Monday 28 December 2020

శివపురాణం – 39



త్రిపురాసుర సంహారం - పార్ట్ 1
త్రిపురాసురవృత్తాంతం శంకరుడి లీలలలో ఆయన చేసిన రాక్షస సంహారములలో చాలా ప్రధానమయినదిగా చెప్పబడుతుంది. దీనికి ఉన్న స్థాయి బహుశ ఏ ఇతర రాక్ష సంహారమునకు లేదు. ప్రత్యేకించి శంకరుడు చేసిన రాక్షస సంహారములలో ఇతరమయిన వాటికి త్రిపురాసుర సంహారముతో సమానమయిన ప్రతిపత్తిని ఇవ్వరు. త్రిపురాసురసంహారం అనేది ఒక గమ్మత్తు. ఎందుచేతనంటే అమ్మవారిని మనందరం సాధారణంగా పిలిచే పేరు త్రిపురసుందరి. ఆయన త్రిపురాంతకుడు. వీరిద్దరూ ఆదిదంపతులు. ఇద్దరి విషయంలోనూ త్రిపుర’ అనే మాటను అనుసంధానం చేస్తారు. ఇంకా చెప్పాలంటే అమ్మవారికి ‘త్రిపుర’ అనే పేరు కూడా ఉంది. శంకరుడిని త్రిపురాంతకుడు అంటారు. అనగా త్రిపురములను అంతము చేసినవాడు అని అర్థం. త్రిపురాసురుల ముగ్గురు పేర్లను పురాణం ప్రక్కన పెట్టింది. లోకంలో సాధారణంగా త్రిపురాసుర సంహారం జరిగింది అని చెప్తారు. ఇందులో ముగ్గురికీ విడివిడిగా పేర్లు ఉన్నాయి. కానీ ఎవరి పేరు వారికి పెట్టి వాడిని అంతం చేసిన వాడిగా శివుడిని పిలవరు. ‘త్రిపురాంతకుడు’ ‘త్రిపురారి’ అని పిలుస్తుంటారు. అసలు అలాంటి పేరు ఎందుకు వచ్చిందో పరిశీలిద్దాం.
తారకాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చేతిలో నిహతుడయిన రాక్షసుడు. లోకములను చాలాకాలం బాధపెట్టినవాడు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాడి పేరు తారకాక్షుడు. రెండవవానిపేరు కమలాక్షుడు, మూడవ వాని పేరు విద్యున్మాలి. ఈ ముగ్గురికీ తండ్రి తారకాసురుడు. తారకాసురుడు తనకు చావురాదని ధైర్యమును ఎందుకు పెంచుకున్నాడు? పరమశివుడికి వీర్యము స్కలనమయితే దానివలన ఆయనకు కుమారుడు పుడితే ఆ కుమారుడి వలన తాను మరణించాలని కోరుకున్నాడు. ఆయన నమ్మకమేమిటంటే శంకరుడు కామారి. కాముని పట్ల శత్రుత్వమున్న వాడు. ఆయన కామమునకు లొంగడు. కనుక వీర్యము స్కలనం కాదు. అందువలన శంకరునకు కొడుకు పుట్టడు. కొడుకు పుట్టడుకాబట్టి తనకు మరణం లేదు అని భావించాడు. మరణం లేకుండా ఉండడం కుదరదని బ్రహ్మగారు అన్నారు కాబట్టి ఆయన ఇంకొక వైపునుండి నరుక్కు వచ్చారు. ఇంత ప్రయత్నం చేసినా సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించనే ఆవిర్భవించాడు – తారకాసుర సంహారం జరగనే జరిగింది.
కానీ ఆయన ముగ్గురు కొడుకులకు బుద్ధి రాలేదు. వాళ్ళు ముగ్గురు మళ్ళీ బ్రహ్మగారి కోసం తపస్సు మొదలుపెట్టారు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ‘మీకు ఏమి కావాలి?’ అని అడిగారు. వారు తమకి చావు లేకుండా ఉండాలని కోరారు. బ్రహ్మగారు ‘ ఆత్మకి చావు లేదు. శరీరము చావకుండా ఉండలేదు. మరణం అనేది జగత్తు ధర్మము. ఈ శరీరము జగత్తులో అంతర్భాగము. మరణం లేకుండా ఈ శరీరంతో శాశ్వతంగా ఉండిపోవడం అనేది కుదరదు’ అని చెప్పాడు. ఇది విన్న వాళ్ళు బ్రహ్మగారితో “సరస్సులోంచి పుట్టిన దాంట్లోంచి పుట్టిన వాడా – నీవు మేము అడిగింది ఇవ్వలేవు. మేము ఈ శరీరంలో శాశ్వతంగా ఉండేట్టుగా వరమునీయవలసినది అడుగుతున్నాము. నీవు అది కుదరదని అంటున్నావు. నీవు మాకు సంపదనిచ్చినా దానిని అనుభవించడానికి అసలు ఈ శరీరమునకు ఆయుర్దాయము ఉంటే కదా!’ అన్నారు. అప్పుడు బ్రహ్మగారు నేను మీకు మరణం లేకుండా ఉండేలా వరం ఇవ్వలేను. కానీ మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారో చెప్పినట్లయితే అలా వరం ఇవ్వగలను’ అన్నారు. అప్పుడు వారు ‘నీవు మయుడిని పిలిపించి ఒక బంగారు నగరమును, ఒక వెండి నగరము, ఒక యినుప నగరమును నిర్మింప జేయి. మా ముగ్గురు అన్నదమ్ములం ఆ మూడింటిలో ఎక్కుతాము. అవి మూడూ ఆకాశంలో ఆగకుండా తిరుగుతుండాలి. మాకు అందరినీ ఓడించగల శక్తి ఉండాలి. అలా తిరుగుతూ మేము భోగములన్నీ అనుభవిస్తాము. ఈ మూడు పురములు ఎప్పుడూ ఒక సరళరేఖలోకి రాకూడదు. వెయ్యి దివ్య సంవత్సరములకు ఒక్క క్షణం సేపు మాత్రం ఈ మూడు పురములు ఒకే సరళరేఖలోకి వచ్చి నిలబడాలి. ఇలా నిలబడినప్పుడు మిట్టమధ్యాహ్యం వేళ అభిజిత్ ముహూర్తంలో చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా పుష్కలా వర్తక మేఘములలోంచి వర్షము కురుస్తుంటే ఇతః పూర్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కొత్త రథం ఎక్కి ఇతః పూర్వం లోకంలో ఎవరూ పట్టుకోని ఒక అపూర్వమయిన ధనుస్సు పట్టుకుని ఒకే బాణంతో దేవతాసార్వభౌముడు అయినవాడు కొట్టేస్తే అప్పుడు మేము చనిపోతాము. ఆ క్షణంలో ఒక్క బాణంతో అటువంటి రథం మీద ఎక్కి అటువంటి వాడు కొట్టకపోతే మరల మేము బ్రతికేస్తాము. కాబట్టి అలా మాకు వరం ఇవ్వవలసినది’ అని అడిగారు. అపుడు బ్రహ్మగారు తథాస్తు అన్నారు.
వెంటనే వారు దేవలోకము మీదికి దండయాత్ర చేసి దేవతలనందరిని ఓడించి వాళ్ళనందరిని వీళ్ళు చెప్పినట్లుగా చేయవలసినదని ఆజ్ఞాపించారు. ఈవిధంగా వారు ప్రకృతిని శాసించడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవతలు బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘మహానుభావా మీరు వరం ఇచ్చేశారు. వాళ్ళు చాలా ఉద్ధతితో ఉన్నారు. లోకములను బాధపెట్టేస్తున్నారు. దీని నుంచి బయటపడడం ఎలాగ? దయచేసి మమ్మల్ని అనుగ్రహించండి’ అని అడిగారు. అపుడు ఆయన ‘నాయనలారా, ఇప్పుడు వాళ్ళ దగ్గర మూడు బలములు ఉన్నాయి. వరబలం, సహజమైన శరీరబలం, శివపూజ వలన వచ్చిన బలం. అటువంటి పరిస్థితులలో వాళ్ళమీదికి వెళ్తే ఓడిపోతాము. కాబట్టి శివుడి దగ్గరకు వెళదాము’ అన్నాడు.




శివపురాణం – 39 – పార్ట్ 2
అందరూ కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్లి ‘శంభో శంకరా’ అని పిలిచారు. ఆయన వచ్చి ‘వాళ్ళు తెల్లివారినప్పటినుంచి రాత్రి వరకు నా నామస్మరణ చేస్తుంటారు. నన్ను కొలుస్తూ ఉంటారు. నాపూజ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను చంపను. కానీ మీకొక మార్గం చెప్తాను. విష్ణువును అడగండి. ఆయన ఏదో ఒక మాయచేసి మిమ్మల్ని రక్షిస్తాడు’ అని చెప్పాడు. దేవతలందరూ వైకుంఠమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని కీర్తించారు. ఆయన ప్రత్యక్షం అయి ‘మీకు ఏమి కావాలి’ అని అడిగాడు. వాళ్ళు జరిగిన కథంతా చెప్పారు. ‘ఒక చిన్న మాయ చేశారు విష్ణువు. సంకల్పం వలన ఒక పురుషుడు పుట్టాడు. వాడు బోడిగుండుతో, మాసిపోయిన బట్టలు కట్టుకున్నాడు. మాసిపోయిన గుడ్డనొకదానిని భుజంమీద వేసుకున్నాడు. చేతిలో పుర్రెనొకదానిని పట్టుకున్నాడు. పుడుతూనే ‘ధర్మం ధర్మం’ అంటున్నాడు. వెంటనే శ్రీమన్నారాయణుడు అతనికి ‘అరిహన్’ అని నామకరణం చేసి ‘ఇప్పుడు నువ్వు వైదిక ధర్మమును పక్కన పెట్టేస్తూ సనాతన ధర్మం దారి తప్పి పోయేటట్లుగా వినడానికి చాలా అందంగా ఉండేటట్లుగా చక్కగా తేనె రాసిన విషంలా నీవు పదహారు వేల శ్లోకములతో ఒక సిద్ధాంతమును తయారుచేసుకుని, త్రిపురాసురులు పాలిస్తున్న పట్టణములకు వెళ్లి నువ్వు పెద్ద యతిలా కూర్చుని ఈ ప్రబోధం మొదలుపెట్టు. అపుడు క్రమక్రమంగా సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు అటువైపు వెళ్ళడం మొదలుపెడతారు. వారి ధర్మమూ లుప్తమయిపోతుంది. అపుడు వారిని సంహరించడానికి శివుడు వస్తాడు. కాబట్టి నీవు వెళ్లి ఆ బోధ చెయ్యి’ అన్నాడు.
ఈయన త్రిపురాసురుల వద్దకు వెళ్ళాడు. అక్కడ ఎవ్వడూ ఆయన బోధ వినలేదు. అప్పుడు విష్ణువు నారదా, నీవు బయలుదేరి త్రిపురాసురుల దర్శనమునకు వెళ్ళు. వాళ్ళకి చెప్పవలసిన మాటలు చెప్పి మార్గమును సుగమం చెయ్యి అన్నాడు. అప్పుడు నారద మహర్షి త్రిపురాసురులలో పెద్దవాడు అయిన తారకాక్షుడి దగ్గరికి వెళ్ళి ‘నీ రాజ్యమునకు ఒక మహాపురుషుడు వచ్చాడు. అతడు చాలా గొప్ప సిద్ధాంతమును ఉపదేశిస్తున్నాడు. అతను చాలా గొప్పవాడు. అని చెప్పాడు. అయితే ఆయన ఇపుడు ఎక్కడ ఉన్నాడు అని తారకాక్షుడు నారదుని అడిగాడు. నారదుడు అరిహన్ ఉన్నచోటును చెప్పాడు. తారకాక్షుడు అరిహన్ ను పిలిపించి, ప్రబోధం చేయమని అడిగాడు. అరిహన్ చెప్పడం ప్రారంభించాడు. త్రిపురుడు వింటున్నాడు. అంతా ఈశ్వర కృప అంటూ ఉంటారు. ఎవడా ఈశ్వరుడు? ఇలాంటి తెలివితక్కువ మాటలు మానేయండి కంటికి కనపడని వాడికి పూజలు, యజ్ఞములు, యాగములు చెయ్యకండి అంటూ చెప్పాడు. అరిహన్ శ్రీమహావిష్ణువు సూచనల ప్రకారం ఇలా చెప్పి సమాజం పాడయిపోయే మాటలను తారకాక్షుడికి నూరిపోస్తున్నాడు. అరిహన్ చెప్పిన మాటలను వారు చెవులొగ్గి విని ‘ఆహా ఎంత గొప్పగా చెప్పావయ్యా. మేము మందమతులం. ఇన్నాళ్ళు ఈ విషయములు మాకు తెలియలేదు. అని వెంటనే రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరినీ వావి వరుసలు లేకుండా వారి వారి ఇష్టానుసారంగా భోగములు అనుభవించండి అని చెప్పారు. అంతే ఇంక శరీర సంబంధమయిన భోగం ప్రారంభం అయిపొయింది. పూజా పునస్కారములు లేవు, యజ్ఞయాగాదులు లేకుండా పోయాయి. దీనికంతటికీ కారణం వినకూడనిది వినడమే. ఇప్పుడు శ్రీమహావిష్ణువు, బ్రహ్మ మిగిలిన దేవతలు అందరూ కలిసి పరమశివుడి దగ్గరకు వెళ్ళి ‘శంకరా, మీరు చెప్పినట్లుగా సర్వం సిద్ధం చేసేశాము’ అని చెప్పారు. అప్పుడు శంకరుడు ‘వాళ్ళు పాపం చేశారు కాబట్టి దేవత సార్వభౌముడిగా వాళ్ళని సంహరించడం నాకు పెద్ద విశేషం కాదు. కానీ వాళ్ళు కొన్ని వారములు అడిగారు కదా! మరి వాటినన్నింటిని తెచ్చారా? అని అడిగాడు. అపుడు దేవతలు ‘అవన్నీ పట్టుకునే వచ్చాము అనగా శివుడు వాటిని తెమ్మని చెప్పాడు.
వాళ్ళు సమస్త లోకములలో ఉండే సారమును పిండి దానిని భూమండలం మీద రథములుగా మార్చారు. ఆ రథమునకు కుడిచక్రంగా సూర్యుడిని, ఎడమచక్రంగా చంద్రుడిని పెట్టారు. ఆ చక్రములకు ఆకులుగా ద్వాదశాదిత్యులను పెట్టారు. నక్షత్రములతో అలంకారం చేశారు. ఆ రథమునకు కమ్ములుగా ఋతువులను, ఆకాశమును కప్పుగా పెట్టారు. మందర పర్వతమును శివుడు కూర్చొనడానికి ఆసనంగా వేశారు. ఉదయాచలం హస్తాచలం అనే రెండు కొండలను నొగలుగా, సంవత్సరములను రథవేగంగా మార్చారు. ఉత్తరాయణ, దక్షిణాయనములను రెండు చక్రములకు శీలలుగా వేశారు. పంచభూతములను రథమునకు బలంగా కూర్చారు. వేదవేదాంగ పురాణములను రథమునకు గంటలుగా కట్టారు. గంగాది నదులను శివుడు కూర్చున్నప్పుడు చామరం వేయడానికి స్త్రీలుగా మార్చారు. బ్రహ్మగారిని సారధిగా కూర్చోబెట్టారు. ప్రణవమును ఆ గుర్రములను తోలడానికి కొరడాగా మార్చారు. మేరు పర్వతమును ధనుస్సుగా చేశారు. ఆది శేషుడిని అల్లెత్రాడుగా కట్టారు. సరస్వతీ దేవిని గంట కొట్టి బయలుదేరాలి కాబట్టి రథమునకు ముఖ్య గంటగా మార్చారు. శ్రీమహావిష్ణువు బాణంగా మారారు. వేదములను రథాశ్వములుగా సమకూర్చారు. మహర్షులు రథము ముందు గానం చేసేవారిగా బయలుదేరారు. ఆ రథం నడవలేదు. ఇంతమంది దేవతలు చేసిన నిర్మాణం విఫలం అయిపోయింది.
అప్పుడు స్థితికారుడుగా శ్రీమహావిష్ణువు ‘దేవతలారా, మీరు ఈ రథమును లాగలేరు. నాకు, పరమశివునికి భేదం లేదు. కాబట్టి ఇప్పుడు నేనే ఆయనను కదపాలి అని శ్రీమహావిష్ణువు వృషభమయిపోయి ఆ రథమును లాగేయడం మొదలుపెట్టాడు. ఎలాగయితేనేం రథం కదిలింది. ఇప్పుడు శివుడు మేరు పర్వతమును ధనుస్సుగా పట్టుకుని, ఆదిశేషుడిని వింటినారిగా కట్టి టంకారము చేసి, శ్రీమహావిష్ణువును బాణంగా తీసుకుని లాగి విడిచిపెట్టాలి. అపుడు శంకరుడు ‘నేను సర్వలోక సృష్టి స్థితి ప్రళయకర్తను. నేను ఏదయినా చేస్తే అది నా అనుగ్రహం క్రిందకే వస్తుంది. మీకు బ్రహ్మగారు వరం ఇచ్చారు. నేను మిమ్మల్ని చంపలేనని అనుకుంటున్నారు. లోకమునందు లేని ఆయుధముతో చంపమని అడిగారు. నేను నా మూడవ కన్ను విప్పితే ఏమవుతారు? అని ఆగ్రహమును పొంది తెల్లటివారు ఎర్రబడి ఒక్కసారి కాల్చేద్దామని అనుకున్నాడు. కానీ వెంటనే పరమ దయా స్వరూపుడై త్రిపురాసురులను సంహారం చేయడం కోసమని మూడవ కన్ను విప్పబోతున్నాడు. రెప్ప కొద్దిగా కదిలింది. నాడు శ్రీ మహావిష్ణువు సోముడు కాలాగ్ని ఇవన్నీ కలిసి బాణంగా వచ్చి ‘ఈశ్వరా, ఒక్కసారి మీ చేతితో మమ్మల్ని స్పృశించి బాణమును పట్టుకుని మీ ధనుస్సును చేతితో పట్టుకుని ఆదిశేషుని వింటినారిగా మీరు వంగి కట్టి పైకి లేచి ఈ బాణమును తగిలించి ఆకర్ణాంతం లాగితే మీ చెవిదాకా వచ్చి మీలో ఉన్న శక్తి మాలోకి ప్రసరించాక, బాణము మీ ధనుస్సు నుండి విముక్తమై త్రిపురాసుర సంహారం చెయ్యాలని మాకు కోరిక. అందుకని మమ్మల్ని బాణంగా ముట్టుకోండి. అని పరమశివుని అడిగారు. అప్పుడు శంకరుడు నవ్వి ఈ బాణమును తీసుకుని సంధించి విడిచిపెట్టాడు. ఆ ఒక్క బాణమునకు త్రిపురాసురులు బూదికుప్పలై క్రిందపడిపోయారు. శంకరుని మీద బ్రహ్మాండమయిన పుష్పవృష్టి కురిసింది.
త్రిపురములను కాల్చడం అంటే ఏమిటి? త్రిపురములు మనలోనే ఉంటాయి. అవి స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరములతో జాగ్రత్, స్వప్న సుషుప్తి, సృష్టి స్థితి లయ అనబడే మూడూ జరుగుతుండడం. మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతికినా ఈ మూడు అవస్థలనూ అనుభవిస్తాడు. వీటితో పాటు నాల్గవది ‘తురీయం’ ఉంది. తురీయంలో ఉన్నవాడు ఈ మూడింటికీ సాక్షి. ఈ తురీయం చేరడానికి దానికి ముందు గల మూడు అవస్థలను తెలుసుకోవాలి. సాధారణంగా జనులు ఈ నాల్గవ దానికి వెళ్ళరు. నాల్గవది చేరడానికి మొదట భగవంతునియందు పరమభక్తి ఏర్పడాలి. అలా ఏర్పడకపోతే మీకెప్పుడూ మాయవలన ఇవే చాలా సుఖంగా ఉన్నాయని ఇంద్రియములతో లేవడం, శౌచం లేకుండా అన్ని పదార్థములను తినడం, ఇంద్రియములతో అన్నింటిని అనుభవించడం చేస్తూ జాగ్రత్ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాడు. ఈ మూడు అవస్థలు మనకు చాలా సుందరముగా ఉంటాయి. అలా తిరగడమే త్రిపురసుందరి. అదే స్థూల సూక్ష్మ కారణ శరీరము. కానీ ఈ మూడు కాకుండా పరమ కారణ శరీరము అని ఒకటి ఉంది. దానిని తెలుసుకోవాలంటే ముందుగా భక్తితో ఈశ్వరుడి పాదములు పట్టుకోవాలి. పట్టుకుంటే ఆయన బాణం వేస్తాడు. ఆ బాణం తగిలితే త్రిపురములు కూలిపోతాయి. అప్పుడు స్థూల సూక్ష్మ కారణముల మీద మమకారం లేకుండా తురీయమునందు తాను సాక్షిగా ఈ మూడింటిని చూస్తాడు. ఈ స్థితి యందు ఈశ్వరుడు మనలను పైకెత్తడానికి ఆయనకు దయ ఉండాలి. ఈ దయ భక్తివలన కలుగుతుంది. కాబట్టి ఇపుడు త్రిపురులను దయతో చంపాలి. కాబట్టి త్రిపురసంహారం కేవలం శంకరుని అపారమయిన దయ వలన జరిగింది. కాబట్టి ఈశ్వరుడి లీలలలో త్రిపురాసుర సంహారమును గొప్ప లీలగా చెప్తారు.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment