ అనువాకం, క్షయవ్యాధి నివారణకు, సంపూర్ణ ఆరోగ్యానికి నాల్గవ అనువాకం, మోక్షప్రాప్తికి అయిదవ అనువాకం, శివునితో సమానమైన పుత్రప్రాప్తికి అయిదు, ఆరు అనువాకాలు, ఆయువుకు ఏడవ అనువాకం, రాజ్యప్రాప్తికి ఎనిమిదవ అనువాకం, ధనకనక వస్తువాహనాలు, వివాహం జరగడానికి తొమ్మిదవ అనువాకం, సమస్త భయ నాశనానికి పదవ అనువాకం, తీర్థయాత్రలకు, జ్ఞానార్జనకు పదకొండవ అనువాకం, ఇలా సకల కార్యసిద్ధికోసం మహాశివరాత్రి అనువాకాలను ఉచ్చరిస్తూ అభిషేకం చేయడం ఆచారం. దీని తర్వాత శివునితో మమేకమవుతూ చమకంతో అభిషేకం జరుపుతారు.
పూర్వం రాక్షసులు శివరాత్రి పూజ చూసి, సుషుప్తి దశలో శివ శివ అని మంత్ర పఠనం చేశారని, దానితో వారి పాపాలు మటుమాయమయ్యాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినం రోజున శివరాత్రి వ్రతం ఆచరించాలని సంకల్పం చేసుకొన్నవారు ఉదయాన లేచి దినకృత్యాలు పూర్తిచేసి స్నానమాచరించి ఆలయానికి వెళ్లాలి. శివుని దర్శనం చేసుకోవాలి. భక్తులు ఉపవాస దీక్ష బూని శివపురాణం చదవాలి. రాత్రి పూర్తి శివనామం జపిస్తూ జాగరణం చేయాలి. శివపురాణ కథలను వినాలి. నాలుగు యామాల పూజ జరపాలి.
అలాగే శివరాత్రి రాత్రి పూట ఆలయాల్లో పూజ జరుగుతుంది. ఆలయ గర్భగుళ్లలోని శివలింగాలని పూలతో, బిల్వపత్రితో అలంకరిస్తారు. రుద్రం, నమకం, చమకం పఠనం జరుపుతారు. ప్రత్యేక అభిషేకాలు జరుపుతారు. శివరాత్రి రోజున శివుని దర్శనం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. శివరాత్రి రోజున శివుడిని దర్శనం చేసుకోవడం ద్వారా శుభకార్యాలు నిర్వహించిన ఫలితం దక్కుతుంది.

శివాలయానికి వెళ్ళే భక్తులు ముందుగా




శివాలయానికి వెళ్ళే భక్తులు ముందుగా నందీశ్వరుడిని పూజించి, ఆయనకు నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. మహాశివరాత్రి నాడు నందీశ్వరుడికి, మహాదేవునికి జరిగే అభిషేకాలను దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, శివసాయుజ్యము విశేష ఫలితాలు చేకూరుతాయి.


Sunday 19 February 2017

మాఘపురాణం - 8వ అధ్యాయము


యమలోక విశేషములు

మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కాంచినటుల లేచి, వారు యమలోకమందు చూచిన వింతలూ, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి.
యమలోక మందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తానూ చేసిన పాపకర్మలకెంతటి శిక్షలననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపినీ ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయింది.
అపుడా కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే యున్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖముల ననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానము చేయుట తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు యిత్యాది పుణ్యకార్యములు చేయుటవలన నంతకుముందు చేసియున్న పాపములన్నియు పటాపంచలై నశించుటయే గాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్దమయినది.
మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట కంతకంటే సులభమార్గము మరియొకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.



మాఘపురాణం - 7వ అధ్యాయం



మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట
 

ఆవిధంగా ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల
 మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన అ అముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మ రాజును గురించి తపస్సు చేయ నారంభించినాడు.
నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు నేనెంతయు సంతసించితిని. ణా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ యభీష్టం నెరవేర్చెదను” అని యముడు పలికెను.
ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి “మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని జేయుడు” అని ప్రార్థించెను.
మృగశృంగుని పరోపకార బుద్ధికీ, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనేంచి “మృగశృంగా! నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్నాకర్షించింది. నీకు జయమగుగాక” అని యముడు దీవించగా –
మహాపురుషా! మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము సోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగునటుల అనుగ్రహింపుము అని ప్రార్థించగా –
“అటులనే నీ కోరిక సఫలమగుగాక” యని యమధర్మరాజు దీవించి యద్రుశ్యుడయ్యెను.

Saturday 18 February 2017

మాఘపురాణం - 6వ అధ్యాయం



సుశీల చరిత్ర

భోగాపురమను నగరంలో సదాచారుడు, దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాలభరిణె వంటి ఒక కుమార్తె గలడు. ఆ కన్యపేరు సుశీల. మంచి శీలం గలది. మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండియూ దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు, పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచూ, యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై యుండెను.
ఆమె గుణములు తెలుసుకొని ఆమెవద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగ శృంగుడు సుశీలనే పెండ్లియాడదలచాడు.
ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున నొక ఏనుగు అడవినుండి ఘీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన అ అముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏదిక్కూ గానక ముందు వెనుకలు జూడక పిక్కబలం కొలది పరుగిడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలోపడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయి వున్నారు.
ఆ వార్త మృగ శృంగునకు తెలియుటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములనూ చూశాడు. ఎక్కడలేని దుఃఖమూ కలిగింది. వారినెటులనైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపముననున్న కావేరీ నదిలో రొమ్మువరకు దిగి ధ్యానం చేయసాగెను.
అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగ శృంగుని వద్దకు వచ్చినది. ఐననూ మృగ శృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే వున్నాడు.
ఏనుగు కూడా మృగ శృంగుని కెదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై కెక్కించుకొన్నది. ఐననూ ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాపవిమోచనం కలిగించిన ఆ మృగ శృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను.
వింటివా దిలీప మహారాజా! మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాపవిమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో! మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు.

మాఘపురాణం - 5వ అధ్యాయం



మృగ శృంగుని చరిత్ర 

ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక ‘కౌత్సు’డని పిలవబడుచున్ననూ ఆతనిని “మృగశృంగు”డను పేరుతొ పిల్చుచుండిరి. అదెటులనగా అతడు కావేరీ నదీతీరమున ఘోర తపస్సు చేసియున్నాడు గదా! అప్పుడాతను శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొను సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు, జంతువులు, తమయొక్క శృంగములచే నతనిని గీకెడివి. అందుచేత అతనికి ‘మృగశృంగు’డను పేరు సార్ధకమయ్యెను.
వివాహమాడు కన్య గుణములు
మృగశృంగునాకు యుక్తవయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగ శృంగుడు వారిమాట లాలకించి ఇట్లు పలికెను. “పూజ్యులగు తల్లిదండ్రులారా! నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. ఐననూ నా అభిప్రాయము గూడ ఆలకింపుడు. అన్ని ఆశ్రమాలకంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణ మేమనగా ప్రతి పురుషునకు తనకనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికీ ఉదాహరణగా స్త్రీయెటులుండవలయుననగా –
శ్లో: కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా
శయనేషు రంభా రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ!
ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లి వలెను, రూమున లక్ష్మి వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ ఆరువిధముల వ్యవహరింప వలెను.
అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా మూడున్నూ అనవసరం. ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏవిధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును.
ప్రతి మానవుడు వివాహం చేసుకొనే ముందు కన్యయోక్క గుణగణములు తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమయినది. కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు.
గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక, అట్టి మనుజుడు ధర్మ-అర్థ-కామ-మోక్షములను అవలీలగా సాధించగలడు.
భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదై యున్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగాగ్రస్తురాలై ఉండకూడదు. యెంత అందమయినదైననూ మంచి కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవా బ్రాహ్మణులను పూజించునదియై, అత్తమామల మాటలకు జవదాటనిదై యుండవలెను.
ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. గాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును. అయినా అదెటుళ సాధ్యపడును? అని మృగ శృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో నున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను.
“కుమారా! నీమాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైననూ మంచి నీతులు నేర్చుకొన్నావు. నీయభీష్టం నెరవేరవలయునన్న ణా దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము” అని పలికెను.

మాఘ పురాణం - 4వ అధ్యాయము


కుత్సురుని వృత్తాంతము:

పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను.
పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమమునియొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకా దంపతులకు ఒక కుమారుడు జన్మించెను.

కుమారునికి అయిదవ యేడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసముయెట శ్రద్దజూపుట, నీతి నియమాలను పాటించుట, దైవకార్యములయందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములనభ్యసించెను.
ఈవిధంగా కొంతకాలం గడచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్తవయస్సు వచ్చెను. అతనికి దేశాటనకు బోవలయునని కోర్కె కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు, మాఘమాసం వచ్చునప్పటికి కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు.
“నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది. ఇది నా భాగ్యం” అని ఆ విప్ర యువకుడనుకొని సంతృప్తి చెందెను.
మాఘమాసమంతయు ఇచటనేయుండి అధికఫలమును సంపాదించెదను” అని మనమున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యమూ ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆవిధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోరతపమాచరించవలయుననీ తలంచి ఆ సమీపమందొక పర్వతముపై తపస్సు చేసికొన సంకల్పించి తపస్సుజేయ మొదలిడెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ, నిశ్చల మనస్సుతోనూ, తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను.
ఆ విప్రయువకుడు కన్నులు తెరచి చూచుసరికి శంఖ, చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో వున్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు.

ఈవిధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను.
ఓ విప్రకుమారా! నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి. అది ఎటులనగా నీవు నిడవకుండ అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస పుణ్య ఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది. గాన నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టము నెరవేర్చెదను” అని శ్రీమన్నారాయణుడు పలికెను.

శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై – ప్రభూ జగద్రక్షకా! సర్వాంతర్యామీ! ఆపద్బాంధవా! నారాయణా! ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏవిధమైన సుఖాలు కోరుటకు నా మనస్సంగీకరించలేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిపుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకింకేమియు అవసరము లేదు. కానీ మీ దివ్యదర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శ మిచ్చుచుండవలెను. అదియే నాకోరిక” అని ప్రార్థించెను.
శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చెద గాక! అని పలికి నాటినుండీ అచటనే ఉండిపోయెను.
కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై వున్నా తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలడిగిరి.

మాఘపురాణం - 3వ అధ్యాయము


వింధ్య పర్వతము:

దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. భూపాలా! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు, చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని, చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకోను మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస పోవుచుంటిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు.
మహా తపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరాలనుండి ఆ ప్రాంతమందుండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు.
హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచరియ వున్నది. ఆ కొండచరియ అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా వున్నది. అది తెల్లగా కూడా వున్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణు భక్తిభావముతో ప్రార్థించిరి. అంతియేగాక ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు” అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను.
“ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించెను.
మరల వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. “రాజా! నీయభీష్టం ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము.
“ ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ అప్ర్వటం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదియై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” అట్లు కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.
గంధర్వ యువకుని వృత్తాంతము:
“భృగుమహర్షీ! నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించిననూ పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది. ఆమె ణా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. గాన ణా యీ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాదను తొలగింపజేయుడు” అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను.
“ఓయీ గాంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడునూ మనుజుని కృంగదీయును. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. గావున నీవు నీ భార్యతో గూడ పర్వతం నుండీ ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక యిది మాఘమాసము గదా! వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూడుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ యీడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను.
ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి.
అంత వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివైచెను.
ఈవిధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకెరిగించి, “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతం? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన యెడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము.


Friday 17 February 2017

మాఘ పురాణం – 2వ అధ్యాయం



దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:

దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.
దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.
దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.
అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.
ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.
“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.
“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.
ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.
దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:
దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.
ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.
దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.
అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.
మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.
అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.

LikeShow more reactions
Comment

మాఘ పురాణం – 1వ అధ్యాయం





శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట 
 
సకల పురాణములకు ఆలవాలమైన నైమిశారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై, ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ణము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చిననూ, ఆ యజ్ఞమును పూర్తీ చేయవలయుననెడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి, యజ్న స్థలముగా నైమిశారణ్యములో ప్రవహించు గోమతీ నదీతీరమును ఎన్నుకొని ఒక శుభ ముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననెడి కోరికలతో, భరతఖండము నలుమూలలనుండీ తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము లేర్పరచుకొనిరి.
అచటికేతెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములామూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయన మొనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి.
ఆవిధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోను, పరివారముల తోను, తండోపతండములుగా యజ్ఞస్థలానికి జేరుకొనిరి. వేలకొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి యుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు, పుణ్యప్రదమైనదియు, 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుటవలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి.
దూర ప్రాంతాలనుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి.
సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగ తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ ఇతిహాసాది సమస్త విషయములందూ వారికి తెలియనిది లేదు. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం, వర్ణింప నలవికానిది. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి, సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ పండ్రెండు సంవత్సరములలో యెన్నియో పురాణ గాధలు విని తరించవలెననెడి కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి.
సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తి పరచుట తన విద్యుక్తధర్మమని యెంచి వారి కోరికను మన్నించినారు.
ఒక శుభ ముహూర్తమున ఆశ్రమ వాసులందరూ సూతుల వారికి అర్ఘ్య పాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను జేసి “మునిశ్రేష్ఠా! మునికులతిలకా! ఇంతకుమున్ను ఎన్నియో పురాణ గాధలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి, అందలి సారమును గ్రహించి యుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతికథలు మాకు వినిపించుచునే యున్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు పదునాలుగు లోకములు సంచారము చేసి యున్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొనియున్నారు. గాన వినదగు విషయాలేమైనా యున్నయెడల విరామ కాలములో మాకు వినిపించవలయు”నని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలెననెడి కుతూహలం కనపరచినందున వారలను జూచి సూత మహాముని ఇటుల పలికిరి –
“ముని పుంగవులారా! మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకూ విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్య కథలు చెప్పుట వలన నాకున్నూ, వినుట వలన మీకున్నూ పరమార్థము కల్గు’నని పలికెను.
శౌనకాది మునుల కోరిక
సూతమహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా “ధన్యులమైతి”మని మునులందరూ అమితానందం నొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకొని సూతమహామునితో –
“ఆర్యా! పద్మపురాణమందు లీనమైయున్న మాఘమాసం యొక్క మహాత్మ్యంను మరల మరల వినవలయుననెడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం, ఆచరించవలసిన విధానం, మాకు వివరించవలసిందిగా” కోరిరి.
ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుటవలన సూతమహర్షి మిక్కిలి సంతసించి యిట్లు పలికిరి.
“ముని పుంగవులారా! మీరందరూ అతిముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుటవలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయములో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపు”డని సూతమహర్షి ఇట్లు వివరించిరి –
“నేను ణా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నాతండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణ్వంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్ధ్యములు కలిగిన వాడనయితిని. నేను తెలియజేయుచున్న నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠమహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను.


Tuesday 14 February 2017

పుట్టిన రోజునాడు చదవవలసిన శ్లోకం




పుట్టిన రోజునాడు ఆవు పాలు, బెల్లము, నల్ల నువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి ఈ క్రింది శ్లోకం చదివి తీర్ధంగా మూడు సార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలుగుతుంది.

సప్త చిరంజీవి శ్లోకం :

అశ్వత్థామ, బలిర్వర్యాసో, హనుమాంశ్చ విభీషణ !
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవనః !!
సప్తైతాన్ సంస్మరేన్నిత్యమ్ మార్కండేయ యథాష్టమమ్!
జీవేద్వర్శశతమ్ ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః !!