Tuesday 31 October 2023

షోడశ గౌరి వ్రతము_పూజ విధానం

 



భూ శుద్ధి :

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్దిచేసి , అలికి , బియ్యపు పిండితో గాని , రంగుల చూర్ణములతో గాని , ముగ్గులు పెట్టి , దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి పీట మరీ ఎత్తుగా గాని , మరీ పల్లముగా గాని ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు వ్రాసి , కుంకుమతో బొట్టు పెట్టి , వరి పిండి (బియ్యపు పిండి )తో ముగ్గు వేయాలి సాదారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి .ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని , చిత్రపటం గాని ఆ పీటపై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి , పిదప ఒక పళ్ళెంలో గాని , క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు ఉంచి , అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి. ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.

దీపారాధనకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము :

దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని , ఇత్తడి ది గాని , మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో ) వేసి నూనెతో తడపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో(కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి , వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను. తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకు నువ్వుల నూనెగాని , కొబ్బరి నూనెగాని , ఆవు నెయ్యి గాని వాడవచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.

ఘంటా నాదము :

శ్లో || ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్

కుర్యా ద్ఘంటారవం తత్ర దేవతా హ్వాహన లాంచనమ్

మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించ రాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని , చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను.

పూజకు కావలసిన వస్తువులు :

షోడస గౌరీ దేవి ఏ వ్రతమును (పూజను ) ఆచరించు చున్నామో ఆ దేవుని యొక్క బొమ్మ (ప్రతిమ ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను , వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకొనవలెను ), లేదా చిత్ర పటము , మండపమునకు మామిడి ఆకులు ,అరటి మొక్కలు , కొబ్బరి కాయలు , పళ్ళు , పువ్వులు , పసుపు , కుంకుమ , గంధం, హారతి కర్పూరం , అక్షతలు , అగ్గి పెట్టె , అగరువత్తులు , వస్త్ర , యజ్నోపవీతములు , తోరములు , (తెల్లని దారమునకు పసుపు రాసి 9 వరుసలు (పోగులు ) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి , ఈ తోరములను దేవునికి పూజ చేసి పూజచేసిన వారందరూ కుడి చేతికి ధరిస్తారు. ప్రత్యేక నివేదన (పిండి వంటలు )

(పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామములు మొత్తం 24 కలవు.

1. ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి

2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి

3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను. తరువాత

4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .

5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి , మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి.

6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.

7. ఓం త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.

8. ఓం వామనాయ నమః

9. ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి.

10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి.

11. ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి.

12. ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను.

13. ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .

14. ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .

15. ఓం ప్రద్యుమ్నాయ నమః 

16. ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .

17. ఓం పురుషోత్తమాయ నమః

18. ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను

19. ఓం నార సింహాయ నమః 

20. ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను.

21. ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను.

22. ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను.

23. ఓం హరయే నమః

24. ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను, ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి , వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను.

ఆచమనము అయిన తరువాత , కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః

యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రాణాయామమ్య: ఓం భూ : -ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః - ఓగ్ సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దీయో యోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సంకల్పము చెప్పు కొనవలెను.

సంకల్పము: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ) , సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము . జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు : (వసంత , గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే , శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య , నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి , శ్రీమత్యాః , గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య , క్షేమ స్థైర్య , వీర్య , విజయ , అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం , ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం , సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , శ్రీ షోడస గౌరీ దేవి ముద్దిశ్య శ్రీ షోడస గౌరీ దేవి ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవునియొక్క పేరు చెప్పుకొని ) సంభ వద్భి రుపచారై : సంభవతాని యమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో , నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా , భక్తి శ్రద్దలతో సమర్పించు కొంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోప చార పూజాం కరిష్యే తదంగ కలశ పూజాం కరిష్యే || పిదప కలశారాధనము చేయవలెను .

కలశ పూజను గూర్చిన వివరణ :

వెండి , రాగి , లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు , పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని , కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన , మధ్య , ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు , దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి.

ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .

మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః

మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః ||

ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః

అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః

శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే , గోదావరి , సరస్వతి , నర్మదా సింధు

కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.

ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ షోడస గౌరీ దేవి

పూజార్ధం దురితక్షయ కారకాః (ఏ దేవుని పూజిస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పవలెను ) కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి) , ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని , ఆకుతో గాని చల్లాలి.

మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా

యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||

అని పిదప కాసిని అక్షతలు , పసుపు , గణపతిపై వేసి , ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను.

ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు తధాస్తు. స్థిరోభవ, వరదోభవ , సుముఖోభవ ,సుప్రసన్నోభవ. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను .

శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్

ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణక :

లంబోరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః

ధూమ కేతు ర్గణాధ్యక్షః పాలచంద్రో గజానన

వక్రతుండ శ్శూర్ప కర్ణో హేరంబః స్కంద పూర్వజః

షోడ శైతాని నామాని యః పటే చ్చ్రుణు యాదపి

విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా

సర్వ కాసంగ్రామే ర్యేషు విఘ్నస్తస్య నజాయతే |

పిదప షోడశోపచార పూజను చేయవలెను. షోడశోపచారములనగా ఆవాహన , ఆసనం , అర్ఘ్యం , పాద్యం , ఆచమనీయం , స్నానం , వస్త్రం , యజ్ఞోపవీతం , గంధం , పుష్పం , ధూపం , దీపం , నైవేద్యం , తాంబూలం , నమస్కారం , ప్రదక్షణములు మొదలగునవి.

షోడశోపచార పూజా ప్రారంభః

ధ్యానం :

శ్లో || కురు పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే

భక్తా బీష్ట ప్రదేదేవి సుప్రీతా భవ సర్వదా

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ధ్యాయామి -ధ్యానం సమర్పయామి

అని షోడస గౌరీ దేవిని మనస్సున ధ్యానించి నమస్కరించ వలెను.

ఆవాహనం :

శ్లో || గచ్చా గచ్చ దేవిత్వం సర్వ మంగళ దాయిని

శ్రద్దా భక్తి సమాయుక్త ధ్యాయామి పరమేశ్వరి.

శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆవాహయామి ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను.

ఆసనం :

శ్లో || విచిత్ర స్వర్ణ సంయుక్తం చిత్రవ వర్ణ సుశోభితం

గౌరీ సింహాసనం దేవి దాస్యామి శుభ లోచిన

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి

దేవుడు కూర్చుండు టకై మంచి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.

అర్ఘ్యం :

శ్లో || గగాజల సమాయుక్తం సుగంధం గంధ సంయుతం ,

గృహాణర్ఘ్యం మయాదత్తం మంగళం కురుమే శివే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః హస్తౌ : అర్ఘ్యం సమర్పయామి

దేవుడు చేతులు కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ , ఉద్దరిణెతో నీరు వేరొక గిన్నెలో వదల వలయును.

పాద్యం :

శ్లో || పుణ్య తీర్ధం సమానీతం పవిత్రం ద్రవ్య సంయుతం

పాద్యంచ పరి గృహ్నాతు గౌరీ దేవి నమోస్తుతే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పాదౌ : పాద్యం సమర్పయామి.

దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.

ఆచమనీయం :

శ్లో|| సర్వ తీర్ధ సమధ్బూతం పవిత్రం విమలం జలం

గృహాణాచ మనం దేవి శంకరార్ధ శరీరణి||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆచమనీయం సమర్పయామి.

అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్ళి స్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు నీరు వదలవలెను.

సూచన :

అర్ఘ్యం , పాద్యం , ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను. అరవేణం (పంచ పాత్రకు క్రింద నుంచు పళ్ళెము) లో వదలరాదు.

మధుపర్కం :

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః మధుపర్కం సమర్పయామి.

అని దేవునికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ , ఈ మధుపర్కం ను దేవి ప్రతిమకు

అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుదాన్ని మధుపర్కం అంటారు).

పంచామృత స్నానం :

శ్లో || శర్కరా మధు సంయుక్తం దధి క్షీర ఘ్రుతం తధా

పంచామృతం గృహాణ త్వం గౌరీ దేవి నమోస్తుతే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పంచామృత స్నానం సమర్పయామి.

అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు నెయ్యి , ఆవు పాలు , ఆవు పెరుగు , తేనె , పంచదార కలిపిన పంచామృతమును దేవిపై ఉద్దరిణెతో చల్ల వలెను.

శుద్దోదక స్నానం :

శ్లో || గంగాజల సమానీతం సర్వ తీర్ధ సముద్భవం ,

స్నానార్దంచ గృహాణత్వం సర్వ కామ ఫల ప్రదే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః శుద్దోదక స్నానం సమర్పయామి .పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.

వస్త్ర యుగ్మం :

శ్లో|| దివ్యాంబరం సమానీతం విచిత్రం చోత్తరీయకం

గృహాణత్వం మాయాదేవి సర్వ మంగళ దాయిని ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః వస్త్ర యుగ్మం సమర్పయామి.

(యుగ్మమనగా రెండు ) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును .ఇటువంటివి రెండు చేసుకొనవలెను.) దేవి ప్రతిమకు అద్దవలెను.

యజ్ఞోపవీతం :

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఉపవీతం సమర్పయామి

అనగా జందెమును ఇవ్వవలెను , ఇదియును ప్రత్తితో చేయవచ్చును ప్రత్తిని తీసుకుని పసుపుచేత్తో బొటన వ్రేలు , మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి , కుంకుమను అద్దవలెను. దీనిని పురుషదేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.

గంధం :

శ్లో || శ్రీ ఖండం చందనం చైవ కర్పూరాగరు సంయుతం

విలేపర సుర శ్రేష్టే ప్రేత్ ర్ధం ప్రతి గుహ్యతాం.

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః గంధాన్ సమర్పయామి .ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడి చేతి ఉంగరం వ్రేలితో దేవి ప్రతిమపై చల్లవలెను.

ఆభరణం :

శ్లో || అంగుళ్య ముక్తా భరణాది యుక్తం హస్తాన లంకృత్యక రైశ్చ బంధం

మాణిక్య ముక్తా ఫల విద్రమేశ్చ గోమేదీ వైడూర్య కృతాంశ్చహారా ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆభరణాన్ సమర్పయామి.

అని దేవికి మనము చేయించిన ఆభరణములను అలంకరించవలెను. లేనిచో అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు దేవి పై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించ వలెను.

అక్షతలు :

శ్లో || అక్షతాన్ ధవళాన్ రమ్యా హరి ద్రాళంయుతా శుభా

అవి గృహ్ణా తుమే దేవి వాంచి తార్ద ఫలప్రదే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః అక్షతాన్ సమర్పయామి.

(అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కలపవలెను ) అక్షతలు తీసుకొని దేవి ప్రతిమపై చల్లవలెను.

పుష్ప సమర్పణ :

శ్లో || శత పత్రై ర్జాతి సుమై : మల్లికాది మనోహరై

కేతకీ కర వీరైశ్చ అర్చయామి హరప్రియే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పుష్పాణి సమర్పయామి .దేవికి పువ్వులతో అలంకారము చేయవలెను. పువ్వులను దేవిపై వేసి నమస్కరించ వలెను. పిదప అధాంగ పూజను చేయవలెను.ఈ క్రింది నామాలను చడువుచూ పుష్పములతో గాని , పసుపు కుంకుమలతో గాని దేవిని పూజించవలెను.

అధాంగ పూజ

మహా దేవ్యై నమః పాదౌ పూజయామి

కమలోద్భవాయైనమః గుల్ఫౌ పూజయామి

సర్వలోక జనన్యై నమః జానునే పూజయామి

పుణ్య మూర్త్యే నమః జంఘే పూజయామి

విశ్వ మూర్త్యై నమః ఊరూ పూజయామి

మహా గౌర్యై నమః కటిం పూజయామి

అదోక్షజాయై నమః హృదయం పూజయామి

కంబు కంట్యై నమః కంటం పూజయామి

పరమాత్మనే నమః స్కంధౌ పూజయామి

అంభోజ హస్తాయై నమః హస్తౌ పూజయామి

రమ్య ముభాయై నమః ముఖం పూజయామి

ధర్మ కృతాయై నమః కర్ణౌ పూజయామి

శర్వాన్యై నమః లలాటం పూజయామి

విష్ణుమూర్త్యై నమః శిరః పూజయామి

శ్రీ మహా గౌర్యై నమః సర్వాణ్యం పూజయామి ||

అధ గ్రంధి పూజా || తోరగ్రంధి పూజ ||

దేవ్యై నమః ప్రతమ గ్రంధి పూజయామి

కమలోద్భవాయై నమః ద్వితీయ గ్రంధి పూజయామి

ఇందు చూడామణ్యై తృతీయ గ్రంధి పూజయామి

సర్వలోక జనన్యై నమః చతుర్ధ పూజయామి

పుణ్య మూర్త్యై నమః పంచమ పూజయామి

పరమాత్మనే నమః షష్ఠ పూజయామి

ధర్మ కృతాయై నమః సప్తమ పూజయామి

సరస్వత్యై నమః అష్టమ పూజయామి

మహా గౌర్యై నమః నవమ పూజయామి

మన్మధ వాసిన్యై నమః దశమ పూజయామి

పుణ్య మూర్త్యై నమః ఏకాదశ పూజయామి

శుబ్ర వర్ణాయై నమః ద్వాదశ పూజయామి

సరస్వత్యై నమః త్రయోదశ పూజయామి

ధర్మ కృతాయై నమః చతుర్దశ పూజయామి

కనకా భరణాయై నమః పంచదశ పూజయామి

సర్వలోక జనన్యై నమః షోడశ పూజయామి

తరువాత అష్టోత్తర శతనామావళి పూజ దీనియందు 108 మంత్రములుండును ఈ మంత్రములను చదువుచు పుష్పములతో గాని , పసుపు కుంకుమలతో గాని దేవిని పూజించవలెను. పిదప అగరుబత్తిని వెలిగించి

ధూపం :

శ్లో || దశాంగం గుగ్గులం ధూముత్త మంగంధం సంయుతం

తన ప్రియార్ధ మానీతం గృహాణ పరమేశ్వరి ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ధూప మాఘ్రాపయామి .ధూపం సమర్పయామి అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను దేవికి చూపవలెను

దీపం :

శ్లో || సాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా

గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరా పహే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః సాక్షాత్ దీపం దర్శయామి .

అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో వున్నఅదనపు వత్తులలో ఒక దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం దేవికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.

నైవేద్యం :

శ్లో || ఆ పూపాన్వి విధా స్వాదూశాలి గోధుమ పాచితా

షోడశే కాగు యుక్తా గృహాణ పరమేశ్వరి.

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నైవేద్యం సమర్పయామి

అని ఒక బెల్లం ముక్క , పళ్ళు , కొబ్బరికాయ మొదలగునవి ఒక పళ్ళెము లోనికి తీసుకుని దేవి వద్ద ఉంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ "ఓం భూర్భువస్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి , ధియోయోనః ప్రచోదయాత్ , సత్యం త్వర్తేన పరిషించామి , (ఋతం త్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను ) అమృతమస్తు అమృతో పస్తరణమసి , ఓం ప్రాణాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణె తో ) దేవికి నివేదనం చూపించాలి. పిదప ఓం శ్రీ గౌరీ దేవి నమః నైవేద్యానంతరము "హస్తౌ ప్రక్షాళయామి " అని ఉద్దరిణెతొ పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర ) లో వదలాలి తరువాత "పాదౌ ప్రక్షాళయామి " అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతొ వదలాలి. పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకొక మారు నీరు వదలాలి.

తాంబూలం :

శ్లో|| పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం

కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః తాంబూలం సమర్పయామి

అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు , రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి ) దేవి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ , 'తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .పిమ్మట కర్పూరం వెలిగించి

నీరాజనం :

శ్లో || చిత్రం నీరాజనం దేవి గృహాణ హరి వల్లభే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః కర్పూర నీరాజనం సమర్పయామి.

అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించి న దీపంతో వెలిగించి , మూడు మార్లు తిప్పుచూ , చిన్నగా గంట వాయించ వలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ 'కర్పూర నీరాజనం అనంతరం శుద్దచామనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం దేవికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి తరువాత అక్షతలు , పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకుని ,

మంత్ర పుష్పం :

శ్లో || అక్షతాన్శ్వేత దూర్వాంశ్చ మల్లికా కుమాన్వితా||

పుష్పాంజిలిం ప్రదాస్యామి గృహాణ కరుణా నిధే ||

శ్రీ షోడశ గౌరీ దేవి నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి

అని చెప్పుకుని అక్షతలు , పువ్వులు , చిల్లర దేవి వద్ద ఉంచవలెను.పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణం చేయాలి.

ప్రార్ధన మంత్రం :

శ్లో || నృత్యైశ్చ గీత వాద్యైశ్చ పురాణ శ్రవణా దిభి :

రాజోపచారై ర్బహు భి : స్సంతుష్టా బహు సర్వదా ||

దేహి గౌరి సదారోగ్యం పుత్ర పౌత్ర ప్రవర్ధనం ,

త్వత్పాద పద్మ యుగళం పూజయామి హరప్రియే ||

తోర బంధనం :

శ్లో || సర్వ మంగళ మాంగల్యే సర్వ మంగళ దాయినీ ,

సర్వ సంపత్కర శీఘ్రం గౌరీ దేవి నమోస్తుతే ||

వాయన మంత్రం :

శ్లో || ఏవం సంపూజ్య బక్త్యాచ గౌరీ దేవీం స్వ శక్తితః

దాతవ్యం షోడశా పూపా నావాయ నంతు ద్విజాయచ ,

గందాదిభి నలం కృత్య బ్రాహ్మణాయ ప్రదీయతాం ||

శ్రీ గౌరీ ప్రతి గృహ్ణాంతు శ్రీ గౌరీ వైద దాతిచ ,

శ్రీ గౌరీ తారకో భాభ్యాం మహా గౌర్యై నమోస్తుతే ||

ప్రార్ధన :

యస్స్య స్మృత్యాచ , వరదా భవతు ||

పుష్పములను , అక్షతలను చేతియందు ఉంచుకుని , వ్రతకధను చదివి వాటిని దేవిపై వేయవలెను.

ప్రదక్షిణం :

శ్లో|| ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ ,

నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన ||

శ్లో || ప్రమద గణ దేవేశ ప్రసిద్దె గణ నాయక ,

ప్రదక్షిణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే ||

శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

శ్రీ దేవికి చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నెలకు ఆన్చి , ఆడువారు మోకాళ్ళపై పడుకుని కుడికాలు ఎడమకాలుపై వేసి ) తరువాత దేవిపై చేతిలో నున్న అక్షతలు , పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ

పునః పూజ :

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పునః పూజాంచ కరిష్యే

అని చెప్పుకుని , పంచ పాత్రలోని నీటిని చేతితో తాకి , అక్షతలు దేవిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను.

షోడశోపచారములు :

ఛత్రం ఆచ్చాదయామి , చామరం వీజయామి , నృత్యం దర్శయామి , గీతం శ్రావయామి , వాద్యం ఘోషయామి , సమస్త రాజోపచార , శక్త్యోపచార ,భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని , నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.

పూజాఫల సమర్పణమ్ :

శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు

యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతం

మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యానా వాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ షోడశ గౌరీ దేవి సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.

ఏతత్ఫలం శ్రీ షోడశ గౌరీ దేవి అర్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట ' శ్రీ షోడశ గౌరీ దేవి ప్రసాదం శిరసా గృహ్ణామి' అనుకుని స్వామి వద్ద అక్షతలు తీసుకుని తమ తమ తలలపై వేసుకొనవలెను. ఆపిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై ఉంచవలెను దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః యధాస్థానం ప్రవేశాయామి శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.

పూజావిధానం సంపూర్ణమ్

తీర్ధ ప్రాశనమ్ :

శ్లో || అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్ |

సమస్త పాప క్షయ కరం శ్రీ షోడశ గౌరీ దేవి పాదోదకం పావనం శుభం ||

అని తీర్ధమును చేతిలో వేసుకుని మూడు సార్లు నోటిలోనికి తీసుకొనవలెను.


వ్రతకదా ప్రారంభము

కైలాస పర్వతం పైన ఒకనాడు స్కందుడు (అనగా 'కుమార స్వామి ' పుత్రులు (కొడుకులు ) పౌత్రులు అనగా (మనుమలు ) కలుగు వ్రత మేదైనా ఉన్నచో తెలుపుము అనగా పరమ శివుడు " కుమారా ! మంచి ప్రశ్న అడిగితివి అన్ని సంపదలను యిచ్చునట్టి స్వర్ణ గౌరి (అనగా షోడశ గౌరీ వ్రతం )ఒకటి కలదు. ఈ వ్రతము యొక్క కధను వినుమని ఇలా చెప్పు చుండెను.

పూర్వము సరస్వతీ నదీ తీరంలో 'విమలము ' అనే పేరుగల నగరము ఉండెను. చంద్ర ప్రభుడు అను రాజు ఉండెను. ఈ రాజ్యానికి ఈయన అధిపతి ఇతనికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య యందు ఇతనికి ప్రేమ ఎక్కువ ఒకనాడు ఇతడు వేటకు చాలా దూరం వెళ్లి ఒక చెట్టు దగ్గర అనేక అంటే చాలా మంది స్త్రీలను చూచాడు. వాళ్ళంతా దీక్షతో స్వర్ణ గౌరి (షోడశ గౌరి ) వ్రతమును చేయుచుండిరి. చంద్ర ప్రభుడు ఆ వ్రత విధానమును , దాని ఫలమును వారి వలన తెలుసుకుని వెంటనే ఆ వ్రతమును చక్కగా శ్రద్దా భక్తులతో చేసి పదహారు గ్రంధులు (అనగా పదహారు పోగులు ) కల తోరమును కట్టుకొని ఇంటికి వచ్చి తన భార్యలకు ఆ వ్రతమును ఉపదేశించాడు. పెద్ద భార్య చంద్ర ప్రభుని చేతికి ఉన్న తోరమును చూచి అపార్ధం చేసుకుని , దుర్భాష లాడుతూ (అనగా అతనిని తప్పు పట్టి ) దానిని త్రెంపి తోటలోని ఎండిపోయిన చెట్టు పైకి విసిరివేసెను. తోరము తగిలిన వెంటనే ఆ చెట్టు చిగిర్చెను. ఇది అంతా చూసి , అతని చిన్న భార్య ఆశ్చర్యము చెంది ఆ తోరము తీసుకుని తాను కట్టుకొనెను. ఆ ప్రభావము చేత తన భర్తకు ఇష్ట మయ్యెను. అపచారము (చెడుపని) చేయుట చేత చంద్ర ప్రభుడు విడిచి పెట్టెను. విడువబడిన పెద్ద భార్య అనేక కష్టములు అనుభవించుచూ అడవుల పాలై దిక్కు తెలియక ఏడ్చు చుండెను. ఈమె ఏడ్చుట చూచి మహాగౌరి సాక్షాత్కరించెను. (అనగా కనిపించెను ) మహా గౌరిని చూచి నమస్కరించుచూ జయదేవి నమస్తుభ్యం జయ భక్త వరప్రదే ! అని ఈ విధముగా ప్రార్ధించి తన తప్పును క్షమింప చేయమని కోరెను. కరుణామయి అయిన గౌరి యొక్క అనుగ్రహమును పొంది స్వర్ణ గౌరి వ్రతమును చేసి , ఇహ లోకమున (ఈ లోకమున ) అన్ని విధములైన సౌభాగ్య సుఖములను పొంది చివరకు శివుని సన్నిధికి చేరెను.


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment