Sunday 14 August 2016

శ్రీమహావిష్ణువునుంచి కృష్ణానది ఆవిర్భావం

శ్రీమహావిష్ణువునుంచి కృష్ణానది ఆవిర్భావం

శ్రీమహావిష్ణువు తన శరీరాన్ని కృష్ణానదిగా ఆవిర్భవించినట్లు చెప్పే గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ద్వాపరయుగం చివరన అంటే కలియుగం ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు రాబోయే పాపాలను పసిగట్టిన సృష్టికర్త బ్రహ్మదేవుడు అనేకరకాలైన ఆలోచనలు చేసి శ్రీమహావిష్ణువైతే దీనికి ఉపాయం తెలుపుతాడని భావించి వైకుంఠం చేరాడు.
విషయం వివరించాడు. బ్రహ్మదేవుడి మాటలను విన్న విష్ణువు తన శరీరం నుండి ఒక దివ్య సుందరరూపంలో ఒక బాలికను జనింపజేశాడు. ఆమెకు ‘కృష్ణ’ అని పేరుపెట్టి బ్రహ్మదేవుడికి అప్పగించి కలియుగాంతం వరకు ఆమెను కాపాడమని సూచించాడు.


బ్రహ్మదేవుడు ఆ బాలికను తన కుమార్తెగా స్వీకరిస్తూ వున్నానని పలికాడు. అనంతరం –
ఈ బాలిక పెరిగి కలియుగ ప్రారంభంలో కృష్ణానదీ రూపాన్ని పొంది...భూమిపైకి చేరి కలియుగవాసుల పాపాలన్నింటిని ప్రక్షాళన చేస్తుంది” అని శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవుడికి తెలిపాడు.
తర్వాత తనతోపాటు బ్రహ్మదేవుడు తీసుకువచ్చిన కృష్ణ పెరిగి పెద్దది కాసాగింది. కొద్ది రోజులకు కలియుగం ప్రవేశించింది. శ్రీమహావిష్ణువు శరీరం నుండి ఉద్భవించిన బాలిక నదీరూపాన్ని ధరించింది.
అంతకుముందే ‘సహ్యముని’ తపస్సుచేసి కృష్ణానది తనపైనుండి ప్రవహించే వరాన్ని పొందాడు. వరం ప్రకారం సహ్యముని పర్వతరూపం ధరించి సహ్యాద్రిగా మారగా నదీరూపాన్ని ధరించిన బాలిక కృష్ణానదిగా పర్వతం నుంచి ప్రవహించడం ప్రారంభించింది. ఈ విషయం తెలిసిన లయకారుడైన పరమశివుడు
“కృష్ణా నదిని దర్శించగానే పాపప్రక్షాళన జరిగి ముక్తి కలుగుతుంది” అని వరం ప్రసాదించాడు.

ఈవిధంగా ఆవిర్భవించినది కృష్ణానది.

No comments:

Post a Comment