Sunday 14 August 2016

శ్రావణ మాసం పూజల్లో పరమార్ధం

శ్రావణ మాసం పూజల్లో పరమార్ధం


శ్రావణం వర్షాకాలమైన కారణం గాను , రాబోయే భాద్రపదమాసం కూడా వర్షాలతోనే ఉండే కారణం గానూ ...
పసుపు ని పాదాలకి రాసుకుంటే జలుబు , రొంప మొదలైన వ్యాధులు రావు .
మొలకెత్తిన శనగల్ని ఈ 2 నెలలు పాటు ప్రసాదము గా తినడం వల్ల శరీరానికి పోషక విలువలు గల ఆహారము అందివ్వడం వల్ల శరీర వ్యాధి నిరోధక శక్తి పఠిస్టమవుతుంది .
ప్రతి స్త్రీ కూడా బొట్టు , కాటుక , గందము ,మట్టెలు . పూలు , పట్టుచీర నగలు తో నిండుగా ఉండడం వల్ల సూక్ష్మ జీవులు దరికి రావు .
తాంబూలము వేసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభతరమవుతుంది .
చిత్ర దీపం పేరిట (బెల్లము , వరిపిండిని ముద్దగా చేసి కుందెగా మలిచి , దాంట్లో ఆవునేతితో దీపాన్ని వెలిగించి ఆ దీపం కొండెక్కిన తర్వాత ) పెట్టిన దీపం తినడం వల్ల దానికున్న ఔషద గుణాల కారణం గా వర్షాకాలము లో దాగి యున్న ఏ వ్యాధి స్త్రీల దరికి చేరదు .
స్త్రీల తో కూడా పురుషులు ఈ ప్రసాదాదులు ఆరగించడం వల్ల మగవారికి ఈ లాభాలు అందుబాటులో ఉంటాయి .
పండుగ చేసి ఇరుగు పొరుగు వారితోను , బంధుమిత్రులతోను కలిమి - చెలిమి సంబంధాలు -- కుటుంభ వ్యవస్థను పటిస్ఠ పరచి మానసిక ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని కలిగిస్తాయి కాబట్టి మానసిక రుగ్మతలకు దూరముగా ఉండవచ్చును .
సమాజ ప్రయోజనాలు :
మన సంప్రదాయాల్లో పూజలూ.. వ్రతాల వెనుక శాస్త్రీయమైన కారణాలనేకం. అన్నీ ఆలోచించి.. ఏయే కాలాల్లో ఏమేం చేస్తే ఇల్లు.. ఊరు.. సమాజం ఆరోగ్యంగా ఉంటాయో .... ఆనాడు పెద్దలు ఆలోచించి ప్రవేశపెట్టినవే ఇవన్నీ. పుణ్యం మాట పక్కనబెడితే.. మనం చేసే కొన్ని పనుల వల్ల శారీరకంగా.. మానసికంగానూ.. ఎంతో దృఢంగా.. ఆరోగ్యంగా ఉండాలన్నదే వీటి ఉద్దేశం.
ఉత్తరాయణం, దక్షినాయణానికి మధ్యస్థంగా శ్రావణ మాసం వస్తుంది. ఇది వర్షాకాలం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్ని పంటలూ పండే కాలం. వర్షాలకు గ్రామాల్లోని చెత్తాచెదారం కొట్టుకుపోయి సమీపంలోని చెరువుల్లో చేరతాయి. సారవంతమైన మట్టి పొలాలకు చేరుతుంది. బావులు, చెరువులు నీటితో నిండుతాయి. పశువులకు కావాల్సిన గ్రాసం దొరుకుతుంది. అందరికీ చేతినిండా పనులు.. తద్వారా
సొమ్ములు. అందుకే సకల సంపదలను కలిగిస్తుందని శ్రావణమాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. సర్వ సౌభాగ్యాలను కలగజేస్తుందని మహిళలు ఈ పూజను విధిగా చేస్తారు. ఇళ్లు వాకిళ్లను శుభ్రం చేసుకుని.. తోరణాలతో అలంకరించి పూజలు చేస్తారు. వరలక్ష్మీ వ్రతం సకల శుభాలను కలగజేయడమే కాకుండా శాస్త్రీయంగా ఇంటికి, వంటికి, సమాజానికి కూడా ఎంతో
ఉపయోగపడుతుందని పురోహితుడు దర్భముళ్ల కామేశ్వరశర్మ తెలిపారు. అందుకే వరలక్ష్మీ పూజ ఆరోగ్య ప్రదమని వివరించారు.

ఎన్నో ఉపయోగాలు
వరలక్ష్మీ వ్రతానికి తొమ్మిది రకాల పుష్పాలు, పిండివంటలు, పత్రి, పండ్లను ఉపయోగిస్తారు. వీటివల్ల ఎన్నో ఉపయోగాలు. వరలక్ష్మీ దేవిని ఆరాధించడానికి, నైవేద్యం పెట్టడానికి ఉపయోగించే సామగ్రి, వంటల్లో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి.
* వరలక్ష్మీ నైవేద్యానికి పూర్ణం బూరెలు, పులగం, గారెలు, పరమాన్నం, చక్కెరపొంగలి, పులిహోర, పెసరబూరెలు, గోధుమ ప్రసాదం తయారు చేస్తారు. వీటికోసం బియ్యం, పెసరపప్పు, పంచదార, జీలకర్ర, మినపప్పు, పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్‌, వేరుశనగపప్పు, మజ్జిగ, గోధుమనూక వంటివి వినియోగిస్తారు. దీనినే ప్రసాదంగా భుజిస్తారు. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి. ఇటువంటి ఆహారం తరుచూ తీసుకుంటే అనారోగ్యం దరి చేరదని పెద్దలు చెబుతున్నారు.
* పూజకు ఉపయోగించే పత్రి ఇంటి పరిసరాలకే కాకుండా శరీరానికి కూడా ఉపకరిస్తాయి. ఉసిరిక, మారేడు, నేరేడు, జమ్మి, దుచ్చిన, రావి, వెలగ, మారేడు, అత్తి, జాజి వంటివి పూజకు ఉపయోగిస్తారు. వీటిని వల్ల గాస్టిక్‌ సంబంధ ఇబ్బందులు, మహిళలకు రుతుసంబంధ సమస్యలు, చర్మసంబంధ రోగాలు, దంత, నోరు, కంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస సంబంధ రోగాలు కూడా నయమవడానికి పత్రి ఎంతో
ఉపయోగపడుతుంది.
* ఇక వరలక్ష్మి వ్రతం రోజే మొగలిపువ్వును వినియోగిస్తారు. ఇది పరిసరాలను చాలా ప్రభావితం చేస్తుంది. తొమ్మిది రకాల పుష్పాలతో పూజ చేస్తారు. వీటివల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మహిళల్లో ముఖవర్చస్సు పెంచుతుంది. తలలో పేలు రాకుండా పుష్పాలు ఉపకరిస్తాయి. తలపోటు, కళ్లనొప్పులు రాకుండా పువ్వులు కాపాడతాయి. అందుకే పూజలో ఉంచిన పువ్వులను మహిళలు స్వయంగా తలలో ఉంచుకుంటారు. పేరంటానికి వచ్చిన ఇరుగుపొరుగు వారికి పెడతారు.
* వరలక్ష్మీ వ్రతంలో ప్రధానంగా తొమ్మిది రకాల పండ్లను నైవేద్యంగా పెడతారు. వీటినే ప్రసాదంగా తీసుకుంటారు. పండ్ల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిసినా.. వినియోగం తక్కువ. ఇలాంటి పూజల
సందర్భాల్లోనైనా ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయని పెద్దల ఉవాచ. బలమైన కండరాలు, దృఢమైన ఎముకలు, మెరిసే కళ్లు, ముడతల్లేని చర్మం, వంకర్లు లేని దేహం, నల్లటి శిరోజాలు, తెల్లని దంతాలు, చక్కని జీర్ణశక్తి, సమృద్ధిగా రక్తం, ఎత్తుకు తగిన బరువు, అంటు వ్యాధులను దరిచేరదీయని రోగ నిరోధక వ్యవస్థ ఉండాలంటే పోషక పదార్థాలను తీసుకోవాలి. ఇవి ఉండాలంటే పండ్ల ద్వారానే సాధ్యం. ప్రోటీన్లు, విటమిన్లు, నీరు, కాల్షియం వంటివి ఒక్కో పండు ద్వారా లభిస్తుంది. సంప్రదాయం పేరుతో వీటిని ఉపయోగించాలని పెద్దలు చెబుతున్నారు.
* ఇక వరి దుబ్బును కూడా తప్పనిసరిగా పూజిస్తారు. వరి వల్ల మనకు ఆహారం లభిస్తుంది. గడ్డి పశువులకు ఆహారం. ధాన్యం ఇంటికి వస్తే లక్ష్మీదేవి వచ్చినట్లేనని గ్రామీణులు భావిస్తారు. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తూనే.. ప్రకృతిని కూడా మర్చిపోకూడదని వరిదుబ్బులకు పూజ చేస్తారు.

No comments:

Post a Comment