Sunday 17 March 2024

పరంపరాగతంగా వచ్చే కులదైవం తెలియని వారేం చేయాలి?

 


ప్ర : పూజామందిరంలో సింహాసనం లేనివారు ఏం చేయాలి?

జ : సింహాసనం అనేటటువంటిది ఒక్కటే ఉంటుంది. ఎవరు సింహాసనమునందు కూర్చుంటాడో వాడు పరిపాలకుడు. వాడు కర్మఫలప్రదాతయై శుభాన్నీ ఇవ్వగలడు. ఆయనకి కోపం వస్తే ఇబ్బందీ పెట్టగలడు. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటంటే శుభఫలితాన్ని ఇవ్వడానికి ఒకరు, అశుభఫలితాన్ని ఇవ్వడానికి ఒకరు ఉండరు. భగవంతుడే బాధపెడతాడు. భగవంతుడే సుఖపెడతాడు. “క్రోధః క్రోధకృత్కర్తా’ అని బాధపెట్టినా ఆయనే, బాధ తీసేసినా ఆయనే. ’భయకృత్ భయనాశనా’ – భయపెట్టినా ఆయనే, భయం తీసేసినా ఆయనే. గతజన్మలలో చేసిన పాపం అనుభవంలోకి వచ్చినప్పుడు బాధపడేటట్లు చేస్తాడు. ఆ బాధ తీసేసి పుణ్యం వచ్చినప్పుడు సుఖం ఇస్తాడు. పుణ్యం చేసుకుంటే సుఖమ్, పాపం చేసుకుంటే దుఃఖం ఇచ్చేదానికి భగవంతుడు ఎందుకు? కర్మ గొప్పది కదా! అంటే ఇప్పుడు భక్తితో ఉన్నవాడికి పాపములకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బాగా తగ్గించేస్తాడు. పాము కరవవలసిన వాడిని చీమతో కరిపించి విడిచిపెట్టేస్తాడు. అదే ’ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్’ ’నమశ్శివాభ్యాం అశుభాపహాభ్యాం’ ఎప్పుడో పాపం చేసి ఇప్పుడు భక్తితో ఉన్నాడు ఇప్పుడు బాధపెడితే ఎలా? అందుకని చాలా తక్కువ ఫలితాన్నిచ్చి ఆ పాపానికి ఫలితాన్ని పూర్తి చేయించేస్తాడు. ఆ పాప ఫలితం ఇచ్చినప్పుడు కొంచెం దుఃఖం కలిగినా భగవంతుని పాదాలు విడిచిపెట్టకుండా పట్టుకోగలిగిన శక్తిని ఇస్తాడు. లేకపోతే మళ్ళీ పాపాచరణం వైపు వెళ్ళిపోతాడు. వెళ్ళకుండా కాపాడుకుంటాడు. ఇది ఇవ్వగలిగిన వాడు సర్వజ్ఞుడు. గత జన్మలలో మనం ఏం చేశామో కూడా తెలిసి ఉన్నవాడు. వాడే సింహాసనంలో కూర్చుంటాడు. మిగిలిన వారు ఆసనాలలో కూర్చుంటారు.

ఆసనము అంటే కూర్చునేటటువంటి స్థానం. కొంతసేపు కదలడు. దానిని ఆసన అంటారు. అలా కదలకుండా కూర్చున్న వాడికి దగ్గరగా మనం కూర్చోవడం ఉపాసన. సింహాసన అంటే – సింహము మృగరాజు. ఇంటిని పరిపాలన చేసేవాడు పరమేశ్వరుడు. ఇంటి యజమానిగా ఒక మంచిపని జరగాలి అని కోరుకుంటే అది జరిగేటట్లు చేయవలసిన వాడు ఆయన. తెలియక ఏదైనా ప్రమాదకర విషయం జరిగితే బాగుండు అని కోరుకుంటే వద్దురా పాడైపోతావ్ అని జరగకుండా కాపాడే వాడూ ఆయనే. ఆయన సింహాసనంలో కూర్చుంటాడు. ఇన్నాళ్ళు మీ ఇంట్లో సింహాసనం లేదు అనుకోండి ఏమీ బెంగ పెట్టుకోనక్కరలేదు. మంచిరోజు చూసుకొని సింహాసనాన్ని ఇంట్లో పెట్టి సింహాసనంలో పరంపరాగతంగా వస్తున్నటువంటి దైవాన్నే పెట్టాలి. అంతేతప్ప ఇవాళ నాకు ఎవరు ఇష్టమో వాళ్ళని తీసుకువచ్చి కూర్చోపెట్టరు. పరంపరాగతం అంటే ముత్తాతల దగ్గరనుంచి అందరూ ఎవరూ పూజిస్తూ వచ్చారో వాళ్ళు సింహాసనంలో ఉంటారు. అందుకే శంకరాచార్యుల వారు పంచాయతన విధానాన్ని ఇచ్చారు పూజా విధానంలో. ౧. గణపతి ౨. సూర్యుడు ౩. అంబిక ౪. విష్ణువు ౫. శివుడు. ఇప్పుడు పరంపరాగతంగా మీ ఇంట్లో శివభక్తితత్పరులు అయితే శివుడిని మధ్యలో పెట్టి ఈ నలుగురినీ చుట్టూ నాలుగు దిక్కులా పెడతారు. ఏ దిక్కున ఎవరు ఉండాలి అన్నది శాస్త్రం ఉంటుంది. పరంపరాగతంగా విష్ణువును పూజించే వాళ్ళు అయితే విష్ణువును మధ్యలో పెట్టి మిగిలిన నలుగురినీ నాలుగు దిక్కులా పెడతారు. విఘ్నేశ్వరుని పరంపరాగతంగా పూజిస్తుంటే విఘ్నేశ్వరుని మధ్యలో పెట్టి మిగిలిన నలుగురినీ నాలుగు దిక్కులా పెడతారు. పూజ చేసేటప్పుడు ముందు ఈ నలుగురికీ పువ్వు వేస్తే తప్ప ప్రధాన దేవత దగ్గరకు వెళ్ళలేరు. అప్పుడు భేదభావం ఉండదు మనస్సులో. ఎవరిని పూజిస్తున్నామో వారినే తప్ప ఇంకొక దైవం జోలికి వెళ్ళకూడదు అన్న భావన ఉండదు. ఈ గణపతి, ఈ విష్ణువు, ఈ అంబిక, ఈ సూర్యుడు – ఈ నలుగురి అనుగ్రహంతోటే శివుడి దగ్గరకి వెళ్తాం. ఇప్పుడు అందరి పూజా అందులోకి వచ్చేస్తుంది. 365రోజులలో మీరు చేసే నైమిక్తిక తిథులన్నీ ఆ అయిదులోకే వెళ్ళిపోతాయి. ఇక క్రొత్తగా అక్కరలేదు. పూజ చాలా తేలికగా ఉంటుంది. బోలెడన్ని మూర్తులు ఉన్నాయనుకోండి పువ్వులు మరునాడు తీస్తుంటే వేళ్ళు తగిలి క్రిందపడిపోతాయి. అలా పడకూడదు. ఈ అయిదూ ఉన్నాయి. దీపావళి వచ్చింది. లక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీ నారాయణులు ఉన్నారు ఇందులో. అలాగే రథసప్తమి వస్తే ఇందులో సూర్యుడు ఉన్నాడు. వినాయక చవితి వచ్చింది వినాయకుడు అందులో ఉన్నాడు. శివరాత్రి వచ్చింది. శివుడు ఉన్నాడు అందులో. శ్రావణశుక్రవారం వచ్చింది అమ్మవారు ఉంది అందులో. మీరు ఏ తిథి చేయాలన్నా అక్కడే ఉంటాయి అయిదు మూర్తులు. ఈ అయిదు మూర్తులకు ఆరాధన చేస్తే పరిపూర్ణమైనటువంటి పూజ పూర్తి అయిపోయినట్లే. అందుకని పరంపరాగతంగా ఎవరిని పూజ చేస్తున్నారో వారిని కులదైవంగా ఉంచుతారు. వీరి మధ్య అభేదం అన్న భావనతో చేయాలి.

పరంపరాగతంగా ఇంట్లో ఎవరిని పూజ చేస్తున్నారో తెలియనప్పుడు స్థానికంగా మీ ఇంట్లో పౌరోహిత్యం చేస్తున్న పురోహితుడిని అడిగితే మీ గోత్రాన్ని బట్టి చెప్తారు ఫలానా వాళ్ళని ఆరాధన చేయండి అని. అలా కూడా తెలియకపోతే శ్రీమహావిష్ణువును మధ్యలో ఉంచి మిగిలిన నాలుగు మూర్తులనీ నాలుగు దిక్కులా ఉంచి పూజ చేయడం పరమ శ్రేయస్కరం. విష్ణు పంచాయతనంగా పూజ చేయడం మంచిది. శివ పంచాయతనంగా చేయాలంటే నియమాలు తెలియవలసి ఉంటుంది. విష్ణుపంచాయతనం పెట్టుకొని పూజ చేయడం తేలిక అవుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment