Friday 30 September 2016

బతుకమ్మ




తెలంగాణకు తలమానికమైన పండుగ బతుకమ్మ. ఇది స్ర్తిలకే పరిమితమైనదిగా ప్రశస్తి పొందింది. బతుకమ్మ పండుగ కంటే ముందు బొడ్డెమ్మ పండుగను చేసుకుంటారు. భాద్రపద పున్నమి వెళ్ళిన పంచమి రోజున బొడ్డెమ్మ పేరుగల గౌరమ్మను పుట్టమన్నుతో చేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ప్రతిరోజూ సంధ్యవేళ ముత్తయిదువలు, యువతులు బొడ్డెమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, ఆడుతూ, పాడుతూ తొమ్మిది రోజులు ఈ పండుగను ఆచరిస్తారు. బొడ్డెమ్మ ఆడే అమ్మాయిలకు తొందరగా పెళ్ళవుతుందనే నమ్మకం ఉంది. ఆ తరువాత మహాలయ అమావాస్య. దీనిని పెత్తరమావాస్య (పితృ అమావాస్య) అంటారు. ఈ రోజు పి తృ దేవతలకు బియ్యం ఇవ్వడం తెలంగాణలో ఆనవాయితీ. దీనిని ‘ఎంగిలి పూల అమావాస్య’ అని కూడా వ్యవహరిస్తారు.


బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది
అమావాస్య నుండి ‘సద్దులు బతుకమ్మ’ వరకు తొమ్మిది రోజులు ప్రతిరోజూ సాయంత్రం వేళ బ తుకమ్మను దగ్గరలోని గుడివద్ద లేదా నలుగురూ కలిసి ఒకచోట ఆడి నీటిలో విడుస్తారు.


మహిళలు పాడే జానపద పాటల్లో ధర్మాంగదుని గాథ, చంద్రమతి, శశిరేఖా పరిణయం, అన్నాచెల్లెళ్ళ ఆప్యాయత, శ్రీలక్ష్మీ, శ్రీ గౌరి వంటి కథలు వినసొంపుగా ఉంటాయి. వీటిలో సామాజికాంశాలు కూడా ఉంటాయి. పాటల చివరి ఉయ్యాలో, గౌరమ్మ, కోల్, చందమామ.. అంటూ పాడుతుంటారు. పా టలకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ లయబద్ధంగా అడుగేస్తూ బతుకమ్మ ఆడుతారు. కలహాలున్న వ్యక్తులు కూడా కలిసిపోతారని, గనుక దీన్ని సద్భావంతో జరుపుకునే పండుగగా చెపుతారు. వరంగల్ ప్రాంతంలోని మొగిలిపాక గ్రామానికి చెందిన భట్టు నరసింహకవి బతుకమ్మ పాటలు, కథలు గురించి బహుళ ప్రచారం చేశారు.
బతుకమ్మ పండుగకు ప్రాణం పాట. పూలను కోసుకొచ్చే దగ్గరే మగవాళ్ల వంతు. పెద్ద పెద్ద బతుకమ్మలు నిలిపి ఆడిపాడే ఆడపడుచుల వైభోగం మాటలకందదు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి తల్లివేరు లాంటిది. సాంస్కృతిక కాలుష్యంతో కళ తప్పిన సమాజం మూలాలను తట్టి, ఐక్య తాభావంతో అందరినీ ఏకం చేసే పండుగ ఇది. నేలకూ, నీళ్ళకు, అడుగుకూ, నుడుగుకూ ఉన్న సహజ సంబంధాన్ని చాటిచెప్పే పండుగ ఇది. ఆడబిడ్డల ఆత్మీయతల మధురిమలను పంచే మా నవ సంబంధాల సారాంశం- బతుకమ్మ పండుగ.

బతుకమ్మ పండుగ విశిష్టత

సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. ఇతర చోట్ల పూలు, నీళ్లతో జరుపుకునే పండుగలు ఎన్ని ఉన్నా, అవి ఏవీ కూడా తెలంగాణ బతుకమ్మ పండుగతో సరిపోలవు.
రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలను, ఆటనూ విని, చూసి తరించాల్సిందే కానీ వర్ణించడం కష్టమే.. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలోనే ఉంది.. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే..

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (షిత్పొలా పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీరిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్ఠమైంది. ఉద్యమ సందర్బాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్థిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.

పండుగ సంబరాలు

బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతున్న మహిళలు
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. . ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.

అయితే చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమిక ను పోషిస్తాయి.
ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం)లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలం లో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు)లను ఇచ్చి పుచ్చుకొని తింటారు


మలీద - చక్కెర మరియు రొట్టెతో చేసిన పిండివంటకం
చివరి రోజు సాయంత్రం, ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.

చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న దృశ్యం
చీకటి పడుతుంది అనగా,స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావయానంగా ఉంటుంది.ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ,ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర మరియు రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ, బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ వారం రోజులూ,ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.

హన్మకొండలో బతుకమ్మ, దసరా పండుగలు

హన్మకొండ పట్టణం అయినప్పటికీ బతుకమ్మ, దసరా పండుగలను మాత్రం పల్లెల్లో కంటే గొప్పగా జరుపుకుంటారు. పితృ అమావాస్య (పెత్రమవాస్య) తో బతుకమ్మ పండుగ మొదలుపెట్టి తొమ్మిది రోజుల పాటు రోజూ సాయంత్రం బతుకమ్మ ఆడుకుంటారు. అయితే ఆరవ రోజు మాత్రం బతుకమ్మ ఆడరు. పెత్రమావస్య ముందు రోజు సాయంత్రం నుండి చుట్టుప్రక్కల పల్లెల నుండి వచ్చిన అమ్మకదారులు తంగేడు, గునుగు, తామర, గుమ్మడి, బంతి, చేమంతి మొదలగు పువ్వులను అమ్ముతారు. వీటితో పాటు బతుకమ్మ పేర్చడానికి సిబ్బులు, గుమ్మడి ఆకులను కూడా అమ్ముతారు. తిరిగి వీటినన్నింటిని సద్దుల బతుకమ్మ ముందురోజు కూడా అమ్మతారు. బతుకమ్మ మొదటిరోజు నుండి ఎనిమిదోరోజు వరకు అందరు వారి ఇంటి దగ్గరి గుళ్ళల్లో, ఖాళీ ప్రదేశాల్లో బతుకమ్మ ఆడుతారు. కాని తోమ్మిదో రోజైన దుర్గాష్టమి నాడు సాయంత్రం మాత్రం పిల్లల నుండి పెద్దలవరకు, ఎన్నడూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళని వారు కూడా ప్రతి ఒక్కరు కొత్తబట్టలు వేసుకొని, వివిధ నగలను ధరించి తాము తయారుచేసిన బతుకమ్మలను చేత బట్టుకుని పద్మాక్షమ్మ గుట్టకు పోతారు. బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ, "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! బంగారు బతుకమ్మ ఉయ్యాలో!! " అని గొంతెత్తి ఒకరు పాడగా మిగతా వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు. సుమారు గంట నుండి రెండు గంటల వరకు అలా ఆడిన తర్వాత, బతుకమ్మను అక్కడే ఉన్న కోనేటిలోని నీళ్ళల్లో వదులుతారు. బతుకమ్మతోబాటు సద్దులు కూడా పట్టుకుపోతారు. సత్తిపిండి, నువ్వులపొడి, పల్లీలపొడి, కొబ్బరిపొడి మొదలగు వాటిని కలిపి సద్దులు అంటారు. బతుకమ్మను నీళ్ళల్లో వదిలిన తర్వాత సద్దులను అందరు పంచుకుని తిని, పసుపుకుంకుమలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. తిరిగి ఆటోలల్లోగాని, కార్లల్లోగాని ఇంటికి చేరుకుంటారు. బతుకమ్మ పండుగ మరుసటి రోజు వచ్చే దసరా పండుగను కూడా హన్మకొండలో వైభవంగా జరుపుకుంటారు. దసరా రోజు ప్రతిఒక్కరు తమ తమ వాహనాలను కడుక్కొని, పూలదండవేసి కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు. చేతిపనులవారు తమ పనిముట్లకు, పరిశ్రమలవారు మిషిన్లకు పూజలు చేస్తారు. పోలీస్, మిలిటరీ వాళ్ళుకూడా తమ ఆయుధాలకు పూజచేస్తారు. ఇండ్లకు ముగ్గుపోయడం, గృహప్రవేశాలు, దుకాణాల ప్రారంభం మొదలగు కొత్తపనులను చేస్తారు. బతుకమ్మరోజు కూరగాయల భోజనంచేస్తే, దసరా నాడు మాత్రం అందరు (శాఖాహారులు మినహా) మాంసాహార భోజనం చేస్తారు. పూరీలు, గారెలు చేసుకుంటారు. చాలా మంది మద్యాన్ని కూడా సేవిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుండి పురుషులు, స్త్రీలు, పిల్లలందరూ కొత్తబట్టలు వేసుకొని జమ్మి కొరకు పద్మాక్షమ్మగుట్టకు పోతారు. గుట్ట దగ్గరికి పోవడానికి బలమైన కారణముంది. గుట్ట దగ్గరికి వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రతివొక్కరు వస్తారు. తమ చిన్ననాటి మిత్రులను, దోస్తులను కలుస్తారు. జమ్మి ఆకు తీసుకొని, పాలపిట్ట ను చూసి, దసరా ఉత్సవ కమిటీవారు ఏర్పాటు చేసిన రావణాసుర వధను చూసి ఇంటికి వస్తారు. గుట్ట దగ్గరి నుండి ఇంటికి వచ్చేవరకు, వచ్చిన తర్వాత పెద్దలకు, మిత్రులకు జమ్మి ఆకు చేతిలో పెట్టి, కాళ్ళకు మొక్కి, ఆలింగనం చేసుకుంటారు. కొంత జమ్మియాకును బీరువాలల్లో వేసుకుంటారు. ఈ విధంగా బతుకమ్మ, దసరా పండుగలను హన్మకొండలో బాగా ఘనంగా జరుపుకుంటారు.

పండుగ కథ

ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నదిది : ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం "బతుకమ్మా !" అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు. ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.

బతుకమ్మ కథ

ఓ ముద్దుల చెల్లి, ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు. అంతా వీరాధివీరులే. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం అసూయ! ఆ బంగారుబొమ్మని బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్లిన అన్నలు, ఎంతకాలమైనా తిరిగిరాలేదు. అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆతర్వాత అన్నలొచ్చారు. ముద్దుల చెల్లి ఎక్కడని.భార్యల్ని నిలదీశారు. విషయం అర్థమైంది. తిండీతిప్పల్లేవు, నిద్రాహారాల్లేవు. చెల్లి కోసం వెదకని పల్లెలేదు, ఎక్కని గుట్టలేదు. ఓ వూరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా ... పెద్ద తామరపూవొకటి కనబడింది. వాళ్లను చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది. ఆతర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు. ఆ పూవును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెర్వు చూపింది కాబట్టి బతుకమ్మ అయ్యింది! ఇదో జానపద గాథ. మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో ఐతిహ్యం. ఆత్మత్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారూ ఉన్నారు

ఎక్కడా లేక పోయినా.....

ఆంధ్ర దేశంలో ఎక్కడా ప్రచారంలో లేక పోయినా ఒక్క తెలంగాణాలో మాత్రమే విశేష ప్రచారాన్ని పొందిన బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహార్నవమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగ జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటి ఎనిమిది రోజులూ, పెళ్ళికాని ఆడపిల్లలు ఆడుకుంటారు. దీనిని బొడ్డెమ్మ అంటారు. తొమ్మిదవ రోజున మాత్రం చద్దుల బతకమ్మ అంటారు. బకతమ్మ పండుగ ఆశ్వయుజ మాసంలో రావడం వల్ల వర్ష ఋతువుతో విండిన చెరువులు, తొణికస లాడుతూ వుంటాయి. పండి ఒరిగిన జొన్న చేలూ, పచ్చగా పెరిగే పైరు సంపద, విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా వుంటుంది. ఈ పండుగ రోజుల్లో పుట్ట మన్నుతో ఒక బొమ్మను చేసి, బహుళ పంచమి నాడు దానిని ప్రతిష్టించి దాని పైన, ఒక కలశాన్ని వుంచి, కలశంపైన పశుపు ముద్దతొ గౌరమ్మను నిలిపి పూలతోనూ, పసుపుతోనూ అలంగ రిస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటిలోనూ చేయక పోయినా, గ్రామానికి ఒక గృహంలో చేసినా సరి పోతుందని వారి అభిప్రాయం.
బొడ్డెమ్మను నిలిపిన తరువాత ఆ వాడలో వున్న ఆడపిల్లలందరూ అక్కడ గుమికూడుతారు. ఈ వినోదాన్ని చూడడానికి పెద్ద లందరూ వస్తారు. ఇలా ఎనిమిది రోజులూ కన్నె పడచులు ఆడుకుంటారు. తరువాత నవమి రోజున కోడి కూసే సమయాన స్త్రీలు లేచి, పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి గోరు వెచ్చని జీడిగింజల నూనెతో తలంటి పోసుకుని నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసిన ఇంట్లో చాపు వేసి బతకమ్మలను పేర్చి గుమ్మడి పూవు అండాశయాన్ని తుంచి పసిడి గౌరమ్మగా పెడతారు. పసుపుతో ముద్ద గౌరమ్మను చేసి పెట్టి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకాలతో అలంకరించి పగలంతా అలాగే వుంచుతారు.

సాయంత్రం పిన్నలు, పెద్దలు, నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు, వివిధ అలంకారాలను అలంకరించుకుని బతకమ్మలను చేత బట్టుకుని చెరువు కట్టకో, కాలువ గట్టుకో దేవాలయానికో వెళ్ళి బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, కన్నె పడుచులు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, గొంతెత్తి ఒకరు పాడగా వలయాకారంగా తిరుగుతున్న వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు.

ఆ దృశ్యాన్ని గ్రామస్తులందరూ ఆనందిస్తూ వుంటారు. మగపిల్లలు కొయ్య గొట్టాలలో, కాగితపు అంచులను కన్నెపిల్లల పైనా స్త్రీల పైనా ప్రయోగిస్తారు. బతకమ్మ పాటలు, ఒకో ప్రాంతంలో ఆయా మాండలిక పదాలతో ప్రతి చరణాంతం లోనూ, ఉయ్యాలో అని, కోల్ కోల్ అనీ, చందమామా అనీ, గౌరమ్మ అనీ పదాలు పాడతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతుల స్తోత్రాలేగాక, అనేక పౌరాణిక గాథలైన, శసి రేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతా దేవి వనవాసము మొదలైనవే గాక, సారంగధర, బాలనాగమ్మకు సంబంధించిన పాటలు కూడా పాడుతూ వుంటారు.
బతుకమ్మ పండగ వసూందంటే తెలంగాణా పల్లెల్లో నూతన వుత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించు కుంటారు. ఆడ పిల్లల్ని పుట్టింటికి తీసుకు వస్తారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు అత్తగారి ఇంటి నుంచి కాగితపు పూలతో చేసిన బతకమ్మను వాయినంగా పంపుతారు. అత్తగారింట్లో వుండే ప్రతి ఆడపిల్లా ఎప్పుడు కన్న వారింటికి వెళ్ళాలా? కన్నవారి పిలుపు ఎప్పుడు వస్తూందా? తనను తీసుకు వెళ్ళడానికి అన్న ఇంకా రాలేదే అన్న బాధను వ్వక్త పరుస్తారు.
ఉదాహరణకు పండుగ వస్తుందంటే, ప్రియుని రాకకై ఎదురు చూసే ప్రియు రాండ్లు పాడుకునే పాట.........

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నానోము పండింది ఉయ్యాలో
నీనోము పండిందా ఉయ్యాలో
మావారు వచ్చిరి ఉయ్యాలో
మీవారు వచ్చిరా ఉయ్యాలో

బతకమ్మలను పిల్చుకుంటూ పాడే పాట

ఒక్కొక్క వువ్వేసి [[చంద మామ||
ఒక జాము అయే [[చంద మామ||

రెండేసి పువ్వు తీసి ||చంద మామ||
రెండు జాము లాయె ||చంద మామ||

ఈ విధంగా ఎన్నో పాటలు పాడుతారు. తొమ్మిదవ నాడు బొడ్డెమ్మ చర్చించి కలశంలో, ఆవాడ పిల్లలు ప్రతిదినం చెచ్చి పోసే బియ్యం పరమాన్నం వండి పంచి పెట్టి ఒక బావి దరి చేరి

బొడ్డెమ్మ బొడ్డెమ్మ.... బిడ్డలెందారే
బవిల పడ్డ వారికి ......వారిద్దరమ్మా
చెర్ల బడ్డవికి ..... .. చేరిద్దరమ్మా
కుంట్ల బడ్డ వారుకి.. కోరుద్దరమ్మ
నిద్రపో బొడ్డేమ .... .. నిద్రబోవమ్మ
నిద్రకు నూరేండ్లు...... నీకి వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి....... నిండ నూరేంళ్ళు
అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు. బొడ్డెమ్మ పండుగలో పాడబడే పాటలు ఇంకా కొన్ని వందలున్నట్లు బి. రామరాజుగారు తమ జానపద గేయ సాహిత్యంలో తెలియచేసారు.

కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో -
కొండ కోనలు దాటి ఉయ్యాలో – వేటకే బోయెను ఉయ్యాలో -
అడవిలో దిరిగెను ఉయ్యాలో – అటు ఇటు జూచెను ఉయ్యాలో -
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో – చెరువొకటి కనిపించె ఉయ్యాలో -
శబ్దమేదొ వినెను ఉయ్యాలో – శరమును సంధించె ఉయ్యాలో -
జంతువేదొ జచ్చె ఉయ్యాలో – అనుకొని సాగెను ఉయ్యాలో -
చెంతకు చేరగా ఉయ్యాలో – చిత్తమే కుంగెను ఉయ్యాలో -
కుండలో నీళ్ళను ఉయ్యాలో – కొనిపో వచ్చిన ఉయ్యాలో -
బాలుని గుండెలో ఉయ్యాలో – బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో -
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో – ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో -
శ్రవణుడు నేననె ఉయ్యాలో – చచ్చేటి బాలుడు ఉయ్యాలో -
తప్పు జరిగెనంచు ఉయ్యాలో – తపియించెను రాజు ఉయ్యాలో -
చావు బతుకుల బాలుడుయ్యాలో – సాయమే కోరెను ఉయ్యాలో -
నా తల్లిదండ్రులు ఉయ్యాలో – దాహంతో ఉండిరి ఉయ్యాలో -
ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో – ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో -
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో – అడవంతా వెదికె ఉయ్యాలో -
ఒకచోట జూచెను ఉయ్యాలో – ఒణికేటి దంపతుల ఉయ్యాలో -
కళ్ళైన లేవాయె ఉయ్యాలో – కాళ్ళైన కదలవు ఉయ్యాలో -
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో – వేదన చెందుతూ ఉయ్యాలో -
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో – సంగతి జెప్పెను ఉయ్యాలో -
పలుకు విన్నంతనే ఉయ్యాలో – పాపమా వృద్ధులు ఉయ్యాలో -
శాపాలు బెట్టిరి ఉయ్యాలో – చాలించిరి తనువులుయ్యాలో -
శాపమే ఫలియించి ఉయ్యాలో – జరిగె రామాయణం ఊయ్యాలో -
లోక కల్యాణమాయె ఉయ్యాలో – లోకమే మెచ్చెను ఉయ్యాలో


బతుకమ్మ అంటే..
బతుకమ్మ అంటే- బతుకునిచ్చే అమ్మ, బతికిన అమ్మ. బతికించే అమ్మ అని వర్ణిస్తుంటారు. ప్రచారంలో వున్న కథలను వివరించటంతోపాటు, పాటల్లోని పౌరాణిక, చారిత్రక ఆచార సంప్రదాయాల, వాస్తవ సంఘటన చిత్రిత కథాంశాలను సేకరించి, వర్గీకరించి, విశే్లషించడంలో బతుకమ్మ ప్రాశస్త్యం నెలకొని వుంది. స్ర్తిల సౌందర్యారాధనం పూలను అలంకరించడంలో ప్రదర్శితమవుతుంది.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వేడుకగా జరిపేది బతుకమ్మ పండుగ. పాడ్యమికి ముందు భాద్రపద బహుళ పంచమి నుంచి తొమ్మిది రోజులు (మహాలయ అమావాస్య వరకు) బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు. బతుకమ్మ స్ర్తిల పండుగ. బొడ్డెమ్మ ప్రధానంగా బాలికల, కన్యల పండుగ. బొడ్డెమ్మను ధాన్యరాశిగా పల్లె వాసులంతా భావిస్తారు.

బొడ్డెమ్మ...
ఒక చెక్క పీటపై కుమ్మరి మన్ను, పుట్టమన్ను, ఎర్రమన్నులో దేనితోనైనా చతురస్రాకారంగా ఐదు దొంతరలు వేసి వాటిని ఒక దానిపై ఒకటి త్రిభుజాకారంలో గోపురంగా పేరుస్తారు. చెక్క పీటపై నా లుగు దిక్కులా మట్టిముద్దలను పెట్టి బొడ్డెమ్మ బిడ్డలని అంటారు. ఈ శిఖరంపై కొన్నిచోట్ల వెంపలి కొమ్మ పెట్టి పూజిస్తారు. పీట చుట్టూ ముగ్గులు వేసి అలంకరిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో బొడ్డెమ్మ శిఖర ప్రదేశంలో బియ్యంతో నింపిన కలశం పెట్టి, దానిపై కొత్త రవిక బట్టను వుంచి అందులో తమలపాకుపై పసుపుముద్ద ఉంచుతారు.
పసుపు ముద్దను గౌరమ్మగా అలంకరించి పూ జిస్తారు. బొడ్డెమ్మను రుద్రాక్ష, కాకర, బీర, మల్లె, జాజి, తంగేడు పూలతో అలంకరిస్తారు. సాయంకాలం ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి, ఆ స్థలంలో ఆవు పేడతో ముద్దలు ఐదింటిని తయారుచేసి నాలుగువైపులా నాలుగు, మధ్యలో ఒకటి పెట్టి, దానిని బొడ్డెమ్మగా భావిస్తారు. బొడ్డెమ్మను పసుపు, కుంకుమ, పూలతో అలంకరిస్తారు. బొ డ్డెమ్మ చుట్టూ కన్యలు తిరుగుతూ ఆటపాటలతో గడుపుతారు. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పం దిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ అని వివిధ ప్రాం తాల్లో పలు రకాల బొడ్డెమ్మలు తయారుచేస్తారు.
పూలను పేర్చే తీరు...
బతుకమ్మ తయారీకి ఇంటిల్లిపాది కలిసి పనిచేస్తారు. పొద్దునే్న మగవాళ్లు తంగేడు, గునుగు, కల్గు మొదలగు పూలన్నింటినీ సేకరిస్తారు. మొదట వెదురు ప్లేటు (సిబ్బి)లో గానీ, తాంబాలం (పెద్ద ప్లేటు)లో గానీ గుమ్మడి ఆకులు పరిచి, వాటిపై గుండ్రంగా తంగేడు పూల వరుస చుట్టి, తరువాత గుమ్మడి, గునుగు , కట్ల, రుద్రాక్ష, గోరిమిడి, మం కెన, మల్లె, బంతి, చామంతి, మందార, పోకబంతి పూలతో వరుసలు పేర్చి బతుకమ్మను అందంగా గుడి గోపురంలా పేర్చుతారు. గునుగు పూలకు రంగులు అద్ది, దొంతరలుగా పేర్చడం ఒక కళ. బతుకమ్మను పేర్చాక ఇంట్లో దేవుని దగ్గర ముగ్గుమీద పెడతారు. పొద్దుకుంకే ముందు బతుకమ్మను కూడళ్ళలో పెట్టి, ముస్తాబైన ఆడపడుచులంతా ఒక చోటికి చేరుతారు. మధ్యలో బతుకమ్మలను పెట్టి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుంటారు. తరువాత బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా తొమ్మిది రోజులు ఆడినా, మధ్యలో ఆరవ రోజు ‘అర్రెము’ అంటూ బతుకమ్మను పేర్చరు. తొ మ్మిదో రోజు దుర్గాష్టమి నాడు ‘‘సద్దుల బతుకమ్మ’’ (పెద్ద బతుకమ్మ) అని- అన్ని రోజులకంటే పెద్దగా బతుకమ్మను పేర్చి, పైన పసుపుతో గౌరమ్మను పెడతారు. బతుకమ్మను పేర్చడంలో పోటీపడి ఒకరికంటే ఒకరు పెద్దగా పేర్చుతుంటారు.

సద్దుల బతుకమ్మ..
సద్దుల బతుకమ్మ రోజు ఉదయం దద్దోజనం, పులిహోర, తీపి అన్నం వంటి ఐదు రకాల స ద్దులు కలుపుతారు. గౌరమ్మ ప్రతి రూపంగా బతుకమ్మను పూజించి తొమ్మిది రకాల ఫలహారాలు నైవేద్యంగా పెడతారు. బతుకమ్మను పేర్చడం ముగిశాక సాయంత్రం మహిళలందరూ పట్టు చీరలు, నగలు ధరించి బతుకమ్మ ఆడడానికి వెళతారు. వీరితోపాటే పిల్లలు, పురుషులు కలుస్తారు. మొదట ఇంటి ముందర ఆడిన తరువాత దగ్గరలోని గుడి ఆవరణలో బతుకమ్మను పెట్టి వీధి వీధంతా ఒకేచోటకు చేరి సందడిగా పొద్దుపోయెంత వరకు ఆటపాటలతో గడిపి పూజిస్తారు. ఆ తరువాత చెరువుకట్ట దగ్గరకు వెళ్ళి అక్కడ కాసేపు ఆడి బతు కమ్మను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనానికి ముందు బతుకమ్మపైన పెట్టిన గౌరమ్మను తీసుకుని ముత్తయిదువలు తమ అయిదోతనాన్ని కాపాడమని మంగళసూత్రాలకు రాసుకుంటారు. ఆ తర్వాత సద్ది (ప్రసాదం) తిన్నాక, తిరుగు ప్రయాణంలో మళ్ళీ పాటల సందడి మొదలవుతుంది. బతుకమ్మ పండుగ ఓ అనిర్వచనీయ ఆనందం, ఓ భక్తి పారవశ్యం. తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వారసత్వ సంప్రదాయాలను నిలబెట్టే బతుకమ్మ- రజాకార్ల ఆగడాలను తట్టుకొని నిలబడ్డ మహత్తర పండుగ. విదేశాల్లో సైతం తెలంగాణ మహిళలు ఈ సంప్రదాయాన్ని ఘనంగా పాటిస్తూనే ఉన్నారు.

‘‘పోయిరా బతుకమ్మ- పోయ రావమ్మా
పోయి మీ అత్తవారింట్లో బుద్ధి కలిగుండు
ఎవరేమన్ననూ ఎదురాడకమ్మా
పూలు పత్రి పెట్టి నిన్ను పూజించాము
పై యేటివరకు- పైలంగ మము జూడు
జయజయము గౌరమ్మ- జయము గౌరమ్మ’’
-అంటూ ఆడపిల్లను అత్తవారింటికి పంపినట్లు
మహిళలు బతుకమ్మను సాగనంపుతారు. స్ర్తిల సమైక్యతకు దర్పణం పట్టే ఈ పండుగ తెలంగాణ ప్రాంత సంస్కృతికి ప్రతీకగా భాసిల్లుతోంది.

No comments:

Post a Comment