Tuesday 23 August 2016

పాట్న - పటాన్ దేవి మందిర్ , శీతల దేవి మందిర్

పాట్న - పటాన్ దేవి మందిర్ , శీతల దేవి మందిర్

 
దైవ భూమి అయిన భరత దేశంలో ఎన్నో ప్రాంతాలు స్థానికంగా కొలువైన దేవి లేదా దేవతా నామం మీద ఏర్పడటం అందరికీ తెలిసిన విషయమే !
భూలోక వైకుంఠము శ్రీ రంగం, కలియుగ వైకుంఠము తిరుమల, శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువైన తిరువనంతపురం ఇలా ఎన్నో ఉదాహరణలుగా పేర్కొనవచ్చును. 



వాటిల్లో గతంలో మన పురాణాలలో, గ్రంధాలలో  "మగధ" గా పేర్కొనబడిన నేటి "భీహర్" రాజధాని "పట్నా" పేరు కూడా చేర్చవచ్చును.
"పుత్రక" కునిగా పేర్కొనబడే పాలకుని చేత స్థాపించబడిన "పాటలీ పుత్ర" మే నేటి "పట్నా".
ఈ పేరు రావడానికి వెనుక విశేష పౌరాణిక మరియు చారిత్రక గాధలు ముడిపడి ఉన్నాయి.
బడీ పటాన్ దేవి 



దక్ష ప్రజాపతి గురించి అందరికీ తెలిసన విషయమే !
ఆయన పుత్రిక "సతీ దేవి" తండ్రి మాటను కాదని శ్మశాన వాసి అయిన శంకరుని పరిణయ మాడటం వలన తండ్రి నిరాదరణకు గురి అయినది.
సర్వేశ్వరుని కించపరచడానికి తలపెట్టిన యాగామనీ తమకు పిలుపు లేదనీ తెలిసి దాక్షాయణి వెళ్లి అవమానానికి గురి అయ్యి ఆ అవమాన భారం తట్టుకోలేక హోమ గుండంలో దుమికి ఆత్మ త్యాగం చేసింది.
వార్త తెలిసిన మహేశ్వరుడు వీరభద్ర, కాల భైరవాది గణాలను పంపి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయించడం ఒక కధ !




సతీ దేవి అస్తమయంతో విచారగ్రస్తుడైన పరమేశ్వరుడు ఆమె దేహాన్ని భుజం మీద వేసుకొని విరాగిగా మారి  లోకాలలో సంచరించసాగారు. అమ్మవారి శరీరం ఆయనకు కనిపించినంత కాలం మామూలుగా మారరని గ్రహించిన శ్రీహరి తన సుదర్శన చక్రంతో సతీ దేవి దేహాన్ని ఖండించారు. ఆ భాగాలు భువిలో అనేక ప్రాంతాలలో పడినాయి. అవే శక్తి పీఠాలు.  ప్రముఖమైనవి అష్టా దశ పీఠాలు. భాగాలు పడిన 51 ప్రదేశాలను సిద్ద శక్తి పీఠాలు అని పిలుస్తారు.


అమ్మవారి కుడి తొడ నేటి మహారాజ్ గంజ్ దగ్గర, సతీ దేవి పై వస్త్రం నేటి చౌక్ వద్ద పడినాయట. పుత్రకుడు అమితంగా అమ్మవారిని ఆరాధించేవాడట. సర్వకాలాలలో తనను కాపాడే దేవతకు ఆయనే ఆలయాలు నిర్మించారట. మహారాజ్ గంజ్ లో బడీ పటాన్ దేవి ఆలయం, చౌక్ వద్ద చోటీ పటాన్ దేవి ఆలయాలు ఉంటాయి.



గతంలో చోటీ పటాన్ దేవి స్థానిక ప్రజలను కాపాడే దేవతగా ప్రసిద్ది. కాలక్రమంలో బడీ దేవి ఆ స్థానాన్నిపొందినట్లుగా తెలుస్తోంది. చిత్రమైన విషయం ఏమిటంటే రెండు చోట్లా ఒక్క అమ్మవారే ఉండరు. గర్భాలయంలో రజత సింహాసనం
మీద మూడు చిన్న సాలగ్రామ శిలలు ఉంటాయి. అవే  మహా కాళీ, మహాలక్ష్మి, మహా  సరస్వతి గా పేర్కొంటారు.



ప్రాంగణంలో లింగరాజు, శ్రీ హనుమంతుడు, శ్రీ భైరవుడు ఉపాలయాలలొ కొలువై ఉంటారు. ప్రతి నిత్యం ఎందరో భక్తులు అమ్మవారి దర్శనార్ధం వస్తుంటారు. మంగళ వారాలలో వీరి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది.
పర్వ దినాలలో వేలాది మంది రాష్ట్ర నలుమూలల నుండి వస్తారు. నవ రాత్రులూ, శివరాత్రి, హనుమద్జయంతి లాంటి రోజులలో విశేష అలంకారాలు, పూజలూ నిర్వహిస్తారు.

చోటీ పటాన్ దేవి 



పట్నా పాత నగరంలో ఉన్న ఈ ఆలయం ఉత్తర దిశగా దుకాణాల, గృహాల నడుమ ఉంటుంది. బడీ దేవి ఆలయంతో పోల్చితే చాలా చిన్న మందిరం.
ఇక్కడ కూడా ముగ్గురమ్మలు కొలువై ఉంటారు.
పక్కనే పురాతన సిక్కు గురుద్వారా,మహ్మదీయుల మసీదు కూడా ఉంటాయి.వీటి నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది.





పట్నాలో తప్పక సందర్శించివలసిన మందిరాలలో ఈ రెండూ ఉంటాయి. పట్నా రైల్వే స్టేషన్ నుండి ఆటోలలో సులభంగా మొదట బడీ దేవి తరువాత చోటీ దేవి ఆలయాలను చేరుకోవచ్చును. వెళ్ళే మార్గంలో మా శీతలా దేవి మందిరం కూడా దర్శనీయ స్థలం.

మా శీతలా దేవి మందిరం 


ఈ మందిరాలన్నీ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకూ భక్తజన సౌకర్యార్దం తెరిచే ఉంటాయి. 

శ్రీ మాత్రే నమః !!

No comments:

Post a Comment