Tuesday 29 December 2020

శివ పురాణము – 40

 d


పార్వతీ కళ్యాణము – పార్ట్ 1
ఒక పురాణకథను చదివేటప్పుడు అది మనకు ఏ విషయమును బోధ చేస్తోంది అనే విషయమును సమగ్రంగా పట్టుకునే ప్రయత్నం చేయకపోతే దానివలన ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది. ఆ కథను చదవడం వలన మీరు ఎన్నో విషయములను తెలుసుకోవలసి ఉంటుంది. ఆ విషయములను తెలుసుకుని ప్రవర్తించడం చాలా ముఖ్యం.
ఒకానొక సమయంలో ప్రజాపతులందరూ సత్రయాగం చేస్తున్నారు. ఆ యాగమునకు ఎందఱో పెద్దలు వచ్చారు. ఆ వచ్చినవారిలో చతుర్ముఖ బ్రహ్మ, శంకరుడు కూడా ఉన్నారు. మహానుభావుడు శంకరుడు త్రిమూర్తులయందు ఒకడు. ఒకచోట ఆయనే త్రిమూర్తులుగా ఉన్నవాడు. కాబట్టి ఆయనకు ఆసనం వేసి కూర్చోబెట్టారు. సభలో ఎవరు వచ్చినపుడు ఎవరు నమస్కరించాలి అన్నది తెలిసి ఉంటే అది వినయం అవుతుంది. తెలియకపోతే అది అహంకారమునకు కారణం అవుతుంది. అందరూ ఆయనకు నమస్కరించారు. అందరూ కూర్చున్నారు. చక్కగా యాగం జరుగుతోంది. యాగమునకు వచ్చిన వాళ్ళలో బ్రహ్మగారు, అనేక యోగులు, ఋషులు, ఎందఱో మహానుభావులు ఉన్నారు. ఆ యాగమునకు వీళ్ళందరూ పరమభక్తితో వచ్చారు. వీరందరూ కూర్చుని ఉండగా ఒక్కసారి అనేక సూర్యులు వెలుగుతుంటే ఏలాగున ఉంటుందో అంత ప్రకాశంతో ఆ సభలోకి దక్షప్రజాపతి ప్రవేశించాడు. దక్షప్రజాపతికి ఒక గొప్పతనం ఉంది. ఆయన సాక్శాత్తు బ్రహ్మగారి బొటనవ్రేలినుండి పుట్టాడు. సృష్టిలో బ్రహ్మగారి తరువాతి స్థానంలో ప్రజాపతులుంటారు. ఇప్పుడు దక్షప్రజాపతిని ఒక విషయం ఆవహించింది. అది నేను సభలోకి వెళ్ళినప్పుడు అందరూ లేచి నిలబడి నాకు నమస్కారం చేయాలి అని భావించాడు. ఆయన లోపలి వచ్చేసరికి ఆ సభలో ఉన్నవారిలో ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ లేచి నిలబడ్డారు. అలా లేచి నిలబడని వారిలో ఒకరు బ్రహ్మగారు, రెండవ వారు భర్గుడు. ఆయన అహంకారం తృప్తి పొందలేదు. శంకరుడు తన అల్లుడు. కాబట్టి లేవాలి అని అనుకున్నాడు. విపరీతమైన కోపం వచ్చింది. ఈ కోపమును కడుపులో పెట్టుకున్నాడు. అక్కడ సత్రయాగం జరుగుతోంది. తానొక ప్రజాపతినని, తానలా ప్రవర్తించకూడదనే విషయమును మర్చిపోయి శంకరుని దూషించడం ప్రారంభించాడు. ఈ మాటలను వింటూ శంకరుడు నవ్వుతూ కూర్చున్నాడు. దీనిని చూసి దక్షునికి ఇంక కోపం మింగుడు పడలేదు. నేను ఈ సభ నుంచి వెళ్ళిపోతున్నాను అని దక్షుడు అక్కడినుండి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు.
అక్కడ మధ్యలో అనవసరంగా లేచి అరిచిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు నందీశ్వరుడు, రెండవవాడు భ్రుగువు. భ్రుగువుకు కొంచెం అహంకారం ఎక్కువ. అందుకే శ్రీమహావిష్ణువు ఆయన అరికాలు కన్ను నొక్కేశారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకరు శివ సంబంధంగా, ఒకరు విష్ణుసంబంధంగా రెండు జట్లు కట్టారు. ఒకరిమీద ఒకరు బురదజల్లుకున్నారు. దీనిని చూస్తూ నవ్వుతూ కూర్చున్న వారు బ్రహ్మ, శంకరుడు. పిల్లవాడి అజ్ఞానమును తండ్రి మన్నించినట్లు వాళ్ళు వీరి అజ్ఞానమును మన్నించి నవ్వుతూ ఊరుకున్నారు. ఇప్పుడు దక్షుడు శంకరుడిని అవమానించాలి అనుకుని అందుకుగాను నిరీశ్వరయాగం చేయాలని సంకల్పించుకున్నాడు. ఆ యాగమునకు అందరినీ పిలిచాడు. అందరూ ఆ యాగమునకు బయలుదేరి వెళుతున్నారు. వాళ్ళందరినీ పలకరించి మర్యాదలు చేస్తున్నాడు దక్షుడు.
కైలాసపర్వతం మీద అంతఃపురంలో సతీదేవి నిలబడి ఉంది. పైనుండి విమానములు వెళ్ళిపోతున్నాయి. ఏదో పెద్ద ఉత్సవమునకు వెళ్తున్నారని తెలిసిపోతోంది. ఆవిడని వదిలిపెట్టి మిగిలిన వారందరికీ దక్షుడు ఆహ్వానములు పంపాడు. ఇది అమ్మవారికి ఖేదకారణం అయింది. ఆవిడ ఆవేదనను నారదుడు గమనించి సతీదేవి వద్దకు వచ్చి ‘తల్లీ, నీకు తెలియని విషయం కాదు. కానీ చెప్పకపోతే నాది దోషం అవుతుంది. నీ జనకుడయిన దక్షప్రజాపతి ఈవేళ ఒక యాగం చేస్తున్నాడు. ఆయన మదము చేత అంధుడై ఎవరికి గౌరవం ఇవ్వాలో తెలుసుకోలేని బ్రతుకు బ్రతుకుతున్నాడు. దక్షుడు చాలా పెద్ద తప్పు చేశాడు’ అని చెప్పాడు.
నారదుని మాటలు విన్న సతీదేవి ఏమీ మాట్లాడలేదు. నేనేమి చేయాలి? అని ఆలోచించింది. శంభునియందు ఏ దోషమూ లేదు. అందువలన తన తండ్రి చేసిన దుష్కృత్యమును తాను పరిష్కరించాలని భావించింది. అమ్మవారు బయలుదేరి శంకరుడి దగ్గరకు వెళ్ళి ‘మహానుభావా, శంకరా, దక్షుడు మర్యాదాతిక్రమణం చేశాడు. మీరులేని యాగం చేస్తున్నాడు. నాథా, ఈ లోకమునకంతటికీ బుద్ధి చెప్పాలి. దక్షుడికి బుద్ధి చెప్పవలసిన వాళ్ళు ఆయనకు బుద్ధి చెప్పడం మానేసి ఆయన చేస్తున్న యాగమునకు వెళ్ళారు. వాళ్ళకి శిక్ష వేయడానికి శక్తి రూపంగా నేను వెడుతున్నాను అని అనుకుని ‘నా నాథుడవయిన నిన్ను పిలవలేదు. కాబట్టి ఆ యాగం జరగడానికి వీలు లేదు. నాకు కూడా మీతో కలిసి వెళ్లాలని ఉన్నది దయచేసి నా కోర్కె తీర్చవలసింది. ఆ యాగమునకు నా చెల్లెళ్ళు అందరూ వారి భర్తలతో కలిసి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మనము ఆ యాగమునకు వెడితే ఒకసారి అందరినీ చూసినట్లు ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా రారా’ అని అడిగింది. మనలను పిలవలేదు దేవీ, అల్లుడిని పిలవాలిగా మరి నన్ను ఆహ్వానించ లేదుగా పిలవని చోటికి నేను వెళ్ళవచ్చునా అది దోషం అవుతుంది కదా అని అంటారేమో తండ్రిగారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు అన్నది.
అపుడు శంకరుడు ఒక చిరునవ్వు నవ్వి ‘దేవీ, పిలవకపోయినా వెళ్ళవచ్చుననునది పరమధర్మము. హఠాత్తుగా శుభకార్యం జరుగుతూ పిలవలేకపోతే వెళ్ళవచ్చు. కానీ మీ నాన్న కావాలనే మనలను పిలవలేదు. నీ ఆప్యాయతను వాళ్ళు పట్టించుకోరు. సజ్జనుడు అయినవాడు ప్రేమతో సజ్జనుడిగా ప్రవర్తించినా దుర్జనుడయినవాడు ఆ ప్రేమను చూడలేడు. వాడి కడుపు మంటతోనే ఉంటుంది. వాడు అవమానించదానికే ప్రయత్నిస్తాడు. కాబట్టి నీకొక విషయం చెప్తాను బాగా విను. బ్రహ్మగారు సత్రయాగం చేసినప్పుడు జరిగిన విషయం చెప్పాడు. అది ఇవాళ ఈ స్థితికి వెళ్ళింది. ఇపుడు నీతండ్రి కక్షమీద ఉన్నాడు. నీ మనస్సు ఖేదపడేటట్లు మాట్లాడతాడు. కాబట్టి నిన్ను వెళ్ళవద్దనే చెప్తాను. అన్నాడు.
అపుడు ఆవిడ నేను వెళ్ళాలనుకుంటున్నాను అన్నది. శంకరుడు తప్పకుండా వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు ఆ తల్లి భర్త మాట కాదని వెళ్ళవలసి వస్తోంది అని కన్నుల నీరు కారుస్తూ గబగబా అక్కడినుండి బయలుదేరింది. ఈమె అలా వెళ్ళిపోతుంటే ప్రమథగణములు చూడలేకపోయాయి. నందీశ్వరుని తీసుకువెళ్ళి ముందు పెట్టి కొన్ని కోట్ల ప్రమథగణములు ప్రక్కన నిలబడి ఘంటారావములు చేస్తూ వేణు నాదములు చేస్తూ జయహో జయహో అంటూ అందరూ కలిసి మంగళప్రదంగా దక్షయజ్ఞమునకు బయలుదేరారు. విమానం దిగి అమ్మవారు యజ్ఞశాలలోకి ప్రవేశించింది. అక్కడికి వచ్చిన సతీదేవిని తల్లి, సోదరులు తప్ప మిగిలిన వారెవ్వరూ పలకరించలేదు. ముఖములు ప్రక్కకి తిప్పుకున్నారు. సతీదేవి చాలా అవమానమును పొందింది. సభలో అంతమంది పెద్దలు ఉన్నారు. ఆవిడ లేకుండా అసలు యజ్ఞం లేదు. అటువంటి తల్లి ఈవేళ యజ్ఞమునకు బయలుదేరి వస్తే ఆమెను పలకరించే వాడు కరువయిపోయాడు. దానితో ఆవిడ కన్నులవెంట భాష్పదారాలు కారాయి. చాలా అవమానం పొందినదై తండ్రివంక చూసింది. తండ్రి ఈమెను జుగుప్సతో చూడరాని వ్యక్తిని చూసినట్లు అసలు పిలవని దానివి ఈ సభలోనికి ఎందుకు వచ్చావు అన్నట్లు చూశాడు. తల్లి ఆగ్రహం చెందింది. వెంటనే ఒకమాట అంది ‘ఏమయ్యా, పరమశివుడు నీకు పెద్దల్లుడు, లోకమంతటికీ పూజనీయుడు. మహానుభావుడు. మహాత్యాగి. ఒకరికి ఉపకారం చేయడమే తప్ప ఒకరి దగ్గర ఏదీ పుచ్చుకోవాలనే కోరిక లేనివాడు. జగత్తుకు తండ్రి. అటువంటి వాడి పట్ల నీవు నిరాదరణతో ప్రవర్తించి ఆయనను ఆహ్వానించకుండా నిరీశ్వర యాగమని, శివునికి హవిస్సు ఇవ్వనని, ఇవ్వకపోతే ఏమి చేయగలడని వెలి వేస్తున్నట్లుగా ప్రవర్తించావు. నీ పాపం ఊరికే పోతుంది అనుకుంటున్నావా? ‘శివ’ అన్న నామమును పైకి పలికినా మనసులో అనుకున్నా సమస్త జీవుల పాపములు పోతాయి. ఆయన పేరే అంత గొప్పది. అటువంటి ఆయనను నువ్వు ద్వేషిస్తున్నావు. ఎవడు శివుని ద్వేషిస్తున్నాడో వాడు మంగళమును ద్వేషించినట్లు. కాబట్టి నీకు అమంగళములు కలుగుతాయి తప్ప మంగళములు కలుగవు. నీకు పతనము తప్ప వేరొకటి లేదు. ఎటువంటి కోరిక ఉన్న వాడయినా ఆ పరమశివుని పాదములకు నమస్కరించినంత మాత్రం చేత అతని కోరికలు తీరతాయి. ఎవరు వస్తే కోరికలు తీరతాయో వాడిని రావద్దన్నావు. అది నిరీశ్వర యాగమే కావచ్చు. కాబత్ట్ ఆ కోరిక కూడా నీకు తీరడానికి వీలులేదు. నీవు మరింత పాపము చేసిన వాడవు అయ్యావు. త్రిమూర్తులలో ఒకరైన పరమశివుని విస్మరించావు. పరమ పవిత్రమయిన శంకరుని పట్టుకుని అనరాని మాటలు అన్నావు. దీనికి శాస్త్రం ఒక్కటే చేయమని చెప్తోంది.
ఎవడు పరమశివుని నిరాధారంగా, నిష్కారణంగా, పక్షపాత బుద్ధితో దూషిస్తున్నాడో వాడి నాలుక కోసేయాలి. అలా కోయలేక పోతే వాడు వెంటనే కర్ణ రంధ్రములను మూసుకుని అక్కడినుండి దూరంగా వెళ్ళిపోవాలి. ఆ పాపమును పంచుకోకూడదు. జగత్తుకి తండ్రి అయిన శంకరుడిని నీవు నిందచేశావు. అటువంటి నింద చేసినవాడి కూతురన్న పేరు నాకీ శరీరం ఉన్నంతకాలం ఉంటింది. నేను ఎక్కడ కనపడినా నన్ను దాక్షాయణీ అంటారు. నీ సంబంధం గుర్తు వచ్చేటట్లుగా నన్ను దాక్షాయణీ అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ బాధను అనుభవించాలి. పరమ ద్రోహివి, పాపివి, శంకర ద్వేశివి, శివనింద చేసిన వాడివి అయిన నీ కడుపున పుట్టిన ఈ శరీరంతో ఉండడాన్ని నేనిక అంగీకరించను. కాబట్టి ఈ శరీరమును అగ్నిహోత్రములో వదిలిపెట్టేస్తాను’. అన్నిటికన్నా నా బాధ ఏమిటో తెలుసా? నా భర్త పరమజ్ఞాని. మహోదారుడు. ఇప్పుడు నీవు ఇంత అవమానం చేస్తే నేను వెనక్కి వెళ్ళిపోతే నా భర్త నన్ను ఏమీ అనడు. నా కంట కన్నీరు కారుతుందేమోనని నన్ను ఏమీ అడగడు. నన్ను ఓదార్చడానికి తన తొడమీద కూర్చోబెట్టుకుంటాడు. అలా కూర్చో బెట్టుకున్నప్పుడు పరిహాసం ఆడవలసి వచ్చి నన్ను పేరు పెట్టి పిలవవలసి వస్తుంది. ఆ సమయంలో ఆయన నన్ను దాక్షాయణీ అని దగ్గరకు తీసుకుంటే నీ పాపం నాకు అప్పుడు గుర్తుకు వస్తుంది. దక్షుడి కూతురు అనే శరీరంతో ఉండడం నాకిష్టం లేదు. ఆ ఒక్క కారణమునకు నేను చచ్చిపోతాను’ అన్నది.
యాగంలో ఉన్న వాళ్ళందరూ ఈ మాటలు విని అలా నిలబడిపోయారు. ఆవిడ వెంటనే అక్కడ పద్మాసనం వేసుకుని ప్రాణాపానవ్యానఉదానసమానమనే వాయువులను ఒకదానితో ఒకటి కలుపుతూ మూలాధారం దగ్గర నుంచి వాయువులను పైకి లేపి, భ్రూమధ్యం దగ్గరకు తీసుకు వచ్చి సహస్రారానికి తీసుకువెళ్ళే ముందు శరీరంలో యోగాగ్నిని పుట్టించి, భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రం మీద శంకరుని పాదపద్మములను ధ్యానిస్తూ ఆ పాదపద్మములనే చూస్తూ, అందరూ చూస్తుండగా ఒక్క క్షణంలో అగ్నిగోత్రంలో భస్మం అయిపోయింది.


పార్వతీ కళ్యాణము – పార్ట్ 2




సతీదేవి అలా పడిపోవడంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ గబగబా లేచారు. “వీడు తండ్రి కాదు. వీడు అనుభవించి తీరుతాడు. ఉపద్రవం వస్తుంది. వీడు జగత్తునందు పరమ అపఖ్యాతిని పొందుతాడు. ఏ ప్రజాపతికి లేని అపకీర్తిని దక్షుడు పొంది తీరుతాడు. అమ్మవారిని కూతురిగా పొంది పరమశివుడిని అల్లుడిగా పొందినా, దక్షుడి పేరు గుర్తు వచ్చేసరికి దక్షయజ్ఞవిధ్వంసం జ్ఞాపకమునాకు వచ్చేటట్లుగా యజ్ఞం విధ్వంసం అయి తీరుతుంది” అనుకున్నారు. ఎప్పుడయితే అమ్మవారు యోగాగ్నియందు భస్మం అయిపోయిందో అక్కడ ఉన్న రుద్రగణములన్నీ ఒక్కసారి లేచాయి. లేచి వాళ్ళు దక్షుడి మీదికి వెళ్ళబోయారు. అక్కడ భ్రుగువు ఉన్నాడు. ఆయనది అర్థం లేని ఆవేశం. ఆనాడు దక్షుడు శంకరుడిని తిడుతుంటే భ్రుగువు కళ్ళు మిటకరించి ఇంకా తిట్టమని కనుబొమలు ఎగరేశాడు. ఇపుడు సతీదేవి యోగాగ్నిలో శరీరమును వదిలేసింది. భ్రుగువు చాలా సంతోషపడిపోయాడు. ఈ రుద్రగణములు కూడా ఓడిపోవాలని వెంటనే అక్కడ గల హోమవేది దగ్గరకు వెళ్ళి ఆ యజ్ఞగుండంలో అభిచారహోమం చేసి, దానిలోనుండి కొన్ని వేలమంది వీరులను సృష్టించాడు. వాళ్ళందరూ వెళ్ళి రుద్రగణములను తరిమి కొట్టేశారు. అది చూసి దక్షుడు చాలా సంతోషపడ్డాడు. సంతోషంతో దక్షుడు తన నిరీశ్వర యాగమును చేయడము కొనసాగించాడు.
ఈ విషయం నారదుడు వెళ్ళి శంకరునికి చెప్పాడు. ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారిగా తన ఆసనం మీద నుంచిలేచాడు. ఇపుడు అమ్మవారు శివుడిని రుద్రుడిగా మార్చింది. గర్జన చేసి పెద్ద నవ్వు ఒకటి నవ్వాడు. మెరిసిపోతున్న తన జటాజూటంలోంచి ఒక జటను పీకి, ఆ పుట్టిన కోపమును అణచుకోలేక నేలకేసి కొట్టాడు. ఆ జట సరిగ్గా నేలకు తగిలేసరికి అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించడం మొదలయింది. నల్లటి శరీరంతో ఒక పెద్ద పురుషుడు పుట్టాడు. పక్కన పెద్దపెద్ద కోరలు మెరుస్తున్నాయి. ఆయనకు వేయి చేతులు ఆవిర్భవించాయి. వేయి చేతులతో వేయి ఆయుధములు పట్టుకున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు. అంత ఊగిపోతూ వేయి ఆయుధములతో ప్రహారం చేస్తూ కనపడ్డవారిని కనపడ్డట్లు సంహరించడానికి వేరొక ప్రళయకాలరుద్రుడిలా అక్కడ సాక్షాత్కరించాడు. తండ్రి అయిన శంకరుని చూడగానే వేయి చేతులతో ఒక్కసారి నమస్కారం చేసి, మోకాళ్ళ మీద కూర్చుని తలను శంకరుని తాటించి తల ఎత్తి పాదములకు ఘోరరూపంలో ఉన్న శంకరుని వంక చూసి ‘నన్ను ఎందుకు పుట్టించారు? ఏమి ఆజ్ఞ? నేను ఏమి చెయ్యాలి? నన్ను వెంటనే ఆదేశించండి’ అన్నాడు. శంకరుడు ‘దక్షుడు నీ జనని అయిన సతీదేవి పట్ల అపచారంతో ప్రవర్తించాడు. నిరీశ్వర యాగం చేస్తున్నాడు. నీవు వెంటనే బయలుదేరి వెళ్ళి యజ్ఞ ధ్వంసం చెయ్యి’ అన్నాడు. వీరభద్రుడు శంకరునికి ఒకమారు ప్రదక్షిణ చేసి బయలుదేరాడు. ఆయనను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన వెనక ప్రమథగణములు అన్నీ బయలుదేరాయి. ఆయన శరీరం చేత పెద్ద చీకట్లు పుట్టాయి. ఎక్కడ చూసినా ధూళి పైకి రేగుతోంది. దక్షయజ్ఞంలో కూర్చున్న వాళ్ళు ‘ఏమిటి ఇంత ధూమం పుడుతోంది. ఒకవేళ మనం చేసిన దారుణమయిన పనిచేత మహానుభావుడయిన శంకరుడు కోపమును పొందినవాడై ఈ దక్షయజ్ఞ ధ్వంసమునకు పూనుకోలేదు కదా అని భయపడుతున్నారు. ఈలోగా వీరభద్రుడు రానే వచ్చాడు.
వీరభద్రుని చూడగానే దేవలోకాధిపతినని తనను పట్టుకుంటాడేమోనని ఇంద్రుడు లేచి పరుగెత్తడం ప్రారంభించాడు. ఆ వెనక చంద్రుడు పరుగెత్తుతున్నాడు. అప్పటివరకు యాగాగ్నియందు ఉన్న అగ్నిహోత్రములు పురుషరూపం దాల్చి పారిపోతున్నాయి. మీరు ఎక్కడికి పారిపోయినా మిమ్మల్ని పడగొట్టి గుద్దేస్తాను అని తన వేయి చేతులతో పట్టుకుందుకు వారి వెంటపడ్డాడు. ఆ యజ్ఞ శాలలో మొట్టమొదట రుద్రగణములు సంహరింపబడ్డాయి కాబట్టి ముందుగా వీరభద్రుడు నువ్వెవరు వాళ్ళ ఉసురు తీయడానికి శంకరుని ఎడమ కాలి దెబ్బకు లేచిపోయిన వాడివి నువ్వు అని ముందుగా యమధర్మరాజును పట్టుకుని ఆయన రెండు చేతులను వెనక్కి విరిచి తిప్పి ఒక్క తోపు తోసి తన కుడికాలి పాదంతో యమధర్మరాజు గుండెలమీద నొక్కిపెట్టి పిడిగుద్దులతో డొక్కలలో కొడుతుంటే యమధర్మరాజు ప్రక్కటెముకలు విరిగిపోయాయి. మిగిలిన దేవతలు ఇది చూసి పారిపోతున్నారు. ఈలోగా ప్రక్కకి చూసేసరికి సరస్వతీ దేవి ఎంతో సంతోషంగా కళ్ళు మూసుకుని వీణ వాయిస్తోంది. అన్నగారికి అవమానం జరుగుతూ యాగం జరుగుతుంటే నీవు ఇక్కడకు వచ్చి కూర్చుని వీణవాయిస్తున్నావు. నీకు యాగం కావలసి వచ్చిందా అని చిటికిన వేలు పెట్టి ముక్కు గిల్లెశాడు. ముక్కు ఊడిపోయి క్రింద పడిపోయింది. ఆమె వికృతరూపం చూసి అక్కడ ఉన్న అందరు కాంతలు లేచి పరుగులు మొదలుపెట్టారు. వీరభద్రుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళి ఆయనను పట్టుకుని నువ్వేనా ఆరోజున బ్రహ్మసభలో శంకరుని దక్షుడు నింద చేస్తుంటే ఎగతాళి చేశావు. అని ఆయన గడ్డమును తన చేతికి ముడి వేసుకుని ఒక్క లాగు లాగాడు. అపుడు భ్రుగుని గడ్డం మొత్తం ఊడిపోయి నెత్తురు వరదలయిపోయింది. మీసములను లాగేశాడు. బొటనవేలితో భ్రుగుని రెండు కనుగుడ్లు ఊడబెరికేశాడు. శంకరనింద చేస్తే ఎలాంటి గతి పడుతుందో గుర్తు పెట్టుకో అని యాగాగ్నిహోత్రం దగ్గర కూల దోసేశాడు. అక్కడితో ఆగలేదు. భ్రుగువు రెండు దవడలు నొక్కి పైవరుస దంతములు పట్టుకుని కుదిపేసి క్రింది వరుస దంతములు కుదిపేసి రెండు చేతులతో రెండు దవడలు పట్టుకుని లాగాడు. నోరు చిరిగిపోయింది.
తరువాత పూషుడి దగ్గరకు వెళ్ళాడు. పూషా అనబడే ఆ సూర్యరూపమును పడగొట్టి ఆయన పళ్ళను పట్టుకుని నలిపేశాడు. పైవరస పళ్ళు, క్రింది వరుస పళ్ళు ఊడిపోతే వాటిని గాలిలోకి విసిరేసి ఇవాళ నుంచి నీవు మాట్లాడితే నీకు పళ్ళు లేవు కాబట్టి భాషయందు తప్పులు వస్తాయి. భాషయందు తప్పులు రావడం నీతోనే మొదలవుతుంది అని చెప్పాడు. ఆనాటి నుంచి పళ్ళు లేక పూష సరిగా మాట్లాడలేకపోయాడు. ఆనాటి నుండే భాషలో తప్పు రావడం అన్నది ప్రారంభం అయింది.
వీరభద్రుడు వెనకనుంచి వెళ్ళి చంద్రుడిని పట్టుకుని క్రిందపడేసి తన రెండు కాళ్ళను పైకెత్తి చంద్రుడి కడుపు మీదకి ఒక గెంతు గెంతాడు. చంద్రుడికి ప్రక్కటెముకలన్నీ విరిగిపోయి, చంద్రుడి నోట్లోంచి అమృతధార పైకి లేచి, వీరభద్రుని పాదములను అభిషేకం చేసింది. అలా వీరభద్రుడు దేవతల వెంటబడి తన వేయి చేతులతో చావగొట్టాడు.
చివరికి దక్షుడి మీదకు వెళ్ళి ఆయన మెడను నరకడానికి ప్రయత్నించాడు. దక్షుని మెడ తెగలేదు. దక్షుని శరీరం అంతా మంత్రపూరితం అయిపోయి ఉంది. అందుకని కంఠం తెగలేదు. తెగకపోతే గుండెల మీద తన కుడికాలి పాదంతో తొక్కి తలకాయను రెండు చేతులతోటి గడ్డిని మోపు కట్టినపుడు తిప్పినట్లుగా తిప్పేసి అది బాగా మెలిపడిపోయి సన్నగా అయిపోయిన తర్వాత ఊడబెరికి అగ్నిహోత్రంలో పడేశాడు. పిమ్మట రుద్రగణములను పిలిచి ఈ హోమగుండంలోనే కదా దేవతలు హవిస్సులు పుచ్చుకున్నారు. ఈ గుండంలో మూత్రమును విసర్జించండి అన్నాడు. వారందరూ హోమ గుండంలో మూత్రవిసర్జన చేశారు. అందరినీ కొట్టి ఉగ్రమూర్తియై వీరభద్రుడు నాట్యం చేస్తుంటే ఆపగలిగిన మొనగాడెవడు? మిగిలిన వాలు కొద్దిమంది ఉంటే వీళ్ళందరూ పరుగుపరుగున బ్రహ్మ సదనమునకు వెళ్ళారు. వీరభద్రుడు తన చేతిలో పట్టిసమును తీసుకు వెళ్ళి గోదావరి నదిలో కడిగి శాంతమూర్తి అయ్యాడు. ఎక్కడ తన చేతిలో ఉన్న పట్టిసమును వీరభద్రుడు కదిగాడో అదే పట్టిసతీర్థం. దక్షయజ్ఞం జరిగిన చోటు దక్షారామం. పరమ పుణ్య క్షేత్రం.
దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మ గారి దగ్గరకు వెళ్ళి మహానుభావా, ఏమిటి దీనికి పరిష్కారం? అని అడిగారు. అపుడు ఆయన మీరు చేసిన పాపం సామాన్యమయిన పాపం కాదు. ఆయన శర్వుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు. ఎనిమిది రూపములతో ప్రకాశిస్తున్నవాడు పరమశివుడు. మీకొక మాట చెప్తున్నాను. శంకరుడు కరుణాపూరిత హృదయుడు. మనం బుద్ధి తెచ్చుకుని ఆయనకు నమస్కరించడానికి వెళితే ఆయన మిక్కిలి ప్రసన్నమూర్తిగా ఉంటాడు. రండి అని చెప్పి వీళ్ళందరినీ తీసుకుని కైలాసమునకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళేసరికి ప్రశాంత వదనంతో శంకరుడు పెద్ద వటవృక్షం క్రింద కూర్చుని తన ఎడమతొడ మీద కుడిపాదం పెట్టుకుని సనక సనందనాది మహర్షులందరూ తనచుట్టూ కూర్చుని ఉండగా, పరబ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానమును చక్కగా చిన్ముద్రపట్టి తనలోతాను రమిస్తున్నవాడై సన్నటి చిరునవ్వు నవ్వుతూ, పరమానంద స్వరూపంగా వాళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తున్నాడు.
ఎక్కడ చూసినా కైలాస పర్వతం మీద లతావితానములు. పొదరిళ్ళు, ఋషులు, ప్రమథగణములు, నందీశ్వరుడు, గంటల చప్పుడు, వచ్చే విమానములు, వెళ్ళే విమానములు. అందరూ శంకరుడికి పరమభక్తితో నమస్కారములు చేస్తున్నారు. పరమభక్తితో అందరూ పంచాక్షరీ మహా మంత్రమును జపం చేసుకుంటూ ఉన్నారు. ఆ కైలాసపర్వతం పరమరమ్యంగా శోభాయమానంగా ఉంది. బుద్ధి తెచ్చుకున్న దేవతలు శంకరుడి దగ్గరకు వెళ్ళి నిలబడి “స్వామీ మా బుద్ధి గడ్డి తినింది. ఈశ్వరా నీవు కాకపోతే మమ్మల్ని రక్షించే వారెవరు? కృపచేసి మమ్మల్ని కాపాడవలసింది’ అని ప్రార్థించారు. శంకరుడు వెంటనే చిరునవ్వు నవ్వి ఎవరెవరు దెబ్బలు తిని మరణించిన వారు ఉన్నారో వారందరూ పూర్వం ఎలా ఉన్నారో అంతే తేజస్సుతో సజీవులు అగుదురు గాక! ఆగిపోయిన యాగం యథారీతిగా సశాస్త్రీయంగా వేదం ఎలా చెప్పిందో అలా పూర్తిచేయబడుగాక! దక్షుడి తల అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి మూర్ఖత్వమునకు పిరికితనమునకు ప్రతీక కనుక మేక ముఖమును తీసుకు వచ్చి దక్షుడి శిరస్సుకు అతికింపబడుగాక! దక్షుడు సజీవుడు అగుగాక! అతడు బుద్ధి తెచ్చుకుని సంతోషంగా జీవితమును గడుపుగాక! మీరందరూ పరమ సంతోషముతో ఆనందముగా ఉందురుగాక! అని చెప్పాడు. ఎక్కడా తన భార్య గురించి మాట్లాడలేదు. ఇదీ శంకరుడంటే. ఇపుడు దక్షుడు మేక ముఖం పెట్టుకుని శంకరుడి దగ్గరకు వచ్చి సాష్టాంగ పది ఏడుస్తూ “తండ్రీ దేవా అభవ పురహర రుద్రా, నీవు నన్ను దండించావని అనుకోవడం లేదు. నువ్వు ఎలా ఈ మస్తిష్కమును తీసి ఉండకపోతే నేను ఇంకా ఎన్ని పాపములు చేసి ఉండేవాడినో? ఈ పాపమును ఇక్కడితో తీసి వేశావు. ఇకపై బుద్ధి తెచ్చుకుని బ్రతుకుతాను. అన్నాడు. శంకరుడు చక్కగా వెళ్ళి యజ్ఞమును పూర్తిచెయ్యి అని ఆదేశించాడు.
ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి ఆ యాగమును పూర్తిచేశారు. అప్పుడు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఇటువంటి తప్పు పనులు ఎన్నడూ చేయవద్దు అని చెప్పారు. యాగం పూర్తి చేయబడింది.
దక్షయజ్ఞం ధ్వంసం గూర్చి చదివినా, బుద్దిమంతులై శంకరుని కారుణ్యమును మనసులో అవధరించగలుగుతూ వినినా, అటువంటి వారికి జాతకములో ప్రమాదములు పొడచూపితే అవి తప్పి పోతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. కీర్తి కలుగుతుంది. వాళ్ళు చేసిన పాపములు నశిస్తాయి. శంకరుడు దక్షిణామూర్తిగా ఉన్న కైలాస దర్శనం చెప్పబడింది కాబట్టి వాళ్ళ భవబంధములు తొలగి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇది అంత పరమపావనమయిన ఆఖ్యానము.

పార్వతీ కళ్యాణము – పార్ట్ 3



దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరమును వదిలిపెట్టింది. ఇప్పుడు దేవతలకు జగదంబ శక్తి స్వరూపిణి కావాలి. అమ్మవారిని స్తోత్రం చేశారు. అమ్మా నీవు మరల ఆవిర్భవించాలి. మమ్మల్నందరినీ రక్షించాలి అని ప్రార్థించారు. అమ్మ సౌమ్య రూపంతో దర్శనమిచ్చి మీ అందరి కోరిక తీర్చడానికి నేను మళ్ళీ పార్వతి అనే పేరుతో మేనకాహిమవంతులకు కుమార్తెగా పుడతాను అంది. అయితే ఈ మేనకా జననము నందు ఒక పెద్ద రహస్యం ఉంది. దక్షప్రజాపతి కుమార్తెలలో ‘స్వధ’ అనబడే ఒక ఆమె ఉన్నది. ఆమెను దక్ష ప్రజాపతి పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు. వారికి ముగ్గురు కుమార్తెలు జన్మించారు. మొదటి ఆవిడ పేరు మేనక. రెండవ ఆవిడ పేరు ధన్య, మూడవ ఆవిడ పేరు కళావతి. ఈ ముగ్గురూ పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. అయోనిజల స్థాయిలో గౌరవింపబడినవారు. ఈ ముగ్గురూ ఒకనాడు వైకుంఠమునకు వెళ్ళారు. శ్రీమహావిష్ణువు కొలువుతీరి ఉండగా వీరు లోపలికి వెళితే వారిని ఉచితాసనములయందు కూర్చుండబెట్టారు. ఈలోగా సనక సనందనాది మహర్షులు లోపలికి వస్తున్నారు. శివుడి సంకల్పం వేరుగా ఉంది. అక్కడ శివమాయ ప్రసరించింది. సనక సనందనాదులు వస్తుండగా ఈ పిల్లలు లేవలేదు. సభలోకి బ్రహ్మజ్ఞానులయినవారు వెళ్తున్నప్పుడు లేచి నిలబడాలి. లేవలేదు కనుక వారికి శాపం ఇచ్చారు. మీరు ముగ్గురూ భూమండలమునందు జన్మించెదరు గాక! అని. అపుడు వారు లేచి మహర్షుల పాదముల మీద పది ‘మాకీ శాప విమోచనం ఎలా కలుగుతుందో ఆజ్ఞాపించవలసినది’అని వేడుకున్నారు. సనత్కుమారుడు శాపవిమోచనమును చెప్పారు. ‘విష్ణువు అంశతో హిమవంతుడు భూలోకంలో ఉంటాడు. మేనక విష్ణ్వంశ కలిగిన హిమవంతునకు భార్యగా వెడుతుంది. ధన్య మహాజ్ఞాని అయిన జనకమహారాజుగారి భార్య అవుతుంది. కళావతి భూలోకమునందు వృషభానుడు అనే ఒక వైశ్యుడికి భార్య అవుతుంది. మేనకా హిమవంతులకు పార్వతీదేవి జన్మిస్తుంది. ధన్య జనకులకు సీతమ్మతల్లి జన్మిస్తుంది. కళావతీ వృషభానులకు రాధాదేవి జన్మిస్తుంది. ఈ కారణం చేత మేనకా హిమవంతులు చాలా గొప్ప స్థితిని పొందుతారు. ధన్య సీతమ్మ తల్లికి తల్లియైన కారణం చేత విష్ణు లోకమును పొందుతుంది. కళావతి రాధకు తల్లియైన కారణం చేత గోలోకమును పొందుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ వరములను ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ మేనకి హిమవంతునకు భార్య అయింది.
మేనక ప్రతినెలా అష్టమినాడు అమ్మవారికి విశేష పూజ చేస్తుండేది. అలా కొన్ని సంవత్సరములు చేయగా ఒకనాడు జగదంబ ఆవిడకు ప్రత్యక్షం అయింది. ఏ వరముకోరుకుని నువ్వు నా గురించి ఇంత గొప్ప పూజ చేస్తున్నావు? అని అడిగింది. ఇదే సమయంలో అక్కడ తారకాసురుడు విజ్రుంభించి ఉన్నాడు. తారకాసురుడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరగాలి. ఇక్కడ పార్వతీ దేవిగా ఆవిడ పుట్టాలి. అపుడు మేనక ‘నాకు నూర్గురు కుమారులు కావాలు. నూర్గురూ గుణవంతులు కావాలి. వారి తర్వాత ఒక కుమార్తె కావాలి. ఆమె త్రైలోక్య పూజిత కావాలి. ఆ తల్లి ఏ వంశంలో పుట్టిందో ఆ వంశమును, ఏ వంశంలో మెట్టిందో ఆ వంశమును ఉద్ధరించేలా ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే నీవే నాకు కూతురుగా రావాలి అంది. ఈ మాటలకు అమ్మవారు చాలా సంతోషపడిపోయి నీ భక్తికి మెచ్చుకున్నాను. నీవు కోరిన విధంగా నీకు కూతురుగా పుడతాను. పర్వతరాజ పుత్రిని కనుక పుట్టుకతోనే పార్వతి అని పిలుస్తారు. కొంచెం నల్లగా పుడతాను కనుక కాళి అని పిలుస్తారు. నారాయణుని చెల్లులుగా ఉంటాను కాబట్టి నారాయణి అని అంటారు. ఈ జన్మలో కన్యాదానం చేసే అదృష్టమును మీరు పొందుతారు. సశాస్త్రీయమయిన వివాహం జరుగుతుంది. కాముడిని కాల్చగలిగిన శంకరుడిని పిల్లనిమ్మని మీ ఇంటికి రాయబారమునకు వచ్చేటట్లు చేస్తాను. మీరు పిల్లనిస్తున్నారని ఆడ పెళ్ళి వారింటికి మగపెళ్ళివారు వచ్చేటట్లు చేస్తాను. కన్యాదాత ఇంటికే శంకరుడు కదిలి వచ్చేటట్లు చేస్తాను. శంకరుడే కదిలివస్తే ఎంతమంది వస్తారో చూద్దురు గాని! భూమి ఆ బరువును మోయలేక పక్కకి ఒరిగిపోతుంది. కనీవినీ ఎరుగని చరిత్రాత్మకమయిన కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో మీరిద్దరూ కన్యాదానం చేస్తారు. అటువంటి స్థితిని మీకు ఇస్తున్నాను. అంతటి రంగరంగవైభోగంగా కళ్యాణం జరుగుతుంది అని చెప్పింది.
అలా ఆరోజు తల్లి పార్వతీదేవిగా జననమొందింది. అక్కడ హిమవంతుని కుమార్తెగా పెరిగి పెద్దదవుతోంది. హిమవంతునికి కుమార్తెగా పుట్టింది కాబట్టి హైమవతి అని, పర్వతరాజ పుత్రి కాబట్టి పార్వతి అని పిలువబడింది. చిన్నపిల్లగా పుట్టినా ఆవిడ ఎవరో హిమవంతుడికి తెలుసు. ఆయన కూతురిలో అమ్మవారినే దర్శనం చేశాడు. ఆ తల్లి క్రమక్రమంగా మేనకా హిమవంతుల వాత్సల్యమునకు నోచుకుని పెద్దదవుతూ యౌవనంలోకి ప్రవేశించి శుక్లపక్షంలో చంద్రుడు ఎలా ఒక్కొక్క కళ పెరుగుతూ పూర్ణ చంద్రుడు అవుతాడో అలా అమ్మవారు పూర్ణ చంద్రబింబము వంటి ముఖంతో పెరిగి పెద్దదై చక్కగా యౌవనంలోకి ప్రవేశించింది. యౌవనంలోకి ప్రవేశించినప్పటి నుంచి అమ్మవారి కోర్కె ఒక్కటే. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అనే అయిదు ముఖములు కలిగిన పరమశివుడిని భర్తగా పొంది ఎప్పుడు మరల ఆయన వామార్ధ భాగమును చేరుకుంటానో అని ఆ తల్లి ప్రతినిత్యము తలుచుకుంటూ ఉండేది.
అక్కడ శంకరుడు ఒక ఆశ్చర్యకరమయిన స్థితిని పొంది ఉన్నాడు. దక్షిణామూర్తియై లోకమునకంతటికీ జ్ఞానమును కటాక్షిస్తున్నాడు. ఒకనాడు కైలాస పర్వతం మీద శంకరుడు కూర్చుని ఉండగా ఆయన లలాటభాగమునుండి ఒక చెమట బిందువు ఆయన ముందుకు వంగినపుడు క్రిందపడింది. అది కైలాసపర్వత శిఖరము నుండి కింద పడుతూ వచ్చి భూమిమీద పడింది. అది శంకరుడి స్వేద బిందువు. వట్టినే పోవడానికి వీలులేదు. అందుకని భూదేవి అలా క్రిందపడిన బిందువును తాను స్వీకరించింది. అలా స్వీకరించగానే ఆ భూమిలోంచి ఒక పిల్లవాడు పుట్టి ఏడ్చాడు. అపుడు శంకరుడు కైలాసం మీదనుండి చూసి ఈ పిల్లవాడు నానుండి చెమట బిందువు నీ మీద పడినప్పుడు పుట్టినవాడు గనుక వీడికి ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికములనేటటువంటి మూడు తాపములు ఉండవు. ఈ పిల్లవాడిని నీవు స్వీకరించు. ఈ పిల్లవాడిని భూమి కుమారుడు అని లోకం పిలుస్తుంది. వేడిని పెంచి పెద్ద చెయ్యి. అన్నాడు. ఆవిడ ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది. ఆ పిల్లవాడు వారణాసి క్షేత్రమునకు వెళ్ళి శంకరుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై అతనికి ఒక ఆశ్చర్యకరమైన వరం ఇచ్చాడు. నువ్వు శుక్ర గ్రహమునకు మీద కుజుడు అనబడే గ్రహంగా సంచరిస్తూ ఉంటావు. నవగ్రహములలో నీవు ఒక గ్రహం అవుతావు అని. అప్పుడు వచ్చిన గ్రహమే కుజగ్రహం. తరువాత శంకరుడు కొంతకాలం తపస్సు చేస్తాను అన్నాడు. అందుకు హిమాయల పర్వతములకు వెళ్ళి కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు.
ఒకనాడు హిమవంతుడు పార్వతితో ‘మహానుభావుడు శంకరుడు హిమాలయ పర్వత ప్రాంగణంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకు శుశ్రూష చేయడం వలన శుభం కలుగుతుంది. కాబట్టి రా తల్లీ నిన్ను తీసుకువెడతాను’ అని చెప్పి నక్షత్ర వీధిని దాటి శంకరుడు తపస్సు చేస్తున్న ప్రదేశమునకు తీసుకు వెళ్ళాడు. ఆ ప్రదేశం ఎంతో అందంగా రమ్యంగా ఉంది. అక్కడ శంకరుడు బ్రహ్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు. తలమీద చంద్రవంక ప్రకాశిస్తుండగా అంతర్ముఖుడై యోగవిద్యలో తనలోతాను రమిస్తున్నవాడై బాహ్యమునకు ఏవిధమైన స్పర్శ లేకుండా దేనినీ చూడకుండా ధ్యానమునందు ఉన్నాడు. పార్వతీ దేవి వచ్చింది. కానీ ఆమె వచ్చినట్లు శంకరునకు తెలియదు. ఇద్దరూ దూరంగా నిలబడి చేతులు కట్టుకుని ఆయన బహిర్ముఖుడు అయ్యే వరకు ఎదురు చూస్తున్నారు. కొంతసేపటికి శంకరుడు నెమ్మదిగా సమాధి స్థితి నుండి బయటకు వచ్చారు. హిమవంతుడు గబగబా పార్వతీ దేవిని దగ్గరకు తీసుకు వెళ్ళి అత్యంత గౌరవంగా శంకరునికి నమస్కారం చేశాడు. పరమేశ్వరుడు పార్వతీ దేవి వంక పవిత్రంగా చూశాడు.
పార్వతీదేవి మన్మథుని బాణమునకు స్త్రీరూపం దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. సాక్షాత్తు మన్మథుడే స్త్రీ రూపం పొంది వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. దేవతా స్త్రీ ఎవరయినా వచ్చిందా అన్నట్లు ఉంది. బంగారు తీగ ప్రాణం పోసుకున్నదా అన్నట్లుంది. అసలు ఈ లోకంలో ఎవడయినా పురుషుడన్నవాడు ఆవిదవంక చూసిన తర్వాత ఇంక మోహమును పొందకుండా ఉండడం అసంభవం. హిమవంతుడిని పార్వతిని చూసి శంకరుడు ఒకందుకు వెరగుపడ్డాడు. ఇంత చక్కటి కుమార్తెను కన్నందుకు పర్వతరాజు ధన్యుడు అయ్యాడని శంకరుడు భావించాడు.
పార్వతి ఒక్కమాట మాట్లాడలేదు. శంకరునికి నమస్కారం చేస్తూ తండ్రి వెనకాల నిలబడింది. ఆ తల్లి యౌవనంలోకి వచ్చినప్పటి నుంచి శివుడి భార్య కావాలని అనుకుంటున్నది. ఆవిడ శంకరుని చూసి కన్నులు తిప్పుకోలేక పోయింది. అందుకే శంకరుడి అందమును ‘కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం’ అని పొగిడింది శివపురాణం. కోటి సూర్యులు ఉదయించినట్లు అంత అందంగా ఉంటాడు. ఆవిడ ఆయన కుడి చేతికి ఉన్న పామును చూస్తూ ఉండిపోయింది. ఈ చెయ్యి తొందరలో నా చెయ్యి పట్టుకోవాలి. ఈ చెయ్యి తొందరలో నా మెడలో తాళి కట్టాలి. ఈ చెయ్యి లోకరక్షణ హేతువు. అని ఆలోచిస్తూ ఎంత తొందరగా శంకరుడిలో కలిసిపోతానా అని ఆలా చూస్తూ నిలబడిపోయింది. హిమవంతుడు కూతురుకేసి చూసి ‘అమ్మా శంకరునికి నమస్కరించు; అని ఆమె దృష్టిని మరల్చాడు. పార్వతి శంకరుడికి భార్య కావలసిన పిల్ల అని హిమవంతుడికి తెలుసు. తండ్రితనం అంటే అదే. కూతురికి మర్యాద నేర్పినవాడు తండ్రి. కూతురుని రెచ్చగొట్టినవాడు, కూతురికి నడువడిని నేర్పనివాడు తండ్రికాడు. ఇపుడు హిమవంతుడు శంకరుడికి నమస్కరించి స్తోత్రం చేశాడు. “అయ్యా, నేను ఒక కోరికతో వచ్చాను. ఈమె నా కుమార్తె. మీవంటి మహా పురుషుని సేవ చేయడం కోసం తీసుకువచ్చాను. తపస్సు చేసేవాడికి ఆడపిల్ల ప్రతిబంధకం. ఆడపిల్ల అందులోనూ యౌవనంలో ఉన్నది నాకేమి సేవ చేస్తుంది నాకెందుకు ఆమె సేవ అంటారేమో మా పిల్ల నువ్వు తపస్సు చేసుకోవడానికి పుష్పార్చన చేస్తుంది. నీ కొప్పులో పూలు పెట్టాక కానీ మా పిల్ల తన కొప్పులో పూలు పెట్టుకోదు. ఏనుగు నడిచినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అంత అందమయిన నడకలు ఉన్న నా కూతురు గంధం నీ ఒంటికి రాసిన తర్వాత కానీ తన ఒంటికి రాసుకోదు. కాబట్టి నీకు గంధార్చన చేస్తుంది. అన్యాపదేశంగా తన కూతురు శంకరుడి సొత్తు అని చెప్తున్నాడు. రోజూ నీకు హస్తార్చన క్రింద నీ చేతికి కంకణములు వేసి తను కంకణములు వేసుకుంటుంది. నా కుమార్తె ముందుగా తను పట్టుపుట్టం కట్టుకోడు. తను నారచీరతో వచ్చి నీకు పట్టుపుట్టమును సమర్పించి పిమ్మట తను పట్టుపుట్టం కట్టుకుంటుంది. ఏదయినా అదేపనిగా మాట్లాడుతుందేమోనని అంటావేమో అసలు నా కూతురు నోరువిప్పి నీతో ఏమీ మాట్లాడదు. నిన్ను పూజ చేసి వెళ్ళిపోతుంది. నీవు పూజ చేసుకోవడానికి అన్నీ అమర్చేస్తుంది. నిన్ను ఇలా సేవించి వెళ్ళిపోతూ ఉంటుంది. నా పిల్ల నీకు ఇన్ని సేవలు చేసి ఆ తరువాత వరములు అడుగుతుందని అనుకుంటావేమో! అలా వరములు అడగడం కోసం నా కూతురు నీకు సేవ చేయడం లేదు. కేవలం నీకు సేవ చేయాలనే నా కూతురు కోరుకుంటోంది’ అన్నాడు. మాట మాట్లాడినప్పుడు తండ్రితనం పోకూడదు. కూతురు ఆయనను చేరిపోవాలన్న ఆర్తి పాడైపోకూడదు.
శంకరుడు ఒప్పుకోవదమా వద్దా అన్నట్లు చూస్తున్నాడు. అప్పుడు హిమవంతుడు వేడుకున్నాడు. పార్వతీదేవిని శంకరుని సేవకు వినియోగించి కూతురితో తల్లీ, ఆ మహానుభావుడిని జాగ్రత్తగా సేవించు. చీకటి పడేవేళకి ఇల్లు చేరు. నీకు శ్రేయస్సు కలుగుతుంది’ అని చెప్పి హిమవంతుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.

పార్వతీ కళ్యాణము – పార్ట్ 4



తల్లి పార్వతీ దేవికి శంకరుడి యందు ప్రేమ ఉన్నది. తొందరగా ఆయన ప్రక్కకు భార్యగా చేరాలనే తలంపు ఉన్నది. కాబట్టి ఆయన కన్నులు మూసుకుని ధ్యానమునందు ఉన్నప్పుడు తాను పని చేసుకుంటున్నట్లుగా ఉంటూ పలుమార్లు శంకరుని సౌందర్యమును వీక్షిస్తూ ఉండేది. పలుమార్లు శంకరుడికి దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడేది. కానీ ఆయన బహిర్ముఖుడైనప్పుడు ఆయన తేజస్సు, ఆయన నిష్ఠ, ఆయన తపశ్శక్తి చూసి అడగలేక ఉండిపోయేది. అలా ప్రతిరోజూ పరిచర్య చేస్తూ ఉండేది. ఇలా ఎంతకాలమో జరిగిపోయింది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయితే తప్ప తారకాసుర సంహారం జరగదు. అందుకని దేవతలందరూ బాగా ఆలోచించి ఒకరోజున బ్రహ్మదగ్గరకు వెళ్ళారు. వాళ్ళలో పెద్ద అయిన బృహస్పతి బ్రహ్మతో ఒక మాట చెప్పాడు ‘స్వామీ శంకరుడు పార్వతీ ఇద్దరూ ఒకరివైపు మరొకరు చూసుకోవడం లేదు. వాళ్ళిద్దరికీ వివాహమై ఒక కొడుకు పుడితే తప్ప తారకాసురుడు సంహరింపబడడు. సుబ్రహ్మణ్యుడు పుట్టాలి. ఆ రాక్షసుడయిన తారకాసురుని సంహరించాలంటే వారిద్దరికీ వివాహం అవ్వాలి. ఏమి చేద్దాము? అని అడిగాడు. అపుడు బ్రహ్మకూడా కించిత్ మాయకు వశుడయ్యాడు. బృహస్పతి దేవేంద్రుడికి కబురు చేద్దాం దేవేంద్రుని ఆజ్ఞకు ఎదురులేదు. మన్మథుని పిలిపిద్దాము. మన్మథుడు బాణం వేస్తె ఎంతటి వాడయినా వశుడవుతాడు. తరువాత సుబ్రహ్మణ్యుడు పుడతాడు. తారకాసుర సంహారం అయిపోతుంది అని చెప్పాడు. ఇప్పుడు మన్మథుని పిలిపించాలి.
ఇంద్రుడు ఒక్కసారి మన్మథుని స్మరించాడు. దేవేంద్రుడు మన్మథుని తలచుకునే సమయానికి మన్మథుడు రతీదేవితో కలిసి ఉన్నాడు. ఒక్కసారి దేవేంద్రుడు మనస్సులో స్మరించగానే ఇంద్రుడు తనను పిలుస్తున్నాడనే విషయం ఆయనకు అందింది. వెంటనే దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పగా రతీదేవి నేను కూడా వస్తాను అని చెప్పిడ్ని అపుడు మన్మథుడు సాక్షాత్తు రాచకార్యం మీద వెడుతున్నాను అక్కడికి నీవు నాతో వస్తాను అని అనకూడదు. నువ్వు రాకూడదు. నేను వెళ్ళి విషయం ఏమిటో కనుక్కుని వస్తాను. అని చెప్పి మన్మథుడు బయలుదేరి దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళాడు.
మన్మథుడు ఇంద్రుని దర్శనం చేసుకుని ఆయన ఇచ్చిన ఉచితాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రుడు మన్మథునితో విషయం చెప్పాడు. ఇంద్రుని మాటలు విన్న మన్మథుడు మొహం అదోలా పెట్టాడు. అపుడు ఇంద్రుడు నీతోపాటు వసంతుడిని పంపిస్తాను. తుమ్మెదలు వస్తాయి. శంకరుని సమీపంలో చాటుగా నిలబడి ఒక పూలబాణం తీసి వింటినారికి సంధించి ఎక్కుపెట్టి గురిచూసి ఒక బాణం కొట్టు. ఆ బాణం తగులుతుంది. వెంటనే ఆయన పార్వతీ దేవితో అనురాగంలో పడిపోతాడు. అపుడు నీవు సంతోషంగా తిరిగి వచ్చెయ్యి. బయలుదేరు అన్నాడు. అప్పుడు మన్మథుడు అయ్యా ఇంద్రా, నేను వచ్చి ఒకవేళ తెలియక శంకరుని మీద బాణం వేస్తానంటే మీరు ఖండించాలి. అలా అనడం మానేసి మోహాతీతుడయిన శంకరుని మీద నన్ను బాణములు వేయమంటున్నారేమిటి? శంకరుడు కానీ బహిర్ముఖుడు అయిపోతే ఆయన ప్రతాపాగ్ని ముందు నేను నిలబడలేను. ఒకవేళ నిలబడినా శంకరుడు పాశుపతాస్త్రం తీస్తాడు. నాదగ్గర పూల బాణములు ఉన్నాయి. ఆ పాశుపతాస్త్రం ముందు నా పూలబాణం నిలబడలేదు. ఒక వేళ అలా నిలబడినా శంకరుడికే మొహం కల్పించి ఇంటికి వస్తే శంకరుడిని నేను గెలిస్తే, శంకరుడి మీద బాణ ప్రయోగం చేసి ఇంటికి వస్తే మా నాన్నగారు నారాయణుడు అసలు నన్ను ఎలా చూస్తాడో అని నేను వణికిపోతున్నాను నువ్వు చెప్పింది ఎలా ఉన్నదంటే ఒక దూడను వెళ్లి సింహంతో యుద్ధం చేయమని పంపించినట్లు ఉంది. నేనెక్కడ శంకరుడెక్కడ! అన్నాడు.
చివరికి భయపడుతూ భయపడుతూ సగం చచ్చి శంకరుని మీద పుష్పబాణం ప్రయోగం చేయడానికి వెళ్ళాడు. ముందుగా తను బయలుదేరేముందు తన సంపద తన గర్వము తన మదము అన్నింటినీ కూడదీసుకున్నాడు. మీరు ముందే వెళ్లి పరమశివుడికి అనురాగం కలిగేటట్లుగా ఉండడం కోసమని చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఎక్కి కూర్చోండి. ఆయన తొందరగా బహిర్ముఖుడు అయ్యేలా ఆహ్లాదకరంగా కూతలు కూయండి అని కొన్ని వేల కోయిలలను పంపాడు. తుమ్మెదలను పిలిచి మీరందరూ వెళ్ళండి అక్కడ భ్రుంగముల సవ్వడి మృదంగములు మోగిస్తున్నట్లుగా ఉండాలి. ఆయన కళ్ళు విప్పి చూసేసరికి అన్ని పువ్వుల మీద వాలి రెక్కలు టపటప లాదితున్న భ్రుంగములను శంకరుడు చూసి ఆయన మనస్సు మళ్ళాలి. అందుకని మీరు వెళ్ళండి అని చెప్పాడు. వసంతుడిని పిలిచి ఎక్కడ చూసినా నవవసంత శోభావిలసిత ప్రదేశం చేసెయ్యి. చెట్లన్నీ పూలు పూసేయ్యాలి. ఎక్కడ చూసినా సుగంధములు వచ్చెయ్యాలి. చక్కగా మెల్లగా నదులు పారుతూ ఉండాలి. చెట్లమీద పక్షులు కూర్చుని మైథునంతో ఉండాలి. పశువులు పక్షులు అన్నీ అదే వాతావరణంలో ఉండాలి. శంకరుడు కళ్ళు విప్పి ఎటు చూసినా ఆయన దృష్టి స్త్రీపట్ల అనురక్తమయ్యేటట్లుగా చేయాలి. అందుకని వసంతుడా నువ్వు బయలుదేరు అన్నారు. అందరికీ ఆయా పనులను పురమాయించి చేపను ధ్వజంగా కలిగిన లోకంలో తపస్సు చేసుకునే వారిని పడగొట్టగలిగిన మన్మథుడు తన బాణములతో శంకరుని వద్దకు బయలుదేరి వెళ్ళాడు. తాను అక్కడికి వెళ్ళేటప్పటికి తుమ్మెదలు గండు కోయిలలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అప్పుడే అమ్మవారు శివార్చన పూర్తి చేసుకుంది. శంకరుడు బహిర్ముఖుడు అయ్యాడు. అమ్మవారు వెళ్ళి స్వామివారి పాదముల మీద పుష్పములు వేద్దామని వెళ్ళి వంగి పుష్పములను సమర్పిస్తోంది. శంకరుని దృష్టి యందు మార్పులేదు. మన్మథుడు ఇదే అదనని శంకరుడికి కనపడకుండా ఉండే ఒక దట్టమయిన లతావితానంలో నిలబడి బాగా గురి ఎక్కు పెట్టాడు. తుమ్మెదల తాడులాంటి ఆ వింటినారికి మొదటి పుష్ప బాణమును కలువ రేకులతో తొడిగాడు. ఆకర్ణాంతం లాగి శంకరుడు మళ్ళీ కళ్ళు గబుక్కున మూసేస్తాడేమోనని శంకరుని మీద గురిపెట్టి బాణం వదిలాడు. ఆ బాణం వెళ్లి శంకరుని గుండెల మీద తగిలింది. ఆ బాణం కనపడదు. శంకరునియందు వికారం కలిగింది. ఎప్పుడయితే వికారం కలిగిందో ఆయన వెంటనే తనపట్ల వ్యగ్రతతో ప్రవర్తించాడని తన మీద బాణం వేశాడని గుర్తించాడు. ఆయన ఆ బాణమునకు వశుడు కాలేదు. బాణము వేయబడిందన్న విషయం గుర్తించాడు. పార్వతీదేవి వంక ఆయన చూపులో మార్పులేదు. పరికించి చూసి వేయబడినది పుష్ప బాణం కాబట్టి అది ఖచ్చితంగా మన్మథుడు చేసిన పనియే అని గుర్తించి చూట్టూ చూశాడు. ఒక పొద దగ్గర మన్మథుడు శంకరుడిపై రెండవ బాణమును వేయడానికి సిద్ధపడుతున్నాడు. అలా సిద్ధపడుతున్న మన్మథుని శంకరుడు చూసి ఆగ్రహంతో తన జ్ఞాన నేత్రమును మంద్రంగా రెప్ప విప్పేసరికి భుగభుగమంటూ అందులోంచి మంటలు పైకి వచ్చాయి. అపుడు సమస్త బ్రహ్మాండములు వేడెక్కాయి. ఆ అగ్నిహోత్రం దూరంగా ఉన్న మన్మథుడి దగ్గరకు ప్రయాణం చేసింది. ఎప్పుడయితే పరమశివుని మూడవకంటి నుండి అటువంటి చిచ్చు బయలుదేరిందో ఆ అమ్న్మతుడు నిశ్చేష్టితుడై ఏమి చేయాలో అర్థంకాక అలా నిలబడిపోయి ఉండిపోయాడు. పరమశివుడు విడిచిపెట్టిన అగ్నిహోత్రం మన్మథుని మీదకు వచ్చి మన్మథుడు భస్మరాశియై క్రిందపడిపోయాడు.
రతీదేవి భర్త పొరపాటుకు చింతిస్తోంది. నేను ఎన్నో నోములు నోచాను. కాబట్టి మరల నాకు అయిదవ తనమును ఇప్పించరా! మీరు అందరూ ఆ మేరకు పరమేశ్వరుని అడగరా? మీరు అందరూ అడిగితే పరమేశ్వరుడు నా భర్తను బ్రతికిస్తాడు’ అని ప్రార్థిస్తూ విలపించింది. వసంతుడా కాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి నేను కూడా వెళ్ళిపోతాను కాబట్టి చితి పేర్పించు. నేను ఆ అగ్నిలో ప్రవేశించి మన్మథుని చేరుకుంటాను అంది. అపుడు వసంతుడు అమ్మా, నీవు తొందరపడి అగ్నిహోత్రంలో ప్రవేశించవద్దు. కొద్దికాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానంతరం పార్వతీ పరమేశ్వరులు సంతోషంగా కూర్చుంటారు. పరమేశ్వరుడు భక్త వత్సలుడు. తప్పకుండా నీకు వరం ఇస్తాడు. తప్పకుండా నీ భర్తను మరల బ్రతికిస్తాడు అన్నాడు. జనులందరూ ఆశ్చర్యపడి పోయేటట్లుగా అశరీరవాణి పలికింది. శరీరం లేకుండా పలుక కలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే పలికాడని అర్థం చేసుకోవాలి. ‘వసంతుడు నీకు చెప్పినది సత్యమే. తొందరలో నీ భర్త సశరీరుడిగా కనపడతాడు. కానీ ఈలోగా ఆయన నీకు అనంగుడిగా శరీరంతో లేకపోయినా నీకు మాత్రం కనపడుతుంటాడు రాబోవు కాలంలో కృష్ణ పరమాత్మకు కుమారుడిగా ప్రద్యుమ్నుడిగా నీ భర్త జన్మిస్తాడు’ అని అశరీరవాణి పలికితే రతీదేవి చాలా సంతోషించింది. తన భర్త మరల తనను ప్రద్యుమ్నుడిగా కలుసుకునే తరుణం కోసమని ఎదురు చూస్తోంది. ఆమె పరమ సంతోషంతో పసుపు కుంకుమలతో ఆనందంగా తిరిగి వెళ్ళిపోయింది.
పరమశివుడు కూడా ఇంత ఉద్ధతి జరిగిపోయింది. మన్మథుడు కాల్చబడ్డాడు తన తపస్సుకు భంగం కలిగింది అని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. హిమవంతుడు ఈ వారగా విని గబగబా అక్కడకు వచ్చాడు. అక్కడ ఆందోళనతో విచారంతో ఉన్న కూతురు పార్వతీదేవిని తీసుకుని వేగంగా హిమవంతుడు తన అంతఃపురమునకు వెళ్ళిపోయాడు.




పార్వతీ కళ్యాణము – పార్ట్ 2
సతీదేవి అలా పడిపోవడంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ గబగబా లేచారు. “వీడు తండ్రి కాదు. వీడు అనుభవించి తీరుతాడు. ఉపద్రవం వస్తుంది. వీడు జగత్తునందు పరమ అపఖ్యాతిని పొందుతాడు. ఏ ప్రజాపతికి లేని అపకీర్తిని దక్షుడు పొంది తీరుతాడు. అమ్మవారిని కూతురిగా పొంది పరమశివుడిని అల్లుడిగా పొందినా, దక్షుడి పేరు గుర్తు వచ్చేసరికి దక్షయజ్ఞవిధ్వంసం జ్ఞాపకమునాకు వచ్చేటట్లుగా యజ్ఞం విధ్వంసం అయి తీరుతుంది” అనుకున్నారు. ఎప్పుడయితే అమ్మవారు యోగాగ్నియందు భస్మం అయిపోయిందో అక్కడ ఉన్న రుద్రగణములన్నీ ఒక్కసారి లేచాయి. లేచి వాళ్ళు దక్షుడి మీదికి వెళ్ళబోయారు. అక్కడ భ్రుగువు ఉన్నాడు. ఆయనది అర్థం లేని ఆవేశం. ఆనాడు దక్షుడు శంకరుడిని తిడుతుంటే భ్రుగువు కళ్ళు మిటకరించి ఇంకా తిట్టమని కనుబొమలు ఎగరేశాడు. ఇపుడు సతీదేవి యోగాగ్నిలో శరీరమును వదిలేసింది. భ్రుగువు చాలా సంతోషపడిపోయాడు. ఈ రుద్రగణములు కూడా ఓడిపోవాలని వెంటనే అక్కడ గల హోమవేది దగ్గరకు వెళ్ళి ఆ యజ్ఞగుండంలో అభిచారహోమం చేసి, దానిలోనుండి కొన్ని వేలమంది వీరులను సృష్టించాడు. వాళ్ళందరూ వెళ్ళి రుద్రగణములను తరిమి కొట్టేశారు. అది చూసి దక్షుడు చాలా సంతోషపడ్డాడు. సంతోషంతో దక్షుడు తన నిరీశ్వర యాగమును చేయడము కొనసాగించాడు.
ఈ విషయం నారదుడు వెళ్ళి శంకరునికి చెప్పాడు. ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారిగా తన ఆసనం మీద నుంచిలేచాడు. ఇపుడు అమ్మవారు శివుడిని రుద్రుడిగా మార్చింది. గర్జన చేసి పెద్ద నవ్వు ఒకటి నవ్వాడు. మెరిసిపోతున్న తన జటాజూటంలోంచి ఒక జటను పీకి, ఆ పుట్టిన కోపమును అణచుకోలేక నేలకేసి కొట్టాడు. ఆ జట సరిగ్గా నేలకు తగిలేసరికి అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించడం మొదలయింది. నల్లటి శరీరంతో ఒక పెద్ద పురుషుడు పుట్టాడు. పక్కన పెద్దపెద్ద కోరలు మెరుస్తున్నాయి. ఆయనకు వేయి చేతులు ఆవిర్భవించాయి. వేయి చేతులతో వేయి ఆయుధములు పట్టుకున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు. అంత ఊగిపోతూ వేయి ఆయుధములతో ప్రహారం చేస్తూ కనపడ్డవారిని కనపడ్డట్లు సంహరించడానికి వేరొక ప్రళయకాలరుద్రుడిలా అక్కడ సాక్షాత్కరించాడు. తండ్రి అయిన శంకరుని చూడగానే వేయి చేతులతో ఒక్కసారి నమస్కారం చేసి, మోకాళ్ళ మీద కూర్చుని తలను శంకరుని తాటించి తల ఎత్తి పాదములకు ఘోరరూపంలో ఉన్న శంకరుని వంక చూసి ‘నన్ను ఎందుకు పుట్టించారు? ఏమి ఆజ్ఞ? నేను ఏమి చెయ్యాలి? నన్ను వెంటనే ఆదేశించండి’ అన్నాడు. శంకరుడు ‘దక్షుడు నీ జనని అయిన సతీదేవి పట్ల అపచారంతో ప్రవర్తించాడు. నిరీశ్వర యాగం చేస్తున్నాడు. నీవు వెంటనే బయలుదేరి వెళ్ళి యజ్ఞ ధ్వంసం చెయ్యి’ అన్నాడు. వీరభద్రుడు శంకరునికి ఒకమారు ప్రదక్షిణ చేసి బయలుదేరాడు. ఆయనను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన వెనక ప్రమథగణములు అన్నీ బయలుదేరాయి. ఆయన శరీరం చేత పెద్ద చీకట్లు పుట్టాయి. ఎక్కడ చూసినా ధూళి పైకి రేగుతోంది. దక్షయజ్ఞంలో కూర్చున్న వాళ్ళు ‘ఏమిటి ఇంత ధూమం పుడుతోంది. ఒకవేళ మనం చేసిన దారుణమయిన పనిచేత మహానుభావుడయిన శంకరుడు కోపమును పొందినవాడై ఈ దక్షయజ్ఞ ధ్వంసమునకు పూనుకోలేదు కదా అని భయపడుతున్నారు. ఈలోగా వీరభద్రుడు రానే వచ్చాడు.
వీరభద్రుని చూడగానే దేవలోకాధిపతినని తనను పట్టుకుంటాడేమోనని ఇంద్రుడు లేచి పరుగెత్తడం ప్రారంభించాడు. ఆ వెనక చంద్రుడు పరుగెత్తుతున్నాడు. అప్పటివరకు యాగాగ్నియందు ఉన్న అగ్నిహోత్రములు పురుషరూపం దాల్చి పారిపోతున్నాయి. మీరు ఎక్కడికి పారిపోయినా మిమ్మల్ని పడగొట్టి గుద్దేస్తాను అని తన వేయి చేతులతో పట్టుకుందుకు వారి వెంటపడ్డాడు. ఆ యజ్ఞ శాలలో మొట్టమొదట రుద్రగణములు సంహరింపబడ్డాయి కాబట్టి ముందుగా వీరభద్రుడు నువ్వెవరు వాళ్ళ ఉసురు తీయడానికి శంకరుని ఎడమ కాలి దెబ్బకు లేచిపోయిన వాడివి నువ్వు అని ముందుగా యమధర్మరాజును పట్టుకుని ఆయన రెండు చేతులను వెనక్కి విరిచి తిప్పి ఒక్క తోపు తోసి తన కుడికాలి పాదంతో యమధర్మరాజు గుండెలమీద నొక్కిపెట్టి పిడిగుద్దులతో డొక్కలలో కొడుతుంటే యమధర్మరాజు ప్రక్కటెముకలు విరిగిపోయాయి. మిగిలిన దేవతలు ఇది చూసి పారిపోతున్నారు. ఈలోగా ప్రక్కకి చూసేసరికి సరస్వతీ దేవి ఎంతో సంతోషంగా కళ్ళు మూసుకుని వీణ వాయిస్తోంది. అన్నగారికి అవమానం జరుగుతూ యాగం జరుగుతుంటే నీవు ఇక్కడకు వచ్చి కూర్చుని వీణవాయిస్తున్నావు. నీకు యాగం కావలసి వచ్చిందా అని చిటికిన వేలు పెట్టి ముక్కు గిల్లెశాడు. ముక్కు ఊడిపోయి క్రింద పడిపోయింది. ఆమె వికృతరూపం చూసి అక్కడ ఉన్న అందరు కాంతలు లేచి పరుగులు మొదలుపెట్టారు. వీరభద్రుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళి ఆయనను పట్టుకుని నువ్వేనా ఆరోజున బ్రహ్మసభలో శంకరుని దక్షుడు నింద చేస్తుంటే ఎగతాళి చేశావు. అని ఆయన గడ్డమును తన చేతికి ముడి వేసుకుని ఒక్క లాగు లాగాడు. అపుడు భ్రుగుని గడ్డం మొత్తం ఊడిపోయి నెత్తురు వరదలయిపోయింది. మీసములను లాగేశాడు. బొటనవేలితో భ్రుగుని రెండు కనుగుడ్లు ఊడబెరికేశాడు. శంకరనింద చేస్తే ఎలాంటి గతి పడుతుందో గుర్తు పెట్టుకో అని యాగాగ్నిహోత్రం దగ్గర కూల దోసేశాడు. అక్కడితో ఆగలేదు. భ్రుగువు రెండు దవడలు నొక్కి పైవరుస దంతములు పట్టుకుని కుదిపేసి క్రింది వరుస దంతములు కుదిపేసి రెండు చేతులతో రెండు దవడలు పట్టుకుని లాగాడు. నోరు చిరిగిపోయింది.
తరువాత పూషుడి దగ్గరకు వెళ్ళాడు. పూషా అనబడే ఆ సూర్యరూపమును పడగొట్టి ఆయన పళ్ళను పట్టుకుని నలిపేశాడు. పైవరస పళ్ళు, క్రింది వరుస పళ్ళు ఊడిపోతే వాటిని గాలిలోకి విసిరేసి ఇవాళ నుంచి నీవు మాట్లాడితే నీకు పళ్ళు లేవు కాబట్టి భాషయందు తప్పులు వస్తాయి. భాషయందు తప్పులు రావడం నీతోనే మొదలవుతుంది అని చెప్పాడు. ఆనాటి నుంచి పళ్ళు లేక పూష సరిగా మాట్లాడలేకపోయాడు. ఆనాటి నుండే భాషలో తప్పు రావడం అన్నది ప్రారంభం అయింది.
వీరభద్రుడు వెనకనుంచి వెళ్ళి చంద్రుడిని పట్టుకుని క్రిందపడేసి తన రెండు కాళ్ళను పైకెత్తి చంద్రుడి కడుపు మీదకి ఒక గెంతు గెంతాడు. చంద్రుడికి ప్రక్కటెముకలన్నీ విరిగిపోయి, చంద్రుడి నోట్లోంచి అమృతధార పైకి లేచి, వీరభద్రుని పాదములను అభిషేకం చేసింది. అలా వీరభద్రుడు దేవతల వెంటబడి తన వేయి చేతులతో చావగొట్టాడు.
చివరికి దక్షుడి మీదకు వెళ్ళి ఆయన మెడను నరకడానికి ప్రయత్నించాడు. దక్షుని మెడ తెగలేదు. దక్షుని శరీరం అంతా మంత్రపూరితం అయిపోయి ఉంది. అందుకని కంఠం తెగలేదు. తెగకపోతే గుండెల మీద తన కుడికాలి పాదంతో తొక్కి తలకాయను రెండు చేతులతోటి గడ్డిని మోపు కట్టినపుడు తిప్పినట్లుగా తిప్పేసి అది బాగా మెలిపడిపోయి సన్నగా అయిపోయిన తర్వాత ఊడబెరికి అగ్నిహోత్రంలో పడేశాడు. పిమ్మట రుద్రగణములను పిలిచి ఈ హోమగుండంలోనే కదా దేవతలు హవిస్సులు పుచ్చుకున్నారు. ఈ గుండంలో మూత్రమును విసర్జించండి అన్నాడు. వారందరూ హోమ గుండంలో మూత్రవిసర్జన చేశారు. అందరినీ కొట్టి ఉగ్రమూర్తియై వీరభద్రుడు నాట్యం చేస్తుంటే ఆపగలిగిన మొనగాడెవడు? మిగిలిన వాలు కొద్దిమంది ఉంటే వీళ్ళందరూ పరుగుపరుగున బ్రహ్మ సదనమునకు వెళ్ళారు. వీరభద్రుడు తన చేతిలో పట్టిసమును తీసుకు వెళ్ళి గోదావరి నదిలో కడిగి శాంతమూర్తి అయ్యాడు. ఎక్కడ తన చేతిలో ఉన్న పట్టిసమును వీరభద్రుడు కదిగాడో అదే పట్టిసతీర్థం. దక్షయజ్ఞం జరిగిన చోటు దక్షారామం. పరమ పుణ్య క్షేత్రం.
దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మ గారి దగ్గరకు వెళ్ళి మహానుభావా, ఏమిటి దీనికి పరిష్కారం? అని అడిగారు. అపుడు ఆయన మీరు చేసిన పాపం సామాన్యమయిన పాపం కాదు. ఆయన శర్వుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు. ఎనిమిది రూపములతో ప్రకాశిస్తున్నవాడు పరమశివుడు. మీకొక మాట చెప్తున్నాను. శంకరుడు కరుణాపూరిత హృదయుడు. మనం బుద్ధి తెచ్చుకుని ఆయనకు నమస్కరించడానికి వెళితే ఆయన మిక్కిలి ప్రసన్నమూర్తిగా ఉంటాడు. రండి అని చెప్పి వీళ్ళందరినీ తీసుకుని కైలాసమునకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళేసరికి ప్రశాంత వదనంతో శంకరుడు పెద్ద వటవృక్షం క్రింద కూర్చుని తన ఎడమతొడ మీద కుడిపాదం పెట్టుకుని సనక సనందనాది మహర్షులందరూ తనచుట్టూ కూర్చుని ఉండగా, పరబ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానమును చక్కగా చిన్ముద్రపట్టి తనలోతాను రమిస్తున్నవాడై సన్నటి చిరునవ్వు నవ్వుతూ, పరమానంద స్వరూపంగా వాళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తున్నాడు.
ఎక్కడ చూసినా కైలాస పర్వతం మీద లతావితానములు. పొదరిళ్ళు, ఋషులు, ప్రమథగణములు, నందీశ్వరుడు, గంటల చప్పుడు, వచ్చే విమానములు, వెళ్ళే విమానములు. అందరూ శంకరుడికి పరమభక్తితో నమస్కారములు చేస్తున్నారు. పరమభక్తితో అందరూ పంచాక్షరీ మహా మంత్రమును జపం చేసుకుంటూ ఉన్నారు. ఆ కైలాసపర్వతం పరమరమ్యంగా శోభాయమానంగా ఉంది. బుద్ధి తెచ్చుకున్న దేవతలు శంకరుడి దగ్గరకు వెళ్ళి నిలబడి “స్వామీ మా బుద్ధి గడ్డి తినింది. ఈశ్వరా నీవు కాకపోతే మమ్మల్ని రక్షించే వారెవరు? కృపచేసి మమ్మల్ని కాపాడవలసింది’ అని ప్రార్థించారు. శంకరుడు వెంటనే చిరునవ్వు నవ్వి ఎవరెవరు దెబ్బలు తిని మరణించిన వారు ఉన్నారో వారందరూ పూర్వం ఎలా ఉన్నారో అంతే తేజస్సుతో సజీవులు అగుదురు గాక! ఆగిపోయిన యాగం యథారీతిగా సశాస్త్రీయంగా వేదం ఎలా చెప్పిందో అలా పూర్తిచేయబడుగాక! దక్షుడి తల అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి మూర్ఖత్వమునకు పిరికితనమునకు ప్రతీక కనుక మేక ముఖమును తీసుకు వచ్చి దక్షుడి శిరస్సుకు అతికింపబడుగాక! దక్షుడు సజీవుడు అగుగాక! అతడు బుద్ధి తెచ్చుకుని సంతోషంగా జీవితమును గడుపుగాక! మీరందరూ పరమ సంతోషముతో ఆనందముగా ఉందురుగాక! అని చెప్పాడు. ఎక్కడా తన భార్య గురించి మాట్లాడలేదు. ఇదీ శంకరుడంటే. ఇపుడు దక్షుడు మేక ముఖం పెట్టుకుని శంకరుడి దగ్గరకు వచ్చి సాష్టాంగ పది ఏడుస్తూ “తండ్రీ దేవా అభవ పురహర రుద్రా, నీవు నన్ను దండించావని అనుకోవడం లేదు. నువ్వు ఎలా ఈ మస్తిష్కమును తీసి ఉండకపోతే నేను ఇంకా ఎన్ని పాపములు చేసి ఉండేవాడినో? ఈ పాపమును ఇక్కడితో తీసి వేశావు. ఇకపై బుద్ధి తెచ్చుకుని బ్రతుకుతాను. అన్నాడు. శంకరుడు చక్కగా వెళ్ళి యజ్ఞమును పూర్తిచెయ్యి అని ఆదేశించాడు.
ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి ఆ యాగమును పూర్తిచేశారు. అప్పుడు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఇటువంటి తప్పు పనులు ఎన్నడూ చేయవద్దు అని చెప్పారు. యాగం పూర్తి చేయబడింది.
దక్షయజ్ఞం ధ్వంసం గూర్చి చదివినా, బుద్దిమంతులై శంకరుని కారుణ్యమును మనసులో అవధరించగలుగుతూ వినినా, అటువంటి వారికి జాతకములో ప్రమాదములు పొడచూపితే అవి తప్పి పోతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. కీర్తి కలుగుతుంది. వాళ్ళు చేసిన పాపములు నశిస్తాయి. శంకరుడు దక్షిణామూర్తిగా ఉన్న కైలాస దర్శనం చెప్పబడింది కాబట్టి వాళ్ళ భవబంధములు తొలగి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇది అంత పరమపావనమయిన ఆఖ్యానము.




ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog

No comments:

Post a Comment