Friday 18 December 2020

తిరుపావై ప్రశ్నావళి-జవాబులతో




*శుభ ధనుర్మాసం.* తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై ప్రశ్నావళి. *ఇది ఎవరి జ్ఞానాన్ని పరీక్షించడానికో లేదా ఏ కొందరినో విజేతలుగా ప్రకటించడానికో సంకలనం చేసిన ప్రశ్నావళి కాదు.* శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.
*1.* ఆండాళ్ అని ఎవరికి పేరు?
=గోదాదేవి.
*2.* తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?
= సుప్రభాతం బదులుగా.
*3.* ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?
=భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.
*4.* గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?
=శ్రీ విష్ణు చిత్తులు.
*5.* ఆళ్వారులు ఎంతమంది?
=12మంది.
*6.* గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?
=భూదేవి.
*7.* గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?
=తమిళ భాష.
*8.* తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?
=నాలాయిర్ దివ్యప్రబంధము.
*9.* శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?
=108.
*10.* గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?
=శ్రీవిల్లిపుత్తూరు.
*11.* దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?
=దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.
*12.* శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?
=196 అడుగులు.
*13.* ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?
=మూడవ పాశురం.
*14.* శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?
=తిరుసాదము.
*15.* శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?
=కోదై (గోదా)
*16.* పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?
=గరుడాంశము.
*17.* తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?
=శ్రీవ్రతము.
*18.* మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?
=పరమాత్మ చేతిలోని శంఖమువలే.
*19.* శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?
=మన్మధుని
*20.* తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?
=సింహం పిల్లవలె.
*21.* తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?
=ధృడమైన కోరిక, పట్టుదల.
*22.* కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?
=మొదటి పాశురం.
*23.* శ్రీకృష్ణుడు యశోదగర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?
=దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)
*24.* ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?
=రెండవ పాశురం.
*25.* తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?
=వామన అవతారం.
*26.* ఆళ్వార్లకు మరో పేరేమిటి?
=వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.
*27.* నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?
=మూడు.
*28.* మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?
=పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.
*29.* శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?
=ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).
*30.* ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?
=యమునా నది.
*31.* మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?
=దానగుణం.
*32.* లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?
=వర్షానికి.
*33.* పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?
=పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.
*34.* విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?
=ఐదవ పాశురం.
*35.* విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
=నమ్మళ్వారు.
*36.* తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
=బుద్ధివ్రతం.
*37.* గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?
=పిళ్ళాయ్ (పిల్లా).
*38.* తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?
=ఆళ్వార్లతో.
*39.* గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?
=పూదత్తాళ్వారు.
*40.* తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?
=శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.
*41.* కీచుకీచుమని అరిచే *ఏ* పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?
=భరద్వాజ (చాతక) పక్షులు.
*42.* తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?
=కులశేఖరాళ్వార్.
*43.* మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?=పక్షులు.
*44.* ఎనిమిదవ పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?
=నమ్మళ్వారు.
*45.* పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?
=శిరువీడు.
*46.* భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?
=కులశేఖరాళ్వార్.
*47.* అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?
=కుంభకోణం.
*48.* పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
=ప్రీతి వ్రతం.
*49.* కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?
=పూదత్తాళ్వార్.
*50.* పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?
=శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.
*51.* పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?
=బకాసుర వధ.
*52.* సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?
=త్యాగం.
*53.* శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?
=తిరుప్పాణి.
*54.* తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?
=భగవద్రామానుజులు.
*55.* తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?
=నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు”.
*56.* శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?
=అహంకారమును హతమార్చుట.
*57.* పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?
=దాస్య వ్రతము.
*58.* గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?
=నందగోపుని (భగవానుని అందించారు కనుక)
*59.* కోయిల్ అనగా ఏమి?
=కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.
*60.* నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?
=దాన గుణము.
*61.* గోపికలు ఎంబెరుమాన్ (మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?
=నందుడు.
*62.* భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?
=తిరుమంగై యాళ్వారు.
*63.* గోపికలు తమ వంశమునకు ‘మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?
=యశోద.
*64.* శెంపొర్కజలడి-ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?
=బలరాముడు.
*65.* నీళాదేవి ఎవరు?
=కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.
*66.* యశోద తమ్ముడు ఎవరు?
= కుంభుడు.
*67.* భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?
=పేయాళ్వారు.
*68.* ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?
=ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.
*69.* భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?
=18 వ పాశురం.
*70.* లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?
=18వ పాశురం.
*71.* శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?
=కువలయాపీడము.
*72.* అశ్వినీ దేవతలు ఎవరు?
= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.
*73.* గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?
=అద్దము, విసనకఱ్ఱ.
*74.* తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?
=కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.
*75.* ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?
=మృగరాజగు సింహము.
*76.* ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?
=అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.
*77.* పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?
=సర్వగంథః -సర్వవిధ పరిమళములు.
*78.* పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?
=సింహ గర్జన.
*79.* కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?
=మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.
*80.* కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?
=వెలగ చెట్టు.
*81.* ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
=భోగవ్రతము.
*82.* ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?
=శ్రీవిల్లిపుత్తూరు.
*83.* పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?
=పాంచజన్యము.
*84.* ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన కూడార్ ఎవరు?
=సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.
*85.* ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?
=కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)
*86.* భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?
=గోవింద.
*87.* భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?
= తిరుమొళిశై యాళ్వారు.
*88.* కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?
=సూర్యునికి, కాంతికి గల సంబంధము.
*89.* గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?
=ఆవుల వెనుక.
*90.* ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?
=27 వ పాశురం.
*91.* పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?
=శ్రీకృష్ణునివి.
*92.* భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?
=దాసుని లక్షణములు.
*93.* 'అజాయమానః' (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?
='బహుధా విజాయతే' (అనేక విధములుగా పుట్టుచున్నాడు)
*94.* సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?
=విష్ణుపోతము
(విష్ణువనే ఓడ)
*95.* పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?
=ఆయన దాసులే గొప్ప.
*96.* ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?
=ఎన్ని జన్మలకైనా అని అర్థము.
*97.* ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?
=అయోధ్య.
*98.* వజ్గం అంటే ఏమిటి?
=ఓడ.
*99.* ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?
=అమృత కలశం.
*100.* ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?
=తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.
*101.* గోపికల దివ్యాభరణములేవి?
=కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.
*102.* శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?
=అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.
*103.* శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?
=పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.
*104.* గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?
= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).
*105.* తిరుప్పావై ఎటువంటి మాల?
=ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.
*106.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?
= గోదాదేవి.
*107.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?
=గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.
*108.* భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
=తొండరపడిప్పొడి
యాళ్వార్.
*జై శ్రీమన్నారాయణ!*
*ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్*

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment