Monday 3 October 2016

గాయత్రీ మంత్రం - పరమేశ్వరుడు




గాయత్రీ మంత్రం సృష్టిస్థితి లయ కారకుడైన పరమేశ్వరునిది - శుద్ధ బ్రహ్మ స్వరూపుడైన పరమాత్మది. నిజానికి సృష్టికి అతీతంగా చెప్పినప్పుడు ’పరమాత్మ’ అని వ్యవహారం. అతడే సృష్టి స్థితి లయలు చేస్తున్నప్పుడు ’పరమేశ్వరుడు’ అని వ్యవహరింపబడతాడు.
రెండూ ఒకటే తత్త్వం. అయితే ఆ పరమాత్మను శివునిగా భావించి ఆరాధించే వారికి గాయత్రి శివస్వరూపమే. దానికి ప్రమాణంగా కొన్ని వాక్యాలున్నాయి. అలాగే విష్ణువుగా భావించే వారికి గాయత్రీ మంత్రానికి విష్ణువే లక్ష్యం. దానికీ ప్రమాణ వాక్యాలు ఉన్నాయి. అదేవిధంగా గణపతి పరంగా, సూర్య పరంగా, శక్తి పరంగా, స్కందుని పరంగా కూడా అన్వయించే శాస్త్ర వాక్యాలున్నాయి. వీటినిబట్టి ఎవరి ఉపాస్య దైవాన్ని వారు గాయత్రీ మంత్ర స్వరూపంగా ధ్యానించి ఆరాధించి తరించవచ్చు అని భావం.
"మాబుద్ధులను ప్రేరేపించే సృష్టికారకమైన శ్రేష్ఠమైన పరబ్రహ్మ తేజస్సును ధ్యానిస్తున్నాము" అని మంత్రభావం. సూర్య మండలంలోని పరంజ్యోతిని వారి వారి ఇష్ట దేవతారూపంగా భావించడం పరమార్థం. ఈ దేవతలు కూడా వేదం ప్రతిపాదించిన శివ విష్ణు శక్తి గణేశ సూర్య స్కంద రూపాలు కావాలి. ఎందుకంటే - మంత్రం కూడా వేద సంబంధి కనుక.
మరొక విశేషం - పై దేవతల మంత్రాలను సంధ్యాకాలంలో ఉపాసిస్తే అది వారికి గాయత్రి అవుతుంది. అయితే - అందరూ పఠించదగిన గాయత్రీ మంత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాధానమైనవి మూడు. సంధ్యాకాలాలలో వీటిని జపిస్తే ’గాయత్రి’ అవుతాయి.
* సర్వ చైతన్య రూపాం తాం, ఆద్యాం విద్యాం చ ధీమహి, బుద్ధిం యా నః ప్రచోదయాత్!
*పరమేశ్వర విద్మహే, పరతత్త్వాయ ధీమహి, తన్నో బ్రహ్మ ప్రచోదయాత్!
*యోదేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః!
ప్రేరయేత్తస్య తద్భర్గః తద్వరేణ్య ముపాస్మహే!!

No comments:

Post a Comment