Saturday 23 April 2022

భ‌గ‌వ‌ద్గీత అస‌లు ఎందుకు చ‌ద‌వాలి?






నరుడి అభ్యున్నతికి నారాయణుడు బోధించిన జీవనసారం గీత. ఇక్కడ నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు. నరుడు.. ఆ రోజు ఒక్క అర్జునుడే! ఈ రోజు.. మనమంతా!


 మాయామోహితుడైన అర్జునుడిని ఉద్ధరించడానికి ఉపదేశించింది మాత్రమే కాదు, ప్రతి మనిషినీ మహోన్నతుడిగా తీర్చిదిద్దడానికి శ్రీకృష్ణుడు పూరించిన శంఖారావం ఇది. అర్జునుడిని శిష్యుడిగా ఎంచుకొని తాను ఆచార్యుడిగా ప్రామాణిక మానసిక వికాస సూత్రాలను అందించాడు. సంగ్రామ సమయంలో ఆవిర్భవించిన భగవానుడి గీత.. ఈనాటికీ జీవన సంగ్రామంలో పోరాడుతున్న అభినవ అర్జునులకు కర్తవ్య బోధ.


భగవద్గీత పుస్తకం తిరగేస్తున్నాను..’ అని ఎవరైనా అంటే.. ‘ఎందుకంత వైరాగ్యం’ అంటారు కొందరు. కానీ, గీత వైరాగ్యంలో కూరుకుపోయిన అర్జునుడిని కార్యోన్ముఖుణ్ని చేసిన అద్భుతం. కర్తవ్య నిర్వహణకు పురిగొల్పిన ఉత్ప్రేరకం. మూడుకాళ్ల ముదుసలి కాలక్షేపానికి చదివే పుస్తకం కాదు ఇది. నవ యవ్వనుడు చిత్తశుద్ధితో ఆచరించాల్సిన నియమావళి. 


ఆనాడు రాగద్వేషాలు అర్జునుడిని విచలితుణ్ని చేస్తే.. ఈ రోజు రకరకాల ఉద్రేకాలు యువతను కకావికలం చేస్తున్నాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో గీత సూటిగా చెప్పింది. జీవితంలో ప్రతిక్షణాన్ని ఉపయుక్తం చేసుకునే ఉపాయాలను ఉపదేశించింది. అన్ని దేశాలకూ, అన్ని కాలాలకూ గీతా సందేశం వర్తిస్తుంది. 


శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యాయంలోనే స్పష్టం చేశాడు....


 ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప’ క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని ఆదిలోనే హెచ్చరించాడు. ఈ హృదయమే అన్ని ఆలోచనలకూ, రాగద్వేషాలకు కేంద్రం. బుద్ధిస్థితిలో ఆలోచన ఉంటుంది. తర్కం పనిచేస్తుంది. హృదయం దగ్గరికి వచ్చేసరికి భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు వేయకుండా కళ్లెం వేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పాడు కృష్ణుడు. ఆ తర్వాతే అసలు బోధ ప్రారంభించాడు.


గీతోపదేశంలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి చెప్పలేదు. వాటిని ఎలా సంధించాలో వివరించలేదు. యుద్ధ వ్యూహాల చర్చను లేవనెత్తలేదు. శత్రువులను సంహరించే మెలకువలనూ నేర్పలేదు. ఈ విషయాలన్నిటిలో ఆరితేరిన సవ్యసాచి అర్జునుడు. మట్టిపట్టిన మాణిక్యాన్ని దులిపినట్టుగా, అర్జునుడిని ఆవహించిన మాయామోహాలను తన బోధతో తొలగించాడు.


క్రమశిక్షణే ఆయుధం..


వర్తమానం భవిష్యత్‌కు పునాది. యుక్తవయసులో చేసే సావాసాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అలవాట్లు పొరపాట్లుగా మారి జీవితాన్ని తీర్చిదిద్దుకోకుండా దెబ్బతీస్తాయి. బలం ఉంది కదా అని యవ్వనంలో కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించి జీవితం చేజారిపోయాక పశ్చాత్తాపం చెంది ప్రయోజనం లేదు. ఇదే విషయాన్ని గీతాచార్యుడు హెచ్చరిక చేశాడు. ఆశయ సాధనకు క్రమశిక్షణను మించిన ఆయుధం లేదని పేర్కొన్నాడు.


యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు

యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా (6-17)


సరైన ఆహార నియమాలు పాటించాలి. సరైన అలవాట్లు కలిగి ఉండాలి. ఆహార, వ్యవహారాల్లో మంచి, చెడులను గుర్తించిన వాడు దుఃఖం నుంచి దూరంగా ఉండగలుగుతాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఒక్కటే సరిపోదు, దానిని సాధించడానికి అహర్నిశలూ కృషి చేయాలి. ఆత్మసంయమ యోగంలో కృష్ణుడు చెప్పిన ఈ మాట సదా అనుసరణీయం.


నీ పని నువ్వే చేయాలి..


ఎవరో వస్తారని, ఇంకెవరో ఉద్ధరిస్తారని కర్తవ్యాన్ని విస్మరిస్తుంటారు చాలామంది. చిన్నాచితకా పనుల కోసం కూడా ఇతరులపై ఆధారపడుతూ ఉంటారు. అలాంటి సోమరులు ఎందుకూ కొరగాకుండా పోతారన్నాడు గీతాచార్యుడు. ‘నీ పని నువ్వు చేయడమే సరైనది’

అని సూచించాడు.


నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః

శరీరయాత్రాపి చతేన ప్రసిద్ధ్యేదకర్మణః (3-8)


‘నీకు నిర్దేశించిన కర్మలను నువ్వు చేయడమే సరైనది. దేనినీ చేయకపోవడం కన్నా నీ ధర్మాన్ని అనుసరించి పని చేయడమే ఉత్తమం. ఏ పనీ చేయకుండా ఉంటే శరీర నిర్వహణ కూడా ముందుకు కొనసాగదు’ అన్నాడు శ్రీకృష్ణుడు. కర్మ అంటే వృత్తి ధర్మం. అంటే పనిచేయడం. నేటి పోటీ ప్రపంచంలో అనుక్షణం మేటి అని నిరూపించుకోవాల్సిందే! బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన వారినే విజయం వరిస్తుంది.


పోరాడితే పోయేదేం లేదు..


పారిపోవడమా, పోరాడటమా ఇలాంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలో చాలాసార్లు ఎదురవుతాయి. పారిపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం. పోరాడితే అయితే విజయం దక్కుతుంది. ఓటమి ఎదురైతే జీవితానికి విలువైన పాఠం దొరుకుతుంది. పలాయనవాదం ఎప్పటికీ సరైనది అనిపించుకోదు. పోరాడితే పోయేదేం లేదని మనిషి వెన్నుతట్టే తారకమంత్రం గీతలో ఉపదేశించాడు శ్రీకృష్ణ భగవానుడు.


హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీమ్‌

తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః॥ (2-37)‘అర్జునా! యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. గెలిస్తే రాజ్యలక్ష్మి సిద్ధిస్తుంది. ఏదైనా ప్రయోజనమే, కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవ్వు’ అని పార్థుడిని పురిగొల్పాడు శ్రీకృష్ణుడు. జీవితంలో పోరాడే సమయంలో పారిపోతే సమస్యలు తప్ప సంతోషాలు ఉండవు. పోరాటాన్ని అలవాటుగా చేసుకోగలిగితే.. మరుక్షణంలో విజయం రాకపోవచ్చు! కానీ, పోరాట తత్వం లక్షణంగా మారుతుంది. తొలి ప్రయత్నంలో విఫలమైనా మరో ప్రయత్నంలో లక్ష్యం అందుకోవచ్చన్న నమ్మకం కలుగుతుంది.


తనను నమ్ముకున్న వాడిని ఉద్ధరించడానికి ప్రేమతో భగవంతుడు కురిపించిన జ్ఞాన వర్షం భగవద్గీత. ఆ అమృతధారలలో మొట్టమొదట తడిసి ముద్దయినవాడు అర్జునుడు. మాయామోహాల చెర నుంచి బయటపడిన పార్థుడు మళ్లీ గాండీవం ధరించాడు. సమరంలో మెరిశాడు. సవ్యసాచి అన్న పేరును సార్థకం చేసుకున్నాడు. విజయుడై ఖ్యాతి గడించాడు.


భగవద్గీత అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రం. గీత ప్రభవించిన మార్గశిర శుక్ల ఏకాదశి గీతా జయంతిగా నిర్వహించుకుంటున్నాం. భగవద్గీత పూజించడానికో, పఠించడానికో నిర్దేశించింది కాదు. గీతను పాటిస్తేనే జీవితానికి సమగ్రత చేకూరుతుంది. మనిషి సాటి మనిషిని అర్థం చేసుకోవడానికి, మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలన్నీ అందించిన గీతాచార్యుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం.


మాయతెరలు దాటి చూడు..


మనసు పొరల్లో దాచుకున్న విషయాలు, జ్ఞాపకాలు రాగద్వేషాలై అదే మనసును కప్పి ఉంచుతాయి. కొందరిని అతివిశ్వాసం దెబ్బతీస్తుంది. కొందరిని అపనమ్మకం వెనక్కి లాగుతుంది. రకరకాల కోరికలు మనసును బంధించేస్తాయి. మనిషి ఉన్నతికి అడ్డుపడే వికారాలు కలిగిస్తుంటాయి. వాటిని గుర్తించి జయించినప్పుడే జ్ఞానం వికసిస్తుంది. విజయం సాకారం అవుతుంది.


‘ధూమేనావ్రియతే వహ్నిః యథాధర్శో మలేన చ

యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతమ్‌ (3-38)


పొగతో నిప్పు, దుమ్ముతో అద్దం, ఉల్బంతో గర్భస్థ శిశువూ కప్పబడి ఉన్నట్లుగా జ్ఞానం మాయతో కప్పేసి ఉంటుంది. అద్దం మురికి పడితే తన ప్రకాశాన్ని కోల్పోతుంది. మనసు కూడా అలాంటిదే! ఆకర్షణలనే మాయపొరలు మనసును కమ్మితే కర్తవ్యాన్ని విస్మరిస్తాం. ఏది మంచి, ఏది చెడు అని విచక్షణతో ఆలోచిస్తే బుద్ధి వికసిస్తుంది. భవిష్యత్తు బాగుపడుతుంది.


గీతోపదేశం అంతా అయిన తర్వాత ‘అర్జునా! పరమ రహస్యమైన జ్ఞానం బోధించాను. నిన్ను ఆవరించిన శోకం, మోహం తొలగిపోయిందాt ఈ జ్ఞానాన్ని సమగ్రంగా పరిశీలించి, నీకు ఇష్టమైన విధంగా ప్రవర్తించమ’ని చెప్పాడు. చెప్పడం వరకే ఆయన పని, చెప్పింది శ్రద్ధగా విన్నాడు.

విన్నది అర్థం చేసుకున్నాడు, అర్థమైన దాన్ని అర్థవంతంగా ఆచరించి తన కర్తవ్యాన్ని

నిర్వర్తించాడు అర్జునుడు.

జై శ్రీమన్నారాయణ





.........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............

No comments:

Post a Comment