Friday 7 April 2017

అనంగత్రయోదశి



అనంగత్రయోదశి భార్యాభర్తలమధ్య అన్యోనయతారాగాలను వృద్ధి చేయడంతో పాటు దాంపత్యజీవనాన్ని సుఖమయం చేసే పవిత్ర పర్వదినం ..

చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి – ఈ అనంగ త్రయోదశి. దీనికే మదన త్రయోదశి, కామదేవత్రయోదశి అని కూడా పేర్లు. ప్రేమాధిదేవత లేక కామదేవుడు అయిన మన్మథుడి పూజకు కేటాయించిన పర్వదినం అనంగ త్రయోదశి. శాస్త్ర గ్రంథాలలో ’దమనేన అనంగపూజ’ అని చెప్పడాన్ని బట్టి ఈ రోజు అనంగుడు లేదా మన్మథుడిని దవనంతో పూజించాలనీ ఈ రోజు మన్మథుడి పూజకు ఉత్కృష్టమైన రోజు అని స్పష్టమవుతూ ఉంది. మన్మథుడిని గురించి పురాణాలలో అనేక రకాలైన గాథలు కనిపిస్తాయి.


మన్మథుడు ’కామదేవుడు’ ’ప్రేమదేవత’ సౌందర్యరాశి. మన్మథుడి వాహనం చిలుక! అరవిందాది పుష్పములే మన్మథుడి బాణాలు. అట్టి మన్మథుడు సృష్టి ప్రారంభంలో సృష్టికర్త బ్రహ్మదేవుడి హృదయం నుండి జన్మించాడు. మరీచాది మహర్షులు అతనికి ’మన్మథుడు’ అని నామకరణం చేశారు. మన్మథుడి భార్య రతీదేవి. మన్మథుడు సృష్టికర్తను కూడా వదలలేదు. మన్మథుడు మొదట తన బాణములను బ్రహ్మదేవుడి మీదనే ప్రయోగించాడు. దీనితో బ్రహ్మదేవుడు వికార చిత్తుడయ్యాడు.

 
 చివరకు బ్రహ్మదేవుడు కోపోద్రిక్తుడై ’భస్మమై శరీరం లేనివాడు’గా అయ్యేటట్లు మన్మథుడిని శపించాడు.
కాగా, మరో గాథ ప్రకారం స్థితికారకుడైన శ్రీమహావిష్ణువు కుమారుడు మన్మథుడు. పూర్వం ఒకసారి శ్రీమన్నారాయణుడు సంతానంకోసం శివుడిని ప్రార్థించాడు. శివుడి అనుగ్రహం వల్ల విష్ణుమూర్తికి మన్మథుడు కుమారుడుగా జన్మించాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలిసింది. విష్ణుమూర్తి కేవలం తనభర్త అయిన శివుడినే ప్రార్థించి తనను విస్మరించడంతో కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి శివుడి వరంవల్ల విష్ణువుకు జన్మించిన వాడు శివుని వల్లనే భస్మమైపోవుగాక” అని శపించింది.


ఈవిషయం విష్ణువుకు తెలిసి పార్వతీదేవిని ప్రార్థించాడు. ప్రసన్నురాలైన పార్వతీదేవి శాపాన్ని ఉపసంహరించడం కుదరదు అని చెప్పి భస్మమైన మన్మథుడు తిరిగి జీవించేటట్లు వరం ప్రసాదించింది.


అనంతరం కొంతకాలానికి తారకాసురుడు అనే రాక్షసుడివల్ల కష్టాలపాలైన దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా ’శివుడి కుమారుడు తారకాసురుణ్ణి సంహరించగలడు” అని సలహా యిచ్చాడు.
అప్పటికి శివుడు తపస్సులో మునిగివున్నాడు. శివుడు తపస్సు మాని పార్వతీ దేవిని వివాహం చేసుకునేలా చేయమని ఇంద్రుడు మన్మథుడికి చెప్పాడు.


దీనితో మన్మథుడు తపస్సు చేస్తున్న శివుడిపై బాణం వేశాడు. శివుడి మనస్సు చలించింది. “తనను చలింపజేసింది ఎవరా?” అని శివుడు మూడవనేత్రాన్ని తెరిచాడు. ఫలితంగా మన్మథుడు భస్మమై ’అనంగుడు’ అయ్యాడు. ఈ విషయం రతీదేవికి తెలిసి తీవ్ర దుఃఖానికి లోనైంది. శివుణ్ణి ప్రార్థించింది. రతీదేవి ప్రార్థనలను విని ప్రసన్నుడైన శివుడు, మన్మథుడు రతీదేవికి మాత్రమ్ఏ కనిపించేటట్లు వరం ప్రసాదించాడు. రతీమన్మథులు ఇద్దరూ అన్యోన్యతానురాగాలున్న దంపతులు. అట్టివారిని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది.

మన్మథుడి చిత్రపటాన్ని గానీ, పసుపుతో చేసుకున్న ప్రతిమను గానీ మందిరంలో ఉంచి
నమోస్తు పుష్పబాణాయ జగదాహ్లాదకారిణే!
మన్మథాయ జగన్నేత్రే రతిప్రీతి ప్రియాయతే!!
అనే శ్లోకాన్ని పఠించి మన్మథుని ఆవాహన చేసుకొనవలెను. వివిధ పుష్పాలతో పాటు ’దవనం’తో పూజించి నైవేద్యాన్ని సమర్పించవలెను. ఈవిధంగా అనంగత్రయోదశినాడు మన్మథుని పూజించడం వల్ల దంపతుల జీవితం సుఖమయమవుతుంది.


అనంగ త్రయోదశి రోజు తెల్లవారు ఝామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి నిత్య పూజా విధులను పూర్తిచేసి మన్మథుడిని పూజించాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది.

No comments:

Post a Comment