Monday 10 October 2016

దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారంటే…




 

దుర్గాష్టమి రోజున ఆయుధాలకు ఎందుకు పూజ చేస్తారో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు.

మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి – అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు. విజయదశమి నాడు పూజ చేస్తే అష్టైశ్వర్యాలతో కూడిన సుఖజీవితం లభిస్తుంది. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. దుర్గాష్టమి రోజును ఆయుధాలకు, వాహానాలకు పూజ చేస్తారు.

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గా దేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తమ పిల్లలను తల్లిదండ్రులు దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం శుభమని  భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ”ఓంకారం” రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు.

వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతున్నారు.




No comments:

Post a Comment