Sunday 30 September 2018

శివుడి ఆత్మలింగం భూమిపై వెలసిన "మురుడేశ్వర"..!



రావణుడు పరమశివుడు ప్రసాదించిన ఆత్మలింగంపై నున్న వస్త్రాన్ని విసిరివేయగా, ఆ వస్త్రం పడిన ప్రాంతమే "మురుడేశ్వర"గా అవతరించింది. ఈ మురుడేశ్వర కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోగల భట్కల్ తాలూకాలో ఒక పట్టణం. శివుడి పుణ్యక్షేత్రమైన ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన శివుడి విగ్రహం కొలువైయున్న ఈ పట్టణంలో పరమశివుడు "మురుడేశ్వరుడు"గా నిత్యపూజలందుకుంటున్నాడు.

పురాణాల ప్రకారం మురుడేశ్వర చరిత్రను చూస్తే.. రావణాసురుడు అకుంఠిత దీక్షతో తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి, ఆయన ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకువస్తాడు. భూమిమీద ఆత్మలింగాన్ని ఎక్కడయితే ఉంచుతారో, అక్కడ అది స్థాపితం అయిపోతుందనీ, తిరిగీ దాన్ని ఎత్తుకోవటం సాధ్యంకాదని.. పరమశివుడు ఆత్మలింగం ఇచ్చేటప్పుడే రావణాసురుడికి ఒక నిబంధన పెడతాడు.

అయితే రావణుడు పరమశివుడి ఆత్మలింగాన్ని గనుక లంకలో ప్రతిష్టించితే నష్టం జరుగుతుందని భావించి దేవాధిదేవతలు మహావిష్ణువును వేడుకొంటారు. దాంతో విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లుగా చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయ్యిందని భావించి సంధ్య వార్చుకునేందుకు సిద్ధపడతాడు.

ఈలోగా విషయం తెలుసుకున్న నారద మునీంద్రుడు వినాయకుడి వద్దకు వచ్చి, రావణాసురుడివద్దనున్న ఆత్మలింగం తీసుకుని భూమిపై పెట్టాలని నూరిపోసి పంపిస్తాడు. రావణుడు సంధ్యవార్చుకునే సమయానికల్లా బ్రాహ్మణవేషంలో వెళతాడు వినాయకుడు. ఆ బ్రాహ్మణ బాలుడిని చూసిన రావణుడు సంధ్య వార్చుకునేంతదాకా ఆత్మలింగాన్ని పట్టుకోవాల్సిందిగా కోరతాడు. ఈ లింగం చాలా బరువుగా ఉంటే తాను ఎక్కువసేపు మోయలేననీ, మోయలేనప్పుడు మూడుసార్లు తమను పిలుస్తాననీ.. మీరు రాకపోతే ఈ లింగాన్ని భూమిపై ఉంచేస్తానని అంటాడు బాల బ్రాహ్మణుడి రూపంలోని వినాయకుడు.

రావణుడు అందుకు అంగీకరించి ఆత్మలింగాన్ని బాల బ్రాహ్మణుడి చేతిలో పెట్టి సంధ్య వార్చుకునేందుకు వెళతాడు. రావణుడు వెళ్లిన కాసేపటికే తాను లింగాన్ని మోయలేకపోతున్నానంటూ వినాయకుడు మూడుసార్లు పిలుస్తాడు. సంధ్యవార్చే కార్యక్రమం మధ్యలో ఉండటంతో కాస్త ఆలస్యంగా వస్తాడు రావణుడు. ఈలోగా వినాయకుడు ఆత్మలింగాన్ని భూమిమీద పెట్టేస్తాడు. దాంతో కోపంతో రావణుడు వినాయకుడి నెత్తిపై మొత్తగా, అతడికి గుంట పడుతుంది.

ఈలోగా తాను అనుకున్న కార్యం నిర్విఘ్నంగా జరిగిపోవటంతో సంతోషించిన విష్ణువు, మాయపొరను తొలగిస్తాడు. దీంతో వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. వెంటనే విషయాన్ని గ్రహించిన రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో పెకిలించే ప్రయత్నం చేస్తాడు. లింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నంచేసి విసిరివేయగా అది గోకర్ణ అనే ప్రాంతానికి 23 కిలోమీటర్ల దూరంలోని "సజ్జేశ్వర" అనే ప్రదేశంలో పడుతుంది.

No comments:

Post a Comment