Thursday 7 December 2017

కలి అనగా నేమి ? కలియుగంలో ఏమి జరుగుతుంది?




ఒకసారి పాండవులంతా ( ఆ సమయంలోఅక్కడ ధర్మరాజు లేడు) కలసి కృష్ణుని సమీపించి " కలియుగం అంటే ఏమిటి? కలి యుగంలో ఏమి జరుగబోతుంది " అని అడిగారు.
దానికి శ్రీ కృష్ణుడు " నేను చెప్పను, మీరే తెలుసుకోండి అని " చెప్పి నాలుగు బాణాలు తీసుకుని నాలుగు దిక్కుల్లో వదలి, నలుగురిలో ఒక్కొక్కరు ఒక్కోదిక్కు వెళ్లి,తాను వదిలిన బాణాలను తెమ్మని చెప్పి పంపించాడు..
అర్జునుడు తూర్పు దిక్కుగా వెళ్లి, అక్కడ పడిన బాణాన్ని తీస్తుండగా మధురమైన స్వరం ఒకటి వినిపించింది. చూస్తే ఒక చెట్టుకొమ్మపై కోకిల కూర్చుని మధురాతి మదురంగా గానం చేస్తూంది. కానీ అది తన కాళ్ల క్రింద ఎలుకనొకదాన్ని పట్టుకుని తినడానికి సిద్దంగా ఉండడం కూడా చూసి " ఇదేమి వింత..!" అనుకుని వెనుకకు వచ్చేసాడు...
భీముడు ఉత్తర దిక్కుగా వెళ్లగా, అక్కడ పడిన బాణం పడే చోట ఐదు బావులు కన్పించాయి. వాటిలో ఒకటి చిన్నదిగా ఉండి పూర్తిగా ఎండిపోయి ఉంది.దానీ చుట్టూ ఉన్న నాలుగు
బావులు పూర్తిగా నిండిపొయి చాలదా అన్నట్లు వాటిలో నీరు భయటకు పొర్లుపోతుంది. ఈ సంఘటన చూసిన భీముడు ఏమీ అర్ధంకాక బాణం తీసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు...
మూడవ వాడైన నకులుడు పడమట దిశగా వెళ్లి బాణంతో తిరిగి వస్తుండగా దగ్గరలోఒక ఆవు అపుడే జన్మనిచ్చిన దూడను తన నాలుకతో తుడుస్తుండడం చూసాడు. ఆ ఆవు , దూడ శరీరమంతా తుడుస్తూ ఉండగా కొందరు మనుషులు బలవంతంగా అతి కష్టంమీద ఆ ఆవునుండి దూడను వేరుచేయడం జరిగింది. ఈ పెనుగులాటలో దూడ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన చూసిన నకులుడు మనసులో కొంచెం బాధ పడ్డాడు. చేసేదేమీ లేక వెనుకకు వచ్చేసాడు...
చివరివాడైన సహదేవుడు దక్షిణ దిశగా పోయి బాణం తీస్తుండగా పక్కనున్న కొండపైనుండి పెద్ద బండరాయి ఒకటి రాళ్లను పిండి చేస్తూ, చెట్లను విరచుకుంటూ వేగంగా దొర్లుతూ రావడం చూసాడు. అది అట్లా దొర్లుకుంటూ పెద్ద పెద్ద వృక్షాలను విరిచేస్తూ చివరికి ఒక చిన్న మొక్క దగ్గరకొచ్చి ఆగిపోయంది. సహదేవునికి మర్మం అర్దంకాక తిరిగివచ్చేసాడు...
నలుగురు కృష్ణుని వద్దకు వచ్చి తాము చూసిన సంఘటనలను వివరించి వాటియందలి అర్దాన్ని తెలుపవలసిందిగా కోరారు...
అపుడు కృష్ణుడు మందహాసంతో " కలియుగంనందు మానవులు తాము గొప్ప పండితులమని మాకు సాటి ఎవరూ లేరనే అహంకారంతో కోకిలకూత వలే నీతులు చెపుంట్తారు. కానీ చేసేవి మాత్రం నీచమైన పనులు. వీరు జీవితమంతా అజ్ఞనపు చీకటిలో ఉండి పూజకు పనికి రాని పువ్వు వలే బ్రతకాల్సి వస్తుంది. ఇదే అర్జునుడు చూసిన సంఘటనలోని అర్దం."
" ఇక రెండవది.. కలియుగంనందు చాలా మంది వద్ద పుష్కలంగా ధనం ఉన్నప్పటికీ వ్యర్థపరమైన ఖర్చులు పెడుతుంటారు తప్ప తమ మద్యనే ఉంటూ కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న తోటి మానవులకు పైసా కూడా ఇవ్వరు. వీరు దనంతో సుఖాలను అనుభవిస్తున్నామనుకుంటుంటారు ..కానీ శవాలతో సహవాసం చేస్తుంటారు. ఇదే భీముడు చూసినదాంట్లోఅంతరార్దం."
" ఇంకా మూడవది... కలియుగంలోతల్లిదండ్రులు (ఆవు తన దూడ పై చూపించిన అతి ప్రేమ వలే )తమ సంతానంపై మితిమీరిన ప్రేమ చూపిస్తుంటారు. నిజానికి ఈ అతి వలనే వారు చెడు త్రోవ లో పోయి జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. వీరివలన సమాజం చైతన్యం కోల్పోతుంది.. నకులుడు చూసిన సంఘటనలో అంతరార్దం."
" ఇక చివరిగా కలియుగ మానవులు తమ ప్రవర్తన తీరుతెన్నులు సరిగా లేక, జీవిత పరమార్థం, మానవ జన్మ ఆవశ్యకత తెలుసుకోలేక కొండపైనుండి దొర్లి పడిపోయిన బండవలే దారీ తెన్నూ లేక నానా చిక్కుల్లో చిక్కుకుంటూ అశాంతిని అనుభవిస్తుంటారు.ఈ క్రమంలో తోటివారిని కూడా నానా అవస్థలకు గురి చేస్తుంటారు..
అయితే అలా దొర్లుతూ చివరికి భగవంతుని చెంతకు వచ్చేటప్పటికి అశాంతి అంతా పోయి పరమ శాంతిని పొందుతుంటాడు. ఇదే సహదేవుడు చూసిన సంఘటనలోని భావం." అని కృష్ణుడు బోదించాడు...

No comments:

Post a Comment