Wednesday 24 January 2018

మాఘపురాణo -మాఘ మాస విశిష్టత



“మాఘ మాసం” ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి “శుక్ల పక్ష చవితి” దీనిని “తిల చతుర్థి”అంటారు. దీన్నే “కుంద చతుర్థి” అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున “డుంఢిరాజును” ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు.”కుంద చతుర్థి” నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు
“దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!”
అని చేసిన తరువాత
“సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!”
అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి.

ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు.కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. “మాఘశుద్ద పంచమి”ని శ్రీ పంచమి అంటారు.ఈ పంచమి నాడే “సరస్వతీదేవి” జన్మించిందట. ఈనాడు “రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.
అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది. ఇక మాఘశుద్ద సప్తమి ఇదే “సూర్య సప్తమి”అని కూడా పిలువబడుతుంది.ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.
సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే “శమంతకమణి” ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి “మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!” శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.ఈ విధంగా మాఘమాసమంతా “శివరాత్రి”వరకూ అన్నీ పర్వదినాలే.
మాఘమాసమున అనగా మకరరాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు, వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేర్తాయి అని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది.
మాఘస్నాయీ వరారోహు దుర్గతిం వైవ పశ్యతి |
తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్‌ |
అగ్ని ప్రవేశాదధికం మాఘస్నానం న శోధయేత్‌ |
జీవితా భుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖమ్‌ |
ఏతస్మాత్కారణేద్భద్రే మాఘస్నానం విశిష్యతే

మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తుంటారు.దీనికి కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ది. మాఘస్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు.
బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థ, సన్యాసాశ్రమాలవారూ, అన్ని వర్ణములవారూ, వర్గములవారూ, ప్రాంతాలవారు ఈ మాఘస్నానం చేయవచ్చు.మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసినా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే పనె్నండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలాన్నీ, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, గంగాస్నానం సహస్రగుణం, గంగాయమునా సంగమ (త్రివేణి) స్నానం నదీ శత గుణ ఫలాన్నీ ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగాయమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయసింధులో స్పష్టం చేశారు.
‘‘దుఃఖ దారిద్య్ర నాశయ శ్రీ విష్ణోస్త్రోషణాయచ
ప్రాతఃస్నానం కరో మధ్యమాఘే పాప వినాశనం
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనా నేన మేదేవ యధోక్త ఫలదోభవ’’ అనే ఈ శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి.

రోజూ సమయాభావంవల్ల, అనారోగ్యంవల్ల చేయలేనివారు మాఘంలో పాడ్యమి, విదియ, తదియ తిథులలో స్నానం చేసి, మళ్లీ త్రయోదశి, చతుర్దశి మాఘ పూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు.
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరవాతే మాఘమాసం రావటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ మాసంలో సూర్యారాధన, శివోపాసన, విష్ణ్వార్చన వంటివి విశేష ఫలాన్నిస్తాయి. సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. కార్తీకమాసం దీపానికి ప్రధానమైనట్లే మాఘమాసం స్నానానికి ముఖ్యం.
సూర్యోదయానికి ముందు నదీ స్నానం ఉత్తమం. నది అందుబాటులో లేనివారు తటాకంగానీ, బావిగానీ స్నానానికి మంచిది. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర నదీ స్మరణతో ‘గంగేచ …..జలేస్మిన్ సన్నిధింకురు’’ అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి.
మాఘస్నానానాలన్నింటిలోకి త్రివేణి సంగమ స్నానం ఉన్నతమైన ఫలితాన్ని అందిస్తుందని ధర్మశాస్తవ్రచనం. ఉత్తర భారతదేశంలో ఈ నదీ స్నానానికి విశేష ఆదరణ వుంది. మాఘపూర్ణిమనాడు అశేష జనవాహిని త్రివేణి సంగమంలో, గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. దక్షిణ భారతంలో కృష్ణ, గోదావరి, కావేరి నదుల్లో స్నానమాచరిస్తారు. స్నానమాచరించు సమయంలో, శివకేశవాది దేవతాస్మరణ, గంగాయమున, సరస్వతి, గోదావరి వంటి పుణ్యనదుల స్మరణ చేయాలి. అదేవిధంగా ఈ మాసంలో దానం, జపం విశేషంగా చేస్తే ఎంతో మంచిది.
పవిత్రమైన విశేషమైన మాఘస్నానాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యఫలాన్ని పొందటానికి అందరూ ముందుండాలి. ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది. మాఘమాసంలో పుణ్యమైన మాఘస్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్యదినాలున్నాయి. ఈ మాసంలో డుంఠి గణపతి పూజ, శ్రీపంచమి, భీష్మైకాదశి, మహాశివరాత్రి, రథసప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏ మాసంలో వచ్చే విశేష దినాలను ఆచరిస్తే మానసిక శాంతి, ఆధ్యాత్మికత, పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు. కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తివంచన లేకుండా కొన్ని ధార్మిక, ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితం ఆనందంగా గడపవచ్చు.

No comments:

Post a Comment