Sunday 29 May 2016

                                             గాయత్రి మంత్ర విశిష్టత



గాయత్రీం వరదాం దేవీ - సావిత్రీం వేదమాతరం
ఆదిత్య పధగాం దేవీం-స్మరేద్ర్బహ్మ స్వరూపిణీం
మంత్రాధి దేవత, శ్రీ గాయత్రీ మాత మంత్రం ఉపదేశ ప్రధానమైనది. వేదాధ్యయనం చేయలేకపోయినా, యజ్ఞయాగాదులు నిర్వహించలేకపోయినా, పాపప్రక్షాళనం చేసి, శాంతిని, ప్రశాంతిని ప్రసాదించేది గాయత్రీ మంత్రానుష్ఠానం. ప్రతిరోజూ చేయవలసిన షట్కర్మలలో గాయత్రీ మంత్రానుష్ఠానం ప్రధానమైనది. సూతసంహితలో వ్యాసభగవానులు శ్రీ గాయత్రీ మంత్ర మహిమ, శక్తి సమగ్రంగా వివరించారు.గాయత్రీ మంత్రంలోని మూడు పాదాలలో, మొదటి పాదం "బీజం".రెండవది "శక్తి". మూడవది "కీలకం".
మనిషికి ఏ దేవతారూపం పైనైనా ఇష్టం కలుగవచ్చు. ఏ మంత్రానుష్ఠానం పైనైనా ఆసక్తి కలుగవచ్చు. కానీ మంత్రాది దేవత, శ్రీ గాయత్రీ స్వరూపంపై రక్తి, మహామంత్రంపై అనురక్తి కలగటం జన్మాంతర సుకృతం. ఆత్మతత్వ జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించే గాయత్రిని శ్రుతులు "వరదా" అని "ఛన్దసాం మాత" అని ప్రస్తుతించాయి.విష్ణ్వాది దేవతలు, ఈ తల్లికి అంగప్రత్యంగాలు.
దుర్లభమైన మానవజన్మ, అందునా కొద్దోగొప్పో ఆధ్యాత్మిక చింతన కలిగిన జన్మ లభించినందుకు ఎంతో సంతోషించాలి. ఉత్తమ జన్మని అనుగ్రహించిన పరమాత్మకు కృతజ్ఞులమై ఉండాలి. మన జీవనక్రమం క్రమబద్దంగా ఉండాలంటే, నిత్యానుష్ఠాన కార్యక్రమాన్ని, క్రమం తప్పక ఆచరించాలి. బ్రహ్మానందానుభూతికి దేహశుద్ధి, మానసిక శుద్ఢి, చిత్తశుద్ది, ఆత్మశుద్ధి ముఖ్యం. ఇవి సాధించి, జీవనప్రయాణంలో సాధ్యమైనంత ఎక్కువ సమయం దైవచింతనకి, దైవప్రార్థనకి దైవకార్యాలకి సదుపయోగం చేయటం మన ధర్మం.
అభీష్ట వరప్రదాత్రి, సర్వాక్షర స్వరూపిణి, సంధ్యానుష్ఠాన జ్ఞానరూపిణి, గాయత్రీ మాత సర్వులకు, సర్వావస్థలందు, సర్వాకాలాదులందు శరణ్యం. అంతరంగ హృదయాలయంలో,ఉపవిష్ణురాలైన తల్లిని, అంతర్ దృష్టితో చూసి,అర్చించి, ఆరాధించి, ధ్యానించి అనుగ్రహం అపేక్షించాలి. వర్తమానకాలంలోని కృత్రిమ జీవనం నుంచి కొంతవరకైనా మనిషి, మనసు మరల్చి ఋషి జీవనం వైపు పయనించాలి. అప్పుడే మనసు నిర్మలమై, బుద్ధి వికసించి, పారమార్థికత్వం యొక్క నిజమైన విలువలు తెలుసుకోగలడు. పారమార్ధిక జీవితం తేలికగా లభించదు. సంపద కూడబెట్టడానికి మనిషి ఎంతో శ్రమపడతాడు. అట్లాగే ఆధ్యాత్మిక సంపద కూర్చుకోవటానికి, కొన్ని జీవితకాలాల శ్రమ పడాల్సి వస్తుంది. ఆ శ్రమ, ధర్మమార్గాన కర్మాచరణ వల్ల, ఈశ్వరోపాసన వల్ల వస్తుంది.చిఛ్చక్తి స్వరూపిణి, వేదమాత, గాయత్రీ ఉపాసన వల్ల ఫలసిద్ది త్వరగా లభిస్తుంది. ఎందుకంటే అందరు దేవతల శక్తులూ వేదమాతలో అంతర్గతంగా నిబిడీకృతమై ఉన్నాయి.
మనిషిలోని సనాతన చైతన్యస్వరూపమే ఆత్మ. అదే బ్రహ్మము. బ్రహ్మస్థానాన్ని తెలియపరచే మార్గం జ్ఞాన మార్గం. అవిద్యలను సగుణ విద్యలంటారు. గాయత్రి సగుణ, నిర్గుణ విద్యల సమన్వయ స్వరూపమై కర్మ, ఉపాసన, జ్ఞాన, తపో, యాగాల నిధియై, ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకోవటానికి సోపానమైనది. మనిషిని క్రియాశీలునిగా, వివేకవంతునిగా, సత్పురుషునిగా, తపశ్శీలునిగా, నిస్వార్థపరునిగా, సేవా పరాయణునిగా చేయగల శక్తి గాయత్రిది. అంతేకాదు గాయత్రి ఉపాసన వల్ల నిజంగా మనిషిలో దయ, కార్యదీక్ష, త్యాగం, సమదృష్టి , దానగుణం, ఇంకా ఎన్నో సద్గుణాలు కనపడతాయి.

మనసు రెండు విధాలుగా ఉంటుంది. ప్రత్యేక చేతన, పరంగ చేతన, ప్రత్యేక చేతన యందు మనస్సు జాగృతమార్గంలోకి కానీ , దాని వైపునకు కానీ మరల్చబడుతుంది. పరంగ చేతనయందు బయటకుకానీ, వేరుమార్గంలో కానీ పయనిస్తుంది. అంతర్గతమైన మనస్సు జాగృతమై, ఆత్మ సాక్షాత్కారమై, నిత్య జ్ఞానానంద స్వరూపుడైన పరమాత్మని తెలుసుకోగలం. ప్రత్యేక చేతనా మార్గంవైపు మనసును మళ్లించు శక్తి కలది గాయత్రి.
మంత్రాలు మూడు విధాలని చెబుతారు. పది అక్షరాల వరకు కలవి "బీజమంత్రాలు". ఇవి బాల్యంలో సిద్దిస్తాయి. ఇరవై అక్షరాలు కలవి "తథా మంత్రాలు" ఇవి యవ్వనంలో సిద్దిస్తాయి. ఇరవై దాటి అక్షరాలు కలవి "మాలా మంత్రాలు".ఇవి వార్దాక్యంలో సిద్దిస్తాయి. ఇంకా మంత్రాలు మూడు విధాలు.వైదికాలు, తాంత్రికాలు, అపభ్రంశముల్. "వైదికాలు" వేదోక్తాలు, జ్ఞానప్రధానాలు."తాంత్రికాలు" కామ్యప్రధానాలు. "అపభ్రంశములు" సంస్కృతం నుండి దేశభాషలలోకి వాడుకగా వచ్చినవి. మంత్రం "నమః"అంతం కలది నపుంసక మంత్రం అని, "స్వాహా" అంతం కలది స్త్రీ మంత్రమని, "హాంఫట్" చివర కలిగినది పుంసక మంత్రం అని ప్రసిద్ధి. అంతేకాదు ఏకాక్షర మంత్రాలను పిండములని, మూడు అక్షరాలు కలిగినవి కర్తరులని, నాలుగు నుండి తొమ్మిది అక్షరాల మంత్రాలు బీజములని, పది నుండి ఇరవై అక్షరాలుకల మంత్రాలను మాలా మంత్రాలనీ అంటారు. ఇంకా ఆగమములు, నిగమములు అని కూడా భేదం ఉంది. ఆగమములంటే ’ఆ’ శివముఖం నుండి వచ్చి ’గ’ పార్వతి ముఖమున ప్రవేశించునవి. నిగమము అంటే ’ని’ నిశ్చిత రూపములై ’గమ’ బ్రహ్మము నుండి తెలియబడిన వైదిక మంత్రాలు. ఈ నిబంధనలకన్నింటికీ అతీతము గాయత్రీ మంత్రం. ఏ స్థితిలోనైనా, ఏ అవస్థలోనైనా, నిశ్చల మనస్సుతో ఉపాసిస్తే ఫలసిద్ధి తథ్యం. మంత్రాలలో శైవ మంత్రాలు కోటి, సౌరమంత్రాలు రెండు కోట్లు, గణేశ మంత్రాలు 50 లక్షలు, వైష్ణవ మంత్రాలు 50 లక్షలు, శక్తి మంత్రాలు 3 కోట్లు. మంత్రాలకు ఆదిమంత్రమైన గాయత్రీ మహామంత్రానికి, ఈ సప్తకోటి మహామంత్రాలు ఆభరణాలు. పరమాత్మ నామమే అత్యద్భుత శక్తి కలది. ఆ నామానికి బీజాక్షరాలు చేర్చి జపిస్తే కలిగే స్పందన పరమాద్భుతం. అభ్యాసంతో జపానికి మనసే మాల అయి దివ్యానుభూతి పొందవచ్చు.
"పటలం పద్దతి ర్వర్శ తథా నామ సహస్రకం
స్తోత్రాణి చేతి పంచాంగం దేవతారాధనే స్మృతం"
ఇది మంత్రారాధన పంచకాన్ని తెలియజెప్పే శ్లోకం.
"కవచం దేవతాగాత్రం పటలం దేవతా శిరః
పద్దతిర్దేవసస్తౌతు ముఖ సాహస్తకం స్మృతం"
పటలం, పద్దతి, కవచం, సహస్రనామం, స్తోత్రాలు దేవతారాధనకు ముఖ్యమైనవి. వీనిలో కవచం దేవతకు శరీరం; పటలం-శిరస్సు;పద్దతి-హస్తాలు;సహస్రనామం-ముఖం;వీటిని క్రమం తప్పక అనుష్టిస్తే మంత్రసిద్ది తథ్యం.
సూర్యారాధన ఫలితంగా ఆరోగ్యం, క్షేమం, మోక్షం, సత్సంతానం సిద్దిస్తాయి. మహాదేవుని ఆరాధిస్తే యోగం, జ్ఞానం, కీర్తి, లభిస్తాయి. విష్ణువు ధర్మార్థ కామ మోక్ష ప్రదాత. సర్వకామ్యాల్ని, ముక్తిని అనుగ్రహించేది దుర్గ. గణేశుని ఆరాధన వల్ల కర్మసిద్ది, విఘ్న నివారణ కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపం, ఈ పంచాయతన దేవతలు అనుగ్రహించు సర్వఫలములు ప్రసాదించును.
సాధారణంగా మనిషి నిముషానికి 15 సార్లు శ్వాసిస్తాడు. ఉచ్చ్వాస, నిశ్వాసలు కలిపి 1 శ్వాస. అయితే నిముషానికి మూడుసార్లు శ్వాసించగలిగితే మనిషి చిరంజీవి అవుతాడు. ఇది సాధన వల్ల మాత్రమే సాధ్యం. ఆ యోగమే ప్రాణాయామం. సాధకుడు గాయత్రీ మంత్ర ధ్యానంతో, కుండలినీ శక్తిని సుషుమ్నను దాటించి, శరీరమందలి మూలాధార, స్వాధిష్టాన మణిపూరక, అనాహత, విశుద్ఢ, ఆజ్ఞాచక్రాలను అధిగమించి, సహస్రారమందలి పరమాత్మను చేరటమే ముక్తి. ప్రాణాయామం సర్వశ్రేష్ఠమైన యోగసాధన. ఇది రెండు విధాలు. వైదిక ప్రాణాయామం. యౌగిక ప్రాణాయామం. గాయత్రీ మంత్రానుష్ఠానం వైదిక ప్రాణాయామం.
"సవ్యాహృతిం, సప్రణవం, గాయత్రీం శిరసాసహ
త్రిః పఠేదాయత ప్రాణః ప్రాణాయామ స్స ఉచ్చతే"
ప్రాణములను నిరోధించి, వ్యాహృతితో, ప్రణవంతో, శిరోమంత్ర సహితంగా మూడుసార్లు చేసే గాయత్రీ మంత్రోపాసనే ప్రాణాయామం.
గాయత్రీ యోగంలో జపయోగం, మంత్రయోగం, మాహాయోగం కలిసి ఉంటాయి. ప్రాణాయామ ప్రక్రియ ద్వారా, గాయత్రీ మంత్రోపాసనతో రాజయోగానుభూతి లభించి, అణిమాధి సిద్ధులు లభిస్తాయి. అవి
అణిమ - శరీరం అణుత్వం పొందటం
మహిమ - శరీరం యోజనం వరకు వ్యాపించటం
లఘిమ - శరీరం తేలికగా అగుట
గరిమ - భూమిపై నుండే చంద్రుని వేలితో తాకుట
ప్రాప్తి - ఇంద్రియ శక్తులు లభించుట
ప్రాకామ్యం - అంతటా స్వేచ్చగా తిరగగలగటం
ఈశిత - భూమి మీద, నీటిలోలాగా మునగటం
వశిత్వం - భూత, భౌతిక గుణాలను వశపరచుకోవటం.
ఇవే కాక సంకల్పించినవి ఖచ్చితంగా జరిగే శక్తి గాయత్రీ మంత్రం వల్ల సిద్ధిస్తుంది. సర్వతత్వ సంపూర్ణమైన గాయత్రీ మంత్రం శివశక్తి స్వరూపం. మానసికమైనది జప గాయత్రీ. మానసికావస్థను అధిగమించినది అజప గాయత్రి. ఈ స్థితిలో సంయమనం. జీవాత్మ పరమాత్మల ఐక్యత సిద్దిస్తుంది.
జీవాత్మ స్వస్థలం పరమాత్మ నిలయం. గాయత్రీ మంత్రశక్తి వల్ల, ప్రారబ్దకర్మను అనుభవించి, ఆగామి కర్మలను నిరోధించి, వాసనాక్షయం సాధించి మోక్షం పొందవచ్చు. అదే జన్మరాహిత్యం. కైవల్య సాధనకు,దేహాత్మల నిర్మలత్వం, అలౌకిక క్రమశిక్షణ, ధ్యానరక్షణ, దైనందిన చర్యలను ఈశ్వరార్పణగా ఆచరించటం, బ్రహ్మచర్యం ముఖ్యం. బ్రహ్మచర్యం అంటే నిరంతరం, సర్వకాల సర్వావస్థలందు, బ్రహ్మమునందు అనన్యభక్తితో, అనురక్తితో జీవించటం. ఆధ్యాత్మిక ధారణ పొందిన జీవాత్మ, సంకల్పంతో వేదమాత సాక్షాత్కారం పొందటం పరోక్షానుభూతి. తనయందే గాయత్రీ సాక్షాత్కారాన్ని పొందటం అపరోక్షానుభూతి. గాయత్రీ సాధన ’రహసి’ అంటే గుప్తంగా ఉంచవలసినది. మంత్రంలోని ప్రతి అక్షరంలో, ప్రతి స్థానంలో మహా రహస్యం ఇమిడి ఉంది.
పరమాత్మ శక్తికే ’ఛందస్సు’ అని పేరు. సాధకుని మృత్యువు నుండి కాపాడేది ఛందస్సులు. ప్రణవం, భూః, భువః, సువః, గాయత్రీ మంత్రం - ఇవి పంచ మహా యజ్ఞాలు. అంటే దేవ, ఋషి, పితృ, భూత, మనుష్య యజ్ఞాలు. ప్రణవ వ్యాహృతి త్రయ గాయత్రీ మంత్రోపాసన పంచ సూనముల నుండి కాపాడును.
"హంస" మంత్రాన్ని జపించేటప్పుడు, బయట అంతటా నిండి ఉన్న తేజస్సు. ‘హ’ కార స్వరూపమని, లోపల ఉన్న తేజస్సు ’స’ కార స్వరూపమని భావించాలి. అదే ధ్యానం. ‘హకారం’ శివ స్వరూపమైతే, ‘సకారం’ శక్తి స్వరూపం. స్వయం ప్రకాశాత్మకం, సర్వశక్తి సమన్వితం అయిన బ్రహ్మము నుండి మాయ జనించింది. అందుండి పంచభూతాలు, జీవరాశి పుట్టాయి. బ్రహ్మస్వరూపమైన ఆత్మ మాయచే కప్పబడి జీవుడనుబడుచున్నాడు. 24తత్వాలు శరీరం కలిగిన జీవుడు, వేదమంత్రమైన గాయత్రీ మంత్రాన్ని ఉపాసించిన పరమాత్మైక్యాన్ని సాధించగలడు.
మోక్షప్రాప్తికి సాధనం విద్య, విద్య అంటే బ్రహ్మ విద్య. గాయత్రీ విద్య. సంధ్యా విద్య.గాయత్రీ విద్యనుండే సకల విద్యలూ ఉధ్బవించాయి. సప్తస్వరాలు ఆవిర్భవించాయి. గాయత్రీ మంత్రం యొక్క గొప్పతనాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మంత్ర రాజప్రస్థావన లేకుండా ఏ పూజ కానీ,యజ్ఞం కానీ, యాగం కానీ జరుగవు. ఋషులు, సిద్ధపురుషులు యోగం వల్ల సాధించిన మహత్కార్యాలను, గాయత్రీ సాధకులు తేలికగా పొందగలరు. గాయత్రీ మంత్రంలోని విద్యుత్ ప్రవాహం వంటి తేజస్సే ఆత్మతేజస్సు. ఆ తేజస్సును ధ్యానిస్తే, సమస్తమైన ప్రాపంచిక వాసనలు నశించి, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. వేదాల్లోని ప్రతి ఒక్క మంత్రం అనంతమైన శక్తిని కలిగి ఉన్నాయి. వేదాలు శబ్ద బ్రహ్మగా మూర్తీభవించగా, ప్రజ్వరిల్లిన శబ్దశక్తియే గాయత్రీ బీజశక్తి, మన ఋషులు, తపస్సంపన్నులు, ముందుతరాల వారిపై అనుగ్రహంతో ప్రసాదించిన దివ్యశక్తియే గాయత్రీ మంత్రరాజం. గాయత్రీ చిచ్చక్తి స్వరూపిణి. చిచ్చక్తి అంటే చిత్+శక్తి. ’చిత్’ అంటే బుద్ధివికాసం, సమిష్టి భగవద్రూపమైన చిఛ్చక్తి, విశ్వంలోని చైతన్యం.
గాయత్రీ మంత్రంలోని నాలుగు పాదాలు వేదాల నుండి గ్రహింపబడినవని చెప్పుకున్నాం. మొదటి పాదంలో ఋగ్వేదంలో చెప్పబడిన శుభప్రాప్తి, ఈశ్వరప్రాప్తి, జ్ఞానం, ఆత్మశాంతి, ధర్మనిరతి, కర్తవ్యపాలన, ప్రేమ, దయ, సేవ, ఉపకారత్వం మొదలైన ఫలితాలు అంతర్గతమై ఉన్నాయి. రెండవ పాదంలో యజుర్వేదంలో చెప్పబడిన వీరత్వం, రక్షణ, కీర్తి, నేతృత్వం ఇమిడి ఉన్నాయి. మూడవ పాదంలో సామవేదంలో చెప్పబడిన మనోవికాసం, ఆనందం, సంగీతం, సాహిత్య కళలు, తృప్తి, వినోదాలనిచ్చు శక్తి ఇమిడి ఉన్నాయి. ఇక నాల్గవ పాదంలో అధర్వణ వేదంలో పేర్కొనబడిన ధన ధాన్య వైభవం, గృహములు, అన్న వస్త్రాదులు, వస్తు వాహనాలు, సుఖ జీవన సాధనాలు నిక్షిప్తమై ఉన్నాయి.
సత్వ, రజో, తమో గుణ సమన్విత గాయత్రి, మానసిక శక్తి, ఆత్మశక్తి, పారమార్ధిక శక్తి ప్రసాదించు ఆదిశక్తి. మొదటిపాదం "హ్రీం" రూపిణి - జ్ఞాన విజ్ఞాన ధాత్రి సరస్వతి. రెండవ పాదం ’శ్రీం’ రూపిణి - లక్ష్మీప్రదం. మూడవపాదం క్లీం రూపిణి - శక్తిప్రదాత్రి కాళి. గాయత్రీ మంత్రోపాసన మూఢవిశ్వాసం కాదు. వైజ్ఞానికం. ఈ మంత్ర సాధన ద్వారా శరీరంలో సర్వశక్తులు జాగృతమై, దుర్భలత తొలగి, ఆరోగ్య సిద్ధి, తద్వారా పరమ శాంతి లభిస్తుంది.

No comments:

Post a Comment