Thursday 15 December 2016

ధనుర్మాసం మార్గశిర బహుళ తదియ శుక్రవారం – డిశంబర్ 16వ తేదీ



ధనుర్మాసం మార్గశిర బహుళ తదియ శుక్రవారం – డిశంబర్ 16వ తేదీ నుంచి ఆరంభమౌతుంది ధనుర్మాసం 'పండుగ నెల' ధనుర్మాస వ్రతం గురించి శైవ, వైష్ణవ – ఉభయ శాస్త్రాల్లోనూ విశిష్టంగా పేర్కొన్నారు. ఉషఃకాల వ్రతంగా దీనిని వివరించారు. కేవలం విష్ణుపరంగానే మన తెలుగునాట ప్రాచుర్యం ఉన్నప్పటికీ శాస్త్రానుసారం సర్వదేవతా ప్రీతికరమైనది ధనుర్మాసం.
గోపెమ్మలు ఆచరించిన మార్గశీర్ష వ్రతాన్ని తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో జన్మించిన గోదాదేవి ' తిరుప్పావై' - శ్రీకరమైన పద్యాల సమాహారం - పాశురాలుగా రచించి అలరించింది. శ్రీ మహాలక్ష్మీదేవి అవతారమైన గోదాదేవి విష్ణు చిత్తుడు అనే మహనీయుని కుమార్తెగా జన్మించి విష్ణుదేవుని రూపమైన శ్రీరంగనాథుని వివాహమాడింది.
ఈ వివాహం సిద్ధించడం కోసం గోదాదేవి తన సఖీ బృందంతో కలిసి ధనుర్మాసంలో రోజుకొక పాశురాన్ని పాడింది. ద్వాపరయుగం నాటి గొబ్బెమ్మలు లేదా గోపెమ్మలు కలియుగంలో గోదాదేవి బృందం.
గోపెమ్మలు తెల్లవారు జామున నిద్రలేచి ఒకరినొకరు నిద్రలేపుకుంటూ వెళ్ళి నందుని ఇంట నిదురించి ఉన్న శ్రీకృష్ణుని నిద్రలేపి పూజించడం 'తిరుప్పావై'లోని ఇతివృత్తం. ఇంటిముందు గొబ్బెమ్మలను నిలిపి కన్యలు – శ్రీకృష్ణుని గురించి పాడడం – మంచి భర్తను పొందడం కోసం.
• ఈ మాసంలో ఆర్ద్రానక్షత్రం నాడు శివుడు అగ్నిలింగంగా అరుణాచలంలో వ్యక్తమైనాడని శైవపురాణాలు చెప్తున్నాయి.
• ఈ మాసంలోని ఒకానొక సోమవారం నాడు శివపార్వతుల కళ్యాణం జరిగిందని శివపురాణ వచనం.
• ఉషఃకాలంలో శివార్చన వైశిష్ట్యాన్ని కూడా పురాణాలు పేర్కొన్నాయి. అత్యంత ప్రాచీన కాలం నుండి నేటివరకు వైదిక శైవ సిద్ధాంతానుసారం తమిళనాట శైవాలయాలలో ఉషఃకాల పూజ జరుగుతోంది. ఆ సమయంలో మాణిక్యవాచకుని ‘తిరువెంబావై-తిరుప్పళి ఎళుచ్చి’పఠనం చేయడం కూడా ఆనవాయితీ.
అయితే వైష్ణవం కూడా శ్రీరామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో వ్యాప్తి చెంది ‘తిరుప్పావై’ ఇక్కడి వైష్ణవాలయాలలో పారాయణ చేయడం అలవాటు అయింది. కానీ ఆ ప్రచార ధాటిని తమిళ శైవమతం అవలంబించకపోవడం చేత –ఇక్కడి శివాలయాలకు ‘తిరువెంబావై’ తెలియలేదు.
తిరుప్పావై, తిరువెంబావై రెండూ అవశ్య పఠనీయాలుగా ప్రస్తావించి వ్యాప్తి చేసినది కాంచీ పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు. 

ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈమాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈపాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది.
మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశీర్ష మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మీముహూర్తంగా పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈనాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ధనుర్మాస వ్రతఫలం ఇదే.
ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు.తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆయోగనిద్రనుండి మేల్కొని శుద్ధ త్రయోదశినాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనభాగ్యమును కలిగిస్తాడు. ఆదివ్య దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి.దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు.
ఈధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఇంటిబయట ముంగిళ్ళలో గోమయంతో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఇలా పవిత్రములైన ఈప్రదేశములందు లక్ష్మీ నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆరంగవల్లులందు లక్ష్మీస్వరూపాలైన గొబ్బెమ్మలనుంచి వానిని పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. భగవదారాధనను ఎన్నడు మరువరాదనే విషయాన్ని గుర్తుచేసేలా హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది. లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టలందు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మి ఉంటుందని చెప్తారు. అందువల్ల వృషభాన్ని అలంకరించి వాని అనుమతితో పనిలేకుండగనే ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆప్రదేశం కూడా పవిత్రమవుతున్నది. శంఖం భగవస్వరూపం. కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది. ఈపవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమ దేవరలు గౌరవింపదగినవారు. ధాన్య సమృద్ధి కలుగునదీ ఈమాసమునందే. లక్ష్మీ స్వరూపాలైన గోవులని ఈమాసంలో పూజించడం ఆచారంగా వస్తున్నది. ముఖ్యంగా ఉత్తరద్వార దర్శన సమయంలో అనగా ముక్కోటి నాడు గోపూజ అత్యంత ప్రధానమైనది. కోరిక కోరికలను తీర్చేది గోపూజ.
ఈకాలంలో విష్ణుపూజ, దాన జపాదులు విశేషఫలప్రదం. గోదాదేవి ’మార్గశి’ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేళ ఇది. తిరుప్పావై పారాయణ ఈరోజు నుండి మొదలు. వైష్ణవ సంప్రదాయంలో విశేషించి ఈమాసానికి ప్రత్యేక ప్రాధాన్యం.


No comments:

Post a Comment